నమస్తే నెట్వర్క్ ;గత ప్రభుత్వాల హయాంలో ఏళ్ల తరబడి భూ సమస్యలు పరిష్కారం కాక రైతులు సతమతమయ్యారు. రైతుల కష్టాలను తెలుసుకున్న సీఎం కేసీఆర్ వజ్రాయుధం వంటి ధరణి పోర్టల్ను తీసుకొచ్చి పారదర్శకతకు పెద్దపీట వేశారు. ఆన్లైన్ విధానంలో అంతా సవ్యంగా జరిగేందుకు రూపకల్పన చేసి రైతులు ‘పట్టా’లతో మురిసిపోయేలా చేశారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఉమ్మడి జిల్లాలో సుపరిపాలన దినోత్సవాన్ని శనివారం పండుగ వాతావరణంలో నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో ప్రభుత్వ విప్ రేగా, ఎమ్మెల్యేలు సండ్ర, కందాళ, రాములునాయక్, వనమా ఆయా మండల్లాల్లో పాల్గొన్నారు. రైతులకు పట్టాలు పంపిణీ చేశారు. –
సుపరిపాలన దినోత్సవంలో ఎమ్మెల్యే సండ్ర
భూ రికార్డుల్లో సమూల మార్పులు తీసుకొచ్చి వజ్రాయుధం వంటి ధరణి పోర్టల్ను ప్రారంభించిన ఘనత సీఎం కేసీఆర్ది అని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. శనివారం కల్లూరు రైతు వేదికలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా జరిగిన సుపరిపాలన దినోత్సవంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. పడమటి లోకవరానికి చెందిన రైతులు 40 ఏళ్లుగా భూమి సాగు చేసుకుంటున్నా పట్టాలు లేకపోవడంతో ఆయన కలెక్టర్, అధికారులతో మాట్లాడి 69 ఎకరాలకు చెందిన 55 మంది రైతులకు పట్టాలు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వాల హయాంలో ఏళ్లతరబడి భూ హక్కు పత్రాలు లేకుండా ఇబ్బందులు పడుతున్న రైతులకు పట్టాలివ్వడం ఆనందంగా ఉందన్నారు. సీఎం కేసీఆర్ సారథ్యంలో ధరణి పోర్టల్ ప్రవేశపెట్టి పారదర్శకంగా రికార్డులు పొందుపర్చి రైతులకు జవాబుదారీతనంగా ఉండేలా ధరణి పని చేస్తున్నదన్నారు. ప్రతిపక్షాలు ధరణిపై లేనిపోని తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయని విమర్శించారు. సాగునీరు, వ్యవసాయ రంగంపై ప్రత్యేక దృష్టి సారించిన సీఎం కేసీఆర్ రైతులకు అవసరమైన 24 గంటల విద్యుత్, రైతుబంధు, రైతుబీమా అందిస్తూ వ్యవసాయాన్ని పండుగ చేశారన్నారు. కల్లూరు మండలంలో 60వేల ఎకరాల వ్యవసాయ భూమి, 11వేల ఎకరాల వ్యవసాయేతర భూమి, 2,917 ఎకరాల అటవీ భూమి ఉందన్నారు.
తెలంగాణ రాకముందు మండలంలో 27వేల ఎకరాలు సాగవుతుంటే.. తెలంగాణ వచ్చిన తర్వాత 44వేల ఎకరాలకు సాగు పెరిగిందని గుర్తు చేశారు. కల్లూరు మండలంలో రూ.145కోట్ల రైతుబంధు సొమ్ము రైతుల ఖాతాల్లో జమ అయిందని, 256 మంది రైతులు మృతిచెందితే వారి కుటుంబాలకు రూ.12.80కోట్లు రైతుబీమా కింద అందజేశామన్నారు. కల్లూరు మండలాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసేందుకు నూతన రెవెన్యూ డివిజన్ సైతం ఏర్పాటు చేశామన్నారు. ప్రతిపక్షాలు తెలంగాణ ప్రభుత్వంలో చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక పథకాలను విమర్శిస్తున్నారని, గతంలో వారు పరిపాలించినప్పుడు ఈ పథకాలేమీ గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. గృహలక్ష్మి పథకంలో భాగంగా ఈనెలాఖరు నుంచి సొంత స్థలంలో ఇల్లు కట్టుకునేవారికి ఆర్థిక సాయం అందిస్తామన్నారు. కల్లూరు మండలంలో ఇంకా 1,200 ఎకరాలకు పట్టాదారు పాస్పుస్తకాలు అందించాల్సి ఉందని, వారికి త్వరలోనే అందిస్తామన్నారు. అనంతరం ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, ఆర్డీవో సూర్యనారాయణ, తహసీల్దార్ బాబ్జీప్రసాద్లను రైతులు ఘనంగా సత్కరించారు. ఎంపీపీ బీరవల్లి రఘు, జడ్పీటీసీ కట్టా అజయ్బాబు, జిల్లా, మండల రైతు సమన్వయ సమితి సభ్యులు పసుమర్తి చందర్రావు, లక్కినేని రఘు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పాలెపు రామారావు, మార్కెట్ వైస్ చైర్మన్ కాటంనేని వెంకటేశ్వరరావు, డీసీసీబీ డైరెక్టర్ బోబోలు లక్ష్మణరావు, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు ఇస్మాయిల్, కమ్లీ, సర్పంచ్లు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
28 నుంచి ‘గృహలక్ష్మి’ అమలు: ఎమ్మెల్యే సండ్ర
ఈనెల 28 నుంచి సొంత స్థలాల్లో ఇల్లు కట్టుకునేందుకు గృహలక్ష్మి పథకాన్ని అమలు చేస్తున్నట్లు ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య తెలిపారు. రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సుపరిపాలన కార్యక్రమంలో భాగంగా వేంసూరు రైతు వేదికలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సుపరిపాలనకు అర్థం తెలిపిన ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా చేసుకొని పాలన సాగిస్తున్నారని కొనియాడారు. భూ సమస్యలు కలిగిన రైతులు మండలంలో 1,089 మంది ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోగా.. 849 మంది రైతుల భూ సమస్యలు పరిష్కరించినట్లు తెలిపారు. భూ సమస్యలు ఉన్న రైతులు తహసీల్దార్ కార్యాలయం లేదా ఆర్డీవో కార్యాలయంలో దరఖాస్తు చేసుకుంటే తక్షణమే పరిష్కస్తామన్నారు. నియోజకవర్గంలో మూడేళ్లలో రూ.వెయ్యి కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. మండలంలో 144 మంది లబ్ధిదారులను ఎంపిక చేసి ఇళ్ల పట్టాలను అందజేసే క్రమంలో 8 మంది లబ్ధిదారులకు పట్టాలను ఎమ్మెల్యే చేతుల మీదుగా అందించారు. భూ సమస్యలు పరిష్కరించడంలో కలెక్టర్ వీ.పీ.గౌతమ్ చూపిస్తున్న చొరవ, చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ఎంపీపీ పగుట్ల వెంకటేశ్వరరావు, ఆర్డీవో సూర్యనారాయణ, మండల ప్రత్యేకాధికారి లాండ్ ఆఫ్ సర్వే జిల్లా ఏడీ శ్రీనివాసులు, ఎంపీడీవో రమేశ్, తహసీల్దార్ నారాయణమూర్తి, డీటీ కరుణశ్రీ, ఆర్ఐలు హరిప్రసాద్, చిరంజీవి, పలు గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.