మామిళ్లగూడెం, జనవరి 16: ఖమ్మంలో ఈనెల 18న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ‘కంటి వెలుగు’ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారని, 19న ఉదయం 9 గంటల నుంచి రాష్ట్రవ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, శాసనమండలి సభ్యులు, జడ్పీ చైర్మన్లు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు అన్ని చోట్లా శిబిరాలను ప్రారంభించాలని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అదేశించారు. ఖమ్మం కలెక్టరేట్ నుంచి సోమవారం ఎంపీ నామా నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్రతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా కంటి వెలుగు నిర్వహిస్తున్నదని, అధికారులు సమన్వయంతో పనిచేసి పకడ్బందీగా అమలు చేయాలని సూచించారు. క్యాంపుల వద్ద పోలీస్ బందోబస్తు ఉండాలన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు ఉండొద్దన్నారు. కలెక్టర్లు, డీఎంహెచ్వోలు వాట్సాప్ గ్రూప్ల ద్వారా కంటి వెలుగు బృందాలను మానిటరింగ్ చేయాలని సూచించారు.
బృందాలకు సమీప పట్టణాలు, మండల కేంద్రాల్లో వసతి కల్పించాలన్నారు. బృందాలు ఉదయం 8:45 గంటలకు శిబిరాల వద్దకు చేరుకోవాలన్నారు. పంచాయతీ కార్యదర్శులు, అంగన్వాడీ టీచర్లు, ఆశ కార్యకర్తలు, ఆర్పీలు, వీఆర్ఏలను కార్యక్రమాల్లో భాగస్వాములను చేయాలన్నారు. క్యాంపుల నిర్వహణపై ప్రజలకు ముందస్తు సమాచారం ఇవ్వాలన్నారు. ప్రతి ఇంటికీ ఆహ్వాన పత్రిక అందించాలన్నారు. శిబిరానికి ఎప్పటికప్పుడు అవసరమైన సామగ్రి, మెడిసిన్, కళ్ల అద్దాలు అందించాలన్నారు. శిబిరాలకు వచ్చే ప్రజలు తప్పనిసరిగా వారి ఆధార్ కార్డు వెంట తెచ్చుకోవాలన్నారు. క్యాంపుల నిర్వహణకు ముందుగానే ఆశ కార్యకర్తలు, ఏఎన్ఎంలు గ్రామాల్లోకి వెళ్లాలన్నారు. గ్రామస్తులకు శిబిరంపై అవగాహన కల్పించాలన్నారు. డీఎంహెచ్వోలు, ఎంపీడీవోలు, తహసీల్దార్లు, ఎంపీవోలు, మండల ప్రత్యేక అధికారులు, ప్రోగ్రాం అధికారులు ప్రతిరోజు శిబిరాలను తనిఖీ చేయాలన్నారు.
హైదరాబాద్ నుంచి కాన్ఫరెన్స్లో ప్రభుత్వ సీఎస్ శాంతికుమారి మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా కంటి వెలుగు నిర్వహిస్తున్నదని, కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలన్నారు. గతంలో కంటే బృందాల సంఖ్య రెట్టింపు అయిందన్నారు. శిబిరాల వద్ద ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చూడాలన్నారు. హైదరాబాద్ నుంచి కాన్ఫరెన్స్లో పాల్గొన్న వారిలో డీజీపీ అంజనీకుమార్, రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రిజ్వీ, కమిషనర్ శ్వేత, ఖమ్మం నుంచి కలెక్టర్ వీపీ గౌతమ్, అదనపు కలెక్టర్ స్నేహలత మొగిలి, ఖమ్మం మునిసిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి, డీఎంహెచ్వో బి.మాలతి, జిల్లా ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు, జడ్పీ సీఈవో వీవీ అప్పారావు పాల్గొన్నారు.