ఖమ్మం, నవంబర్ 3: ఖమ్మం నగరంలోని ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ కళాశాల మైదానంలో ఆదివారం జరుగనున్న సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. శుక్రవారం ఆయన ఎంపీ నామా నాగేశ్వరరావుతో కలిసి సభాస్థలిని పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించాలన్నారు. ఇదే రోజు ఖమ్మంతో పాటు కొత్తగూడెంలోనూ సీఎం సభ ఉంటుందన్నారు. తనతో పాటు జిల్లా నుంచి పోటీ చేస్తున్న ఇతర బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ సభను విజయవంతం చేస్తామన్నారు.
ప్రజలు త్వరగా సభా ప్రాంగణానికి చేరుకోవాలని కోరారు. ఎంపీ నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని చూసిన రైతు వ్యతిరేక బిల్లులను నాడు బీఆర్ఎస్ ఎంపీలు వ్యతిరేకించారన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ బీఆర్ఎస్ రైతు వ్యతిరేక బిల్లులకు అనుకూలమని ప్రచారంచేయడం కేవలం అజ్ఞానమేనన్నారు. ఖమ్మం సీఎం సభకు ప్రజలు వేలాదిగా తరలిరావాలని పిలుపునిచ్చారు. పర్యటనలో డీసీసీబీ చైర్మన్ కురాకుల నాగభూషణం, కార్పొరేటర్ కర్నాటి కృష్ణ, బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, పార్టీ నాయకులు ఆర్జేసీ కృష్ణ, అమరగాని వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.