మధిర, సెప్టెంబర్ 10 : తెలంగాణ ప్రభుత్వ హయాంలో సీఎం సహాయ నిధి అనారోగ్య బాధితులకు వరంలా మారింది. పేద, ధనిక తేడా లేకుండా అనారోగ్యం పాలై ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులకు నేనున్నా.. అంటూ సీఎం కేసీఆర్ భరోసా కల్పిస్తున్నారు. ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స కోసం ఖర్చు పెట్టిన డబ్బులను సీఎం రిలీఫ్ఫండ్ ద్వారా చెక్కుల రూపంలో అందిస్తూ ఆదుకుంటున్నారు. మధిర నియోజకవర్గంలో ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే భట్టివిక్రమార్క 15 ఏళ్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎమ్మెల్సీగా పనిచేసినా ఇప్పటివరకు కేవలం 300లోపు సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంజూరు చేయించి ఉంటారని బాధితులు చెబుతున్నారు. అయితే జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు మూడేళ్ల పదవీ కాలంలో 1,752 మంది బాధితులకు తెలంగాణ ప్రభుత్వం మంజూరు చేసిన సుమారు రూ.5 కోట్ల విలువైన చెక్కులను అందించారు.
బాధిత కుటుంబాలకు సీఎం రిలీఫ్ఫండ్ అందించడం కోసం మధిరలో ప్రత్యేక కౌంటర్ను జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు ఏర్పాటు చేశారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మధిర నియోజకవర్గానికి ప్రతిపక్ష ఎమ్మెల్యే పదవిలో కొనసాగడం.. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను పట్టించుకోవడం లేదనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేకు ఇస్తున్న ప్రాధాన్యతను మధిర బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్, గత ఎన్నికల్లో ఓటమిపాలైన లింగాల కమల్రాజుకు ఇచ్చారు. ఆయనకు జడ్పీ చైర్మన్ పదవిని అప్పగించారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేయాలని ఆదేశించడంతో కమల్రాజు ఆనాటి నుంచి నియోజకవర్గంలోని మధిర, బోనకల్లు, ఎర్రుపాలెం, ముదిగొండ, చింతకాని మండలాల్లోని ప్రజలకు అనునిత్యం అందుబాటులో ఉంటున్నారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజలకు చేరువ చేయడంలో తనవంతు బాధ్యతగా ముందుకు సాగుతున్నారు. మంత్రి పువ్వాడ అజయ్కుమార్, ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ సూచనలు, సలహా మేరకు బాధితులు ఇచ్చిన దరఖాస్తులను ఎప్పటికప్పుడు వారికి తెలియజేస్తూ సీఎం రిలీఫ్ఫండ్ చెక్కుల మంజూరుకు కృషి చేస్తున్నారు.
నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో గల బాధిత కుటుంబాలకు సీఎం కేసీఆర్ రూ.5 కోట్ల సీఎం రిలీఫ్ఫండ్ మంజూరు చేశారు. ఆయా చెక్కులను ఎంపీ, మంత్రి, ఎమ్మెల్యే కార్యాలయాలకు సీఎం ఆఫీసు నుంచి పంపించారు. చెక్కులను జడ్పీ చైర్మన్ గ్రామాలవారీగా బాధిత కుటుంబాలకు అందజేస్తున్నారు. జడ్పీ చైర్మన్ బాధ్యతతో మూడేళ్లలో 1,752 మందికి రూ.5 కోట్ల విలువైన చెక్కులను మంత్రి పువ్వాడ, ఎంపీ నామా, ఎమ్మెల్సీ తాతా మధుతో కలిసి పంపిణీ చేశారు.
ప్రజలు అనారోగ్యం పాలై ఆస్పత్రిలో వైద్యం కోసం ఖర్చు చేసిన ప్రతి రూపాయి తెలంగాణ ప్రభుత్వం ద్వారా బాధిత కుటుంబాలకు సీఎం రిలీఫ్ఫండ్ చెక్కు రూపంలో అందుతున్నది. గతంలో ఆస్పత్రికి వెళ్లాలంటే పొలాలను తాకట్టు పెట్టుకొని, వడ్డీకి తెచ్చుకొని వైద్యం చేయించుకున్న పరిస్థితులు ఉండేవి. బాధితులకు సహాయం చేసేవారు లేక.. ఆస్పత్రుల చుట్టూ తిరిగి అప్పులపాలైన పరిస్థితులు కోకొల్లలు. కానీ.. ప్రస్తుతం బాధితులు ఆస్పత్రిలో వైద్యం కోసం ఖర్చు పెట్టిన డబ్బులను తిరిగి తెలంగాణ ప్రభుత్వం సీఎం రిలీఫ్ఫండ్ ద్వారా ఇస్తుందన్న నమ్మకంతో ఉన్నారు. పార్టీలు అనే వ్యత్యాసం లేకుండా బాధితులు అయితే చాలు వారికి ఆదుకోవడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ సూచన మేరకు ముందుకు సాగుతున్నారు.
సీఎం కేసీఆర్ పాలనలో అర్హులందరికీ ప్రభుత్వ పథకాలను చేరువ చేశా. ఇక్కడి కాంగ్రెస్ ఎమ్మెల్యే మూడుసార్లు గెలిచినా ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందించడంలో విఫలమయ్యారు. నేను స్వయంగా బాధిత కుటుంబాలకు న్యాయం చేసేందుకు సీఎం రిలీఫ్ఫండ్ ద్వారా వారికి ప్రభుత్వం నుంచి ఆర్థిక వెసులుబాటు కల్పించాను. మధిర నియోజకవర్గంలో దాదాపు రూ.5 కోట్లకు పైగానే చెక్కులు, ఎన్వోసీ రూపంలో బాధితులకు అందించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కింది.
– లింగాల కమల్రాజు, జడ్పీ చైర్మన్
మా తాతయ్య కరోనా సమయంలో ఆస్పత్రిలో మృతిచెందాడు. ఆస్పత్రుల చుట్టూ తిరుగడంతో భారీగా ఖర్చు కావడంతోపాటు అప్పులు అయ్యాయి. దీంతో జడ్పీ చైర్మన్ ద్వారా సీఎం సహాయనిధికి దరఖాస్తు చేశాం. ఆరు నెలల్లోనే మాకు రూ.5 లక్షల చెక్కు వచ్చింది. అప్పులన్నీ తీర్చాం. ఇప్పుడు ఇబ్బందులు లేవు. మేం సీఎం కేసీఆర్ను మరిచిపోలేం.
– పాషా, యడవల్లి, ముదిగొండ మండలం
నాకు క్యాన్సర్ సోకిందని వైద్య పరీక్షల్లో తేలింది. హైదరాబాద్లోని ఓ ప్రైవేటు పెద్దాస్పత్రిలో చికిత్స చేయించుకోగా వ్యాధి నయమైంది. కానీ.. వైద్యం కోసం చేతిలో ఉన్న డబ్బుతోపాటు అప్పులు కూడా చేశాం. ఈ క్రమంలోనే సీఎంఆర్ఎఫ్కు దరఖాస్తు చేసుకున్నాం. మాకు రూ.7 లక్షలు వచ్చాయి. ఈ డబ్బులు రాకపోయి ఉంటే ఇబ్బంది పడేవాళ్లం. సీఎం కేసీఆర్ సారుకు మేము రుణపడి ఉంటాం.
– జ్యోతి, గంధసిరి, ముదిగొండ మండలం
ఆస్పత్రి ఖర్చుల కోసం ఆరు నెలల క్రితం జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు ద్వారా సీఎంఆర్ఎఫ్కు దరఖాస్తు చేసుకున్నాం. దీంతో మాకు రూ.31వేల చెక్కు అందింది. సీఎంఆర్ఎఫ్ చెక్కు మాకు చేదోడు వాదోడుగా నిలిచింది. సీఎం కేసీఆర్కు, జడ్పీ చైర్మన్కు ప్రత్యేక కృతజ్ఞతలు.
– సునీత, ప్రొద్దుటూరు