తెలంగాణ ప్రభుత్వం వైద్యరంగానికి పెద్దపీట వేస్తున్నది. సర్కారు దవాఖానల్లో అత్యాధునిక సౌకర్యాలు కల్పించి కార్పొరేట్కు దీటుగా సేవలందిస్తున్నది. ఆసుపత్రుల్లో మందుల కొరత లేకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నది. వైద్యులు, సిబ్బంది రోగులకు అందుబాటులో ఉండేలా చొరవ తీసుకుంటున్నది. పేదల ఆరోగ్యానికి భరోసా కల్పించేలా అనేక కార్యక్రమాలు చేపడుతున్నది. ఇందులోభాగంగా గ్రామస్థాయి నుంచి పట్టణం వరకు ఆశ కార్యకర్తలు, ఏఎన్ఎంలు ఇంటింటికీ వెళ్లి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. దీర్ఘకాలిక వ్యాధులను గుర్తించడంతోపాటు 10 రకాల వైద్యపరీక్షలు చేస్తున్నారు. ఇతర దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారిని జిల్లా ప్రభుత్వాసుపత్రికి సిఫార్సు చేస్తున్నారు. రక్తపోటు, మధుమేహంతో బాధపడేవారిని గుర్తించి వారికి నెలనెలా ఉచితంగా ఎన్సీడీ మెడిసిన్ కిట్స్ పంపిణీ చేస్తున్నారు. ప్రస్తుతం ఖమ్మం జిల్లావ్యాప్తంగా 1.34 లక్షల మంది రక్తపోటు, మధుమేహ బాధితులు ఉన్నారు. వీరిలో అవసరమైనవారికి మందులు అందజేస్తున్నది. ప్రస్తుతం జిల్లాకు 48,543 కిట్స్ అవసరం కాగా, ఇప్పటికి 47,701 కిట్స్ అందాయి. వీటిలో 35,060 కిట్స్ పీహెచ్సీలకు సరఫరా చేయగా.. 24 వేల మంది బాధితులకు కిట్స్ పంపిణీ చేశారు.
కూసుమంచి, డిసెంబర్ 15: ప్రజారోగ్య సంరక్షణపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నది. ప్రభుత్వ దవాఖానల్లో అత్యాధునిక సాంకేతికతను సమకూర్చి వాటిని బలోపేతం చేస్తున్నది. రాష్ర్టాన్ని ఆరోగ్య తెలంగాణ వైపు అడుగులు వేయిస్తున్నది. దీనిలో భాగంగా వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్నది. గ్రామాల్లో పారిశుధ్యంపై ఫోకస్ చేసి ప్రతి మంగళ, శుక్రవారాల్లో డ్రై డే నిర్వహిస్తున్నది. సీజనల్ వ్యాధులను కట్టడి చేస్తున్నది. ‘కంటి వెలుగు’ కార్యక్రమం నిర్వహించి కంటి సమస్యలతో బాధపడుతున్న వారి బాధలను తొలగించింది. వచ్చే నెల నుంచి మరోసారి ‘కంటి వెలుగు’డ్రైవ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. దీర్ఘకాలిక వ్యాధుల గుర్తింపునకు వైద్యసిబ్బంది ఇంటింటికీ వెళ్లి 10 రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. రక్తపోటు, మధుమేహంతో బాధపడేవారిని గుర్తించి వారికి నెల నెలా ఉచితంగా ఎన్సీడీ మెడిసిన్ కిట్స్ పంపిణీ చేస్తున్నారు. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా 1.34 లక్షల మంది రక్తపోటు, మధుమేహ బాధితులు ఉన్నారు. వీరిలో మెడిసిన్ అవసరమైన వారికి వైద్యారోగ్యశాఖ నెల నెలా ఎన్సీడీ కిట్స్ అందిస్తున్నది. డీఎంహెచ్వో, జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్, వైద్యాధికారులు పక్కాగా ప్రణాళికలు అమలు చేస్తున్నారు. ఇతర దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారిని జిల్లా ప్రభుత్వాసుపత్రికి సిఫార్సు చేస్తున్నారు.
మూడు దశల్లో స్క్రీనింగ్ ఇలా..
పట్టణం నుంచి గ్రామస్థాయి వరకు ఆశ కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు.దీర్ఘకాలిక వ్యాధి లక్షణాలు ఉన్నవారిని గుర్తించి స్థానిక ఏఎన్ఎంలకు సమాచారం ఇస్తున్నారు. ఏఎన్ఎంలు బాధితుల ఇంటికి వెళ్లి వారితో మాట్లాడుతున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి సిఫార్స్ చేస్తున్నారు. పీహెచ్సీ వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించి వ్యాధులను నిర్ధారిస్తున్నారు. బాధితులకు వైద్యపరీక్షలకు సంబంధించిన కార్డులు అందజేస్తున్నారు. వ్యాధి తీవ్రత ఎక్కువ ఉన్నవారిని జిల్లా ప్రధానాసుపత్రికి సిఫార్స్ చేస్తున్నారు. ఉదాహరణకు ఒక వ్యక్తికి క్యాన్సర్ లక్షణాలు ఉంటే వారికి ప్రాథమిక వైద్యపరీక్షలు నిర్వహిస్తారు. మహిళల్లో రొమ్ము క్యాన్సర్, గర్భసంచి క్యాన్సర్ను గుర్తించి బాధితులను హైదరాబాద్లోని ఎంఎన్ఆర్ ఆసుపత్రికి సిఫార్స్ చేస్తున్నారు.
ఎన్సీడీ కిట్స్ పంపిణీ ఇలా..
వైద్యసిబ్బంది గుర్తించిన రక్తపోటు, మధుమేహ బాధితులకు ప్రభుత్వం ఇంటికే ఎన్సీడీ కిట్లు ఇవ్వాలని నిర్ణయించింది. ప్రస్తుతం జిల్లాకు 48,543 కిట్స్ అవసరం ఉండగా ఇప్పటికి 47,701 కిట్స్ అందాయి. వీటిలో 35,060 కిట్స్ పీహెచ్సీకి సరఫరాచేశారు. సోమవారం వరకు జిల్లావ్యాప్తంగా 24 వేల మంది బాధితులకు కిట్స్ అందాయి.
కిట్స్ ప్రత్యేకతలు ఇవీ..
వ్యాధి బాధితులు ఉదయం, మధ్యాహ్నం, రాత్రి మెడిసిన్ తీసుకోవాల్సి ఉంటుంది. నిరక్షరాస్యులు, వృద్ధులకు ఏ సమయంలో ఏ మాత్ర వేసుకోవాలనే విషయంపై స్పష్టత ఉండదు. ఈ సమస్యను పరిగణలోకి తీసుకున్న వైద్యారోగ్యశాఖ కిట్స్లో అరలు ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నది. తెలుపు రంగు అరలో ఉదయం మాత్రలు, గోధుమ రంగు అరలో మధ్యాహ్నం మాత్రలు, నలుపు రంగు అరలో రాత్రి మాత్రలు పెడుతున్నది. వైద్యసిబ్బంది ఇంటింటికీ వెళ్లి కిట్స్ పంపిణీ చేసేటప్పుడు మాత్రల వినియోగంపై అవగాహన కల్పిస్తున్నారు. ముఖ్యంగా మంచాన పడి లేవలేని స్థితిలో ఉన్న వారికి ఇంటి వద్దే కిట్స్ అందిస్తుండడం ఉపశమనాన్నిస్తున్నది.
వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు..
రాష్ట్ర ప్రభుత్వ చొరవతో వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. దీనిలో భాగంగా రక్తపోటు, మధుమేహ బాధితుల ఆరోగ్య సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నది. ఇంటింటికీ వెళ్లి ఉచితంగా వైద్యపరీక్షలు నిర్వహించి నెల నెలా ఇంటికే మెడిసిన్ పంపిస్తున్నది. దీర్ఘకాలిక వ్యాధి బాధితులు ఎవరి సాయం లేకుండానే సొంతంగా పూటల వారీగా మెడిసిన్ వేసుకునేలా ఎన్సీడీ కిట్స్ పంపిణీ అవుతున్నాయి.
– కోటిరత్నం, జిల్లా ప్రోగ్రాం అధికారి, ఖమ్మం
ఇంటికి వచ్చి మందులు ఇస్తున్నారు..
గతంలో ఎలాంటి వైద్యపరీక్ష చేయించుకోవాలన్నా దవాఖానకు వెళ్లాల్సి వచ్చేది. మాలాంటి వృద్ధులకు కొంచెం కష్టంగా ఉండేది. కానీ ఇప్పుడు ఇంటి వద్దే వైద్యసిబ్బంది పరీక్షలు చేస్తున్నారు. ఒక్కసారి వైద్యపరీక్షలు చేయించుకుంటే చాలు. వైద్యులు వ్యాధిని నిర్ధారించి ప్రతి నెలా ఇంటికే మందులు పంపిస్తున్నారు. కిట్లో నెలకు సరిపడా మందులు ఉంటున్నాయి.
– ఆడెపు వీరమ్మ, రక్తపోటు బాధితురాలు, కూసుమంచి
దీర్ఘకాలిక వ్యాధులకు ఉచితంగా మెడిసిన్..
దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారిని వైద్యారోగ్యశాఖ గుర్తిస్తున్నది. నెల నెలా వారి ఇంటికే వెళ్లి ఎన్సీడీ కిట్లు అందజేస్తున్నది. మూడు దశల్లో ప్రజలకు వైద్యపరీక్షలు నిర్వహిస్తున్నాం. వ్యాధి తీవ్రత ఎక్కువ ఉన్న వారిని ఖమ్మంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి రిఫర్ చేస్తున్నాం. ప్రభుత్వ వైద్యాన్ని ప్రజలకు మరింత చేరువ చేస్తున్నాం.
– శ్రీనివాస్, మండల వైద్యాధికారి, కూసుమంచి