ఖమ్మం, మార్చి 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ కచ్చితంగా అమలుచేసి ఇందిరమ్మ రాజ్యమంటే ఏమిటో ప్రజలకు చూపిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరుగ్యారెంటీల్లో ఐదో గ్యారెంటీ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పథకాన్ని ముఖ్యమంత్రి భద్రాచలంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ప్రసంగించారు. రాష్ట్రంలో ఇళ్లు లేని పేదవాడు ఉండకూడదన్నది తమ ప్రభుత్వ లక్ష్యమని, ఇందుకు అనుగుణంగా రాష్ట్రంలో నాలుగున్నర లక్షల ఇందిరమ్మ ఇళ్లు నిర్మించాలని నిర్ణయించామని, ఇందుకు గాను 22,500 కోట్ల రూపాయలను కేటాయించినట్లు ముఖ్యమంత్రి వివరించారు. అందరికీ సొంత ఇల్లు ఉండటమనేది చిరకాల స్వప్నంగా ఉంటుందని, ఆ కల సాకారమైతే అంతులేని ఆనందం ఉంటుందని ఇల్లాలు ఆనందంగా ఉంటే ఆ ఇల్లు ఆనందంగా ఉన్నట్లేనని, అందుకే ఇల్లాలిని చూసి ఇల్లు చూడమంటారని రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. మహిళల సొంతింటి కల నెరవేర్చడంతో పాటు తాము ఇచ్చే ఇందిరమ్మ ఇళ్లను మహిళల పేరుతోనే పట్టాలు మంజూరు చేయాలని నిర్ణయించామని, అర్హులైన ప్రతి పేదమహిళలకు ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చే బాధ్యత తమ ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. తాము గత ప్రభుత్వాల మాదిరిగా అలవికాని హామీలివ్వలేదని, ఇచ్చిన హామీని కచ్చితంగా నెరవేర్చామని ఆయన అన్నారు. భద్రాచలం ప్రాంత అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇక్కడ ప్రజల సమస్యల పరిష్కారానికి కృషిచేస్తామని, భద్రాచలంలో గతంలో తాను పాదయాత్ర చేసిన సందర్భంగా అనేక సమస్యలు తన దృష్టికి తీసుకువచ్చారని, వాటిని పరిష్కరిస్తామన్నారు.
తమ ప్రభుత్వం అధికారం రాగానే రూ.500కోట్లతో రిటైనింగ్ వాల్ నిర్మాణానికి మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి నిధులు మంజూరు చేశారని ఆయన అన్నారు. ప్రజల సంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యమని, ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500కే గ్యాస్ సిలిండర్, 200 లోపు యూనిట్లకు ఉచిత విద్యుత్, రూ.10 లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ వంటి పథకాలను అమలుచేస్తున్నామని, కేంద్రంలో మోదీ, గత ప్రభుత్వంలో ఉన్న కేసీఆర్ ప్రజలపై పన్నులభారం మోపారే తప్ప వారు చేసిందేమీలేదని, ప్రధాని మోదీ రూ.60 ఉన్న పెట్రోల్ రూ.110 చేశారని, రూ.50 డీజిల్ను రూ.100 చేశారని, గ్యాస్ ధరను రూ.1,200కు పెంచిన ఘనత ప్రధాని మోదీదేనని ఆయన విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ప్రజలకు చేసింది ఏమీలేదన్నారు. డబుల్ బెడ్ రూం ఇళ్లను కేసీఆర్ ప్రభుత్వం పూర్తిస్థాయిలో నిర్మిస్తే, డబుల్ బెడ్రూం నిర్మాణం పూర్తయిన గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఓట్లు అడగాలని, తాము ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పూర్తిచేసుకున్న గ్రామాల్లో ఓట్లు అడుగుతామని సవాల్ విసిరారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఎన్ని ఇళ్లు నిర్మించిందో బీజేపీ నేతలు చెప్పాలని, ఈ విషయంపై బీజేపీ నేతలు ఈటల రాజేందర్, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, ఎంపీ లక్ష్మణ్ సమాధానం చెప్పాలన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ పెద్ద పెద్ద మాటలతో ప్రజలను ఆకర్షించడమే తప్ప సమస్యల పరిష్కారానికి పూనుకున్నది ఏమీలేదన్నారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ కార్యక్రమాన్ని రేవంత్రెడ్డి ప్రారంభించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ నమూనాను ఈ సందర్భంగా సీఎం ఆవిష్కరించారు. ముఖ్యమంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ధనసరి సీతక్క, కొండా సురేఖ, దుద్దిళ్ల శ్రీధర్బాబు, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి, ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, సీపీఐ శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు, భద్రాద్రి జిల్లా కలెక్టర్ ప్రియాంక ఆల, ఎస్పీ రోహిత్రాజు పాల్గొన్నారు.
భద్రాచలం, మార్చి 11: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి భద్రాచలం పర్యటనలో అపశ్రుతి చోటుచేసుకున్నది. సీఎం పట్టణంలోని మార్కెట్ యార్డుకు వస్తున్నారని తెలిసి ఏఎస్పీ పరితోశ్ పంకజ్ అక్కడ పోలీస్ సిబ్బంది బందోబస్తును పర్యవేక్షిస్తున్నారు. ఈ క్రమంలో ఏఎస్పీని సీఎం కాన్వాయ్లో ఓ వాహనం ప్రమాదవశాత్తు తగిలింది. ఘటనలో ఏఎస్పీ తీవ్ర గాయాలపాలయ్యారు. ఎస్పీ రోహిత్రాజు ఆదేశాల మేరకు అనంతరం హైదరాబాద్లోని ఓ ఆసుపత్రికి తరలించారు.
సారపాక, మార్చి 11: భద్రాచలం పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సోమవారం ముందుగా హెలీకాఫ్టర్లో సారపాక బీపీఎల్ స్కూల్ గ్రౌండ్ హెలిప్యాడ్ వద్ద ల్యాండ్ అయ్యారు. సీఎం వెంట ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు అధికారులు ఉన్నారు.
భద్రాచలం, మార్చి 11: భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయంలో సోమవారం స్వామివారిని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, జిల్లా ఇన్చార్జి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, దేవాదాయ, ధర్మాదాయశాఖ మంత్రి కొండా సురేఖ, ఇతర మంత్రులు సీతక్క, దుద్దిళ్ల శ్రీధర్బాబు, ఉత్తమ్కుమార్రెడ్డి, పొన్నం ప్రభాకర్ దర్శించుకున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం, మార్చి 11 (నమస్తే తెలంగాణ): ఏడాదికి 2 కోట్ల చొప్పున యువతకు ఉద్యోగాలిస్తామని కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం పదేళ్లు పూర్తి కావొస్తున్నా ఆ హామీని పట్టించుకోవడం లేదని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మండిపడ్డారు. భద్రాద్రి జిల్లా మణుగూరు పట్టణంలో సోమవారం పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అధ్యక్షతన నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. స్విస్ బ్యాంకుల్లోని నల్లధనం తెప్పించి, నిరుపేదల ఖాతాల్లో జమ చేస్తామని నాడు మోదీ ప్రగల్భాలు పలికారన్నారు. ఇప్పటివరకు నల్లధనం తేలేదని, అలాగే పేదల ఖాతాల్లో ఒక్క పైసా కూడా జమ చేయలేదని ధ్వజమెత్తారు. 2022కి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానన్న మోదీ ఇప్పుడు రైతు ఆత్మహత్మలకు కారణమయ్యారని విమర్శించారు. రైతులు మద్దతు ధర కోసం ఢిల్లీ వెళితే వారిపై తూటాలు పేలుస్తున్నారన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో 14 సీట్లు గెలవబోతున్నదన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాతో తమకు మంచి అనుబంధం ఉన్నదని సీఎం అన్నారు. ఇక్కడి ప్రజలు చైతన్యవంతులన్నారు. 1969లో తెలంగాణ ఉద్యమం పాల్వంచ కేంద్రంగా పురుడు పోసుకున్నదని గుర్తుచేశారు. ఉప ముఖ్యమంత్రి మల్లు విక్రమార్క మాట్లాడుతూ.. తమది పేదల ప్రభుత్వమన్నారు. అందుకే ప్రజలు తమ పార్టీని గెలిపించి అధికారం కట్టబెట్టారన్నారు. తమ ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పదన్నారు.
భద్రాచలం, మార్చి 11: కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను పక్కాగా అమలు చేస్తుందని, తమది మాటల ప్రభుత్వం కాదని, చేతల ప్రభుత్వమని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క అన్నా రు. భద్రాచలంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో సోమవారం వారు సీఎం రేవంత్రెడ్డితో కలిసి ఇందిరమ్మ ఇంటి పథకాన్ని ప్రారంభించి అనంతరం మాట్లాడారు. నిరుపేదల కళ్లలో ఆనందాన్ని చూడడమే కాంగ్రెస్ ప్రభు త్వ ధ్యేయమన్నారు. భద్రాచలంలో కరకట్ట వాల్ రివిటింగ్కు రూ.500 కోట్లు కేటాయించామన్నారు. ఇప్పటికే పను లు ప్రారంభమయ్యాయన్నారు. అలాగే రామాలయ అభివృద్ధికీ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని హామీ ఇచ్చారు. ఒక్కో నియోజకవర్గం నుంచి 3,500 లబ్ధిదారులను ఎంపిక చేసి వారికి ఇందిరమ్మ పథకం వర్తింపజేస్తామన్నారు.