ఎండనకా వాననకా.. రాత్రనకా పగలనకా.. శ్రమించి పండించిన పంటను అకాల వర్షం ముంచేసింది.. మరికొన్ని రోజుల్లో చేతికొస్తుందనగా నీటిపాలు చేసింది.. పంటకు పెట్టిన పెట్టుబడంతా బూడిదపాలైంది.. రైతుకు కంట కన్నీరే మిగిలింది.. తీరని దుఃఖంలో ఉన్న అన్నదాతల్లో భరోసా నింపేందుకు.. మనోధైర్యాన్ని కల్పించేందుకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు గురువారం ఖమ్మం జిల్లా బోనకల్లు మండలానికి విచ్చేశారు.. గార్లపాడు, రావినూతల గ్రామాల్లో నేలవాలిన పంటలను పరిశీలించారు. రైతుల కష్టాలు విని చలించిపోయారు. ఒక్కో ఎకరానికి రూ.10 వేల చొప్పున పరిహారం అందిస్తామన్నారు. కౌలు రైతులకూ పరిహారం అందజేస్తామని సీఎం కేసీఆర్ మరోసారి రైతు పక్షపాతిగా నిలిచారు. – నమస్తే నెట్వర్క్
ఖమ్మం, మార్చి 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ముఖ్యమంత్రి ఉదయం 11.50 గంటకు హెలీప్యాడ్ వద్దకు చేరుకున్నారు. 1.20 గంటల పాటు రైతులు, ప్రజాప్రతినిధులు, వామపక్ష నేతలు, అధికారులతో కలిసి వ్యవసాయ క్షేత్రాల్లోకి వెళ్లి పంట నష్టాన్ని స్వయంగా పరిశీలించారు. తీరని దుఃఖంలో ఉన్న రైతుల భుజం తట్టి సీఎం కేసీఆర్ వారి బాధలను ఆలకించారు. ఎవరెవరు ఏయే పంటలు పండించారు? ఎకరానికి ఎంత పెట్టుబడి పెట్టారు? ఎంత మేరకు నష్టం వాటిల్లింది? అనే అంశాలను కూలంకషంగా తెలుసుకున్నారు. ప్రతి రైతుకూ అండగా ఉంటామని భరోసానిచ్చారు. ఏమాత్రం నిరాశ పడొద్దన్నారు. పంట నష్టంపై మంత్రి పువ్వాడ అజయ్కుమార్, కలెక్టర్ వీపీ గౌతమ్తో చర్చించారు. పరిహారం కోసం తక్షణం నిధులు విడుదల చేయాలని ప్రభుత్వ సీఎస్ శాంతికుమారిని ఆదేశించారు. నివేదికలు సిద్ధం చేయాలని వ్యవసాయశాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. అనంతరం మీడియాతో విలేకర్ల సమావేశం నిర్వహించారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10 వేల చొప్పున ఇస్తున్నట్లు ప్రకటించారు. రైతులకు ప్రభుత్వం అండగా ఉందని, పరిహారం కచ్చితంగా అందుతుందని హామీ ఇచ్చారు. సాధారణ రైతులతో పాటు కౌలు రైతులకూ పరిహారం అందజేస్తామని సీఎం కేసీఆర్ మరోసారి రైతు బాంధవుడిగా నిలిచారు. మొత్తానికి సీఎం కేసీఆర్ పర్యటన రైతాంగంలో మనోధైర్యాన్ని కల్పించింది..
రైతు : నాకు రెండెకరాల భూమి మాత్రమే ఉంది. వానకాలంలో పత్తి సాగు చేస్తే నష్టం వచ్చింది. యాసంగిలో నాకున్న నాకున్న భూమితో పాటు 33 ఎకరాలు కౌలుకు తీసుకుని మొత్తం 35 ఎకరాల్లో మక్కలు సాగు చేశాను. ఒక్కో ఎకరానికి రెండు పంటలకు కలిపి రూ.25 వేలు కౌలు చెల్లించాలి. అకాల వర్షం కారణంగా మేం పూర్తిగా నష్టపోతున్నాం. మీరే ఆదుకోవాలి సార్..
సీఎం కేసీఆర్: (రైతు భుజం మీద చేయి వేసి మాట్లాడుతూ..) మీరేం అధైర్యపడొద్దు. రాష్ట్ర ప్రభుత్వం మీకు అండగా నిలుస్తుంది. ఎకరానికి రూ.10 వేల చొప్పున పరిహారం అందిస్తుంది.
రైతు : కౌలు రైతులకూ న్యాయం చేస్తున్నందుకు కృతజ్ఞతలు సార్..
సీఎం కేసీఆర్: మీరు ఏయే పంటలు సాగు చేశారు..?
రైతు : నేను వానకాలంలో పతి సాగు చేసి నష్టపోయాను. యాసంగిలో 18 ఎకరాలు కౌలుకు తీసుకుని మక్కలు పండిస్తున్నాను. అకాల వర్షం పంటను ముంచేసింది. మాకు తీరని నష్టాన్ని మిగిల్చింది. గత ప్రభుత్వాలు ఎకరానికి రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు మాత్రమే పరిహారం ఇచ్చేవి. మాకు జరిగిన నష్టాన్ని గుర్తించి పరిహారం అందివ్వాలి.
సీఎం కేసీఆర్: మీరు మనోధైర్యాన్ని కోల్పోవద్దు. నష్టాన్ని పరిగణనలోకి తీసుకుని పరిహారం అందిస్తాం. కౌలు రైతులకూ న్యాయం చేస్తాం.
రైతు : మమ్మల్ని ఆదుకోవడానికి ముందుకొచ్చిన మీకు కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాం సార్..