కల్లూరు, జనవరి 21 : పంచాయతీల అభివృద్ధికే సీఎం కేసీఆర్ ప్రత్యేక నిధులు కేటాయించారని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. ఖమ్మంలో జరిగిన బీఆర్ఎస్ సభలో సీఎం కేసీఆర్ కల్లూరు మేజర్ పంచాయతీకి రూ.10 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించడం పట్ల కల్లూరు సర్పంచ్ లక్కినేని నీరజ ఆధ్వర్యంలో శనివారం సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య చిత్రపటాలకు పూలు, పాలతో అభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మాట్లాడుతూ.. కల్లూరు అభివృద్ధికి పాటుపడుతున్న సర్పంచ్ నీరజ, పంచాయతీ పాలకవర్గాన్ని అభినందించారు. బీఆర్ఎస్ సభను విజయవంతం చేసినందుకు నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు, నాయకులు, ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కల్లూరు మండలానికి నెలలోనే రూ.65 కోట్లు నిధులు మంజూరు చేయించి అభివృద్ధి పనులు చేపట్టామన్నారు.
కల్లూరు మండలంలో 30 జీపీలకు రూ.10 లక్షలతో రూ.3 కోట్లను వెచ్చించి ప్రతి పంచాయతీని అభివృద్ధి పథంలో నిలుపుతున్నామన్నారు. రూ.4.25 కోట్లతో గ్రామాల్లో లింకురోడ్లను సీసీ రోడ్లను నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. కల్లూరు అంబేద్కర్నగర్తోపాటు ఇతర గ్రామాల్లో కమ్యూనిటీ హాళ్లను రూ.5 కోట్లతో త్వరలో నిర్మించనున్నట్లు తెలిపారు. కల్లూరు మండలంలో ఏడు పల్లె దవాఖానలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. సత్తుపల్లి నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే అభివృద్ధి పథంలో ఉంచానన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ బీరవల్లి రఘు, జడ్పీటీసీ కట్టా అజయ్బాబు, జిల్లా, మండల రైతుబంధు సమితి సభ్యులు పసుమర్తి చందర్రావు, లక్కినేని రఘు, కాటంనేని వెంకటేశ్వరరావు, ఇస్మాయిల్, సయ్యద్ అలీ, తురాబలీ యాకోబు, ఆర్యవైశ్య సంఘం నాయకులు చారుగుళ్ల అచ్యుతరావు, రాంబాబు, ఎస్కె కమ్లీతో పాటు వార్డుసభ్యులు, మండల నాయకులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.