ఖమ్మం, జనవరి 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి/ ఖమ్మం సిటీ: ‘తెలంగాణ అంధత్వరహిత రాష్ట్రంగా మారాలి.. ఇంటింటా ‘నయనా’నందాలు నిండాలి..’ అనే ధ్యేయంతో సీఎం కేసీఆర్ 2021 ఆగస్టు 15న మొదటి విడత ‘కంటి వెలుగు’ను ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా కంటి పరీక్షలు నిర్వహించేందుకు సుమారు రూ.200 కోట్ల నిధులు కేటాయించారు. వైద్యబృందాలు రాష్ట్రవ్యాప్తంగా 1,54,72, 849 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. కళ్లద్దాలు అవసరమైన 44,08,483 మందికి అందజేశారు. 3,10,638 మందికి శస్త్రచికిత్సలు చేశారు. ఇదే ఒరవడిలో రెండో దశ ‘కంటి వెలుగు’కు శ్రీకారం చుట్టారు.
సీఎం కేసీఆర్ బుధవారం ఖమ్మం శివారు వీ వెంకటాయపాలెంలోని నూతన సమీకృత మార్కెట్ను ఢిల్లీ, పంజాబ్, కేరళ ముఖ్యమంత్రులు కేజ్రీవాల్, భగవంత్మాన్, పినరయి విజయన్, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్తో కలిసి ప్రారంభించారు. అనంతరం కలెక్టరేట్ ప్రాంగణంలో రెండో దశ ‘కంటి వెలుగు’ను ప్రారంభించారు. వైద్యారోగ్యశాఖ ఏర్పాటు చేసిన వైద్యశిబిరాలను పరిశీలించారు. స్టాల్స్ను తిలకించారు. కంటి వెలుగు నిర్వహణపై సీఎం కేసీఆర్ను ముఖ్యమంత్రులు విజయన్, కేజ్రీవాల్, భగవంత్మాన్, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ రాజా ప్రశంసించారు. రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మొదటి దశ విజయవంతమైన తీరు, రెండో దశ కార్యక్రమ నిర్వహణ గురించి అతిథులకు వివరించారు.
50 మందికి కంటి పరీక్షలు..
కలెక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ‘కంటి వెలుగు’ శిబిరాన్ని పంజాబ్ సీఎం భగవంత్మాన్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. వైద్యశిబిరంలో నేత్ర వైద్యనిపుణులు, వైద్యసిబ్బంది 50 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. కళ్లద్దాలు అవసరమైన రఘునాథపాలెం మండలం వీ వెంకటాయపాలేనికి చెందిన వెంపటి కమలమ్మ, అమరనేని వెంకటేశ్వర్లు, అనుబోతు రామనాథం, షేక్ గౌసియా బేగం, ధరావత్ పిచ్చమ్మ, కోలెం జ్యోతికి ముఖ్యమంత్రులు విజయన్, కేజ్రీవాల్, భగవంత్మాన్ చేతుల మీదుగా అందజేశారు. అనంతరం ‘కంటి వెలుగు’ ఫొటో ఎగ్జిబిషన్ను తిలకించారు.
గురువారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్నిచోట్ల కంటి వైద్యశిబిరాలు ప్రారంభం కానున్నాయి. మొదటి దశ శిబిరాలను మించి రెండో దశ శిబిరాలను విజయవంతం చేసేందుకు వైద్యారోగ్యశాఖ చర్యలు తీసుకుంటున్నది. రాష్ట్రవ్యాప్తంగా 12,763 గ్రామాలు, పట్టణాల్లోని 3,788 వార్డుల్లో కంటి వైద్యశిబిరాలు జరుగనున్నాయి. మొత్తం 1500 ప్రత్యేక బృందాలు శిబిరాలు నిర్వహించనున్నాయి. మొదటి దశలో పరీక్షలు చేయించుకోని 1.54 లక్షల మందికి కంటి పరీక్షలు చేయనున్నాయి. మొదటి దశ కార్యక్రమానికి ఖర్చు చేసిన విధంగానే రెండో దశకూ ప్రభుత్వం రూ.200 కోట్లు ఖర్చు చేయనున్నదని సీఎం కేసీఆర్ వెల్లడించారు.
కార్యక్రమంలో మంత్రులు తన్నీరు హరీశ్రావు, పువ్వాడ అజయ్కుమార్, శ్రీనివాస్ గౌడ్, కొప్పుల ఈశ్వర్, సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్రావు, గంగుల కమలాకర్, సత్యవతి రాథోడ్, నిరంజన్రెడ్డి, ఇంద్రకరణ్రెడ్డి, మల్లారెడ్డి, బీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కేశవరావు, ఎంపీలు నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర, పార్థసారథిరెడ్డి, మాళోత్ కవిత, ఎమ్మెల్సీలు తాతా మధుసూదన్, పల్లా రాజేశ్వర్రెడ్డి, పాడి కౌశిక్రెడ్డి, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రైతుబంధు సమితి రాష్ట్ర చైర్మన్ పల్లా రాజేశ్వర్రెడ్డి, ఎంపీలు నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, సత్తుపల్లి, పాలేరు, మధిర, వైరా ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, కందాళ ఉపేందర్రెడ్డి, మల్లు భట్టివిక్రమార్క, లావుడ్యా రాములు నాయక్, మాజీ ఎమ్మెల్యే జలగం వెంకటరావు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్, రాష్ట్ర వైద్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ శ్వేత మహంతి, వైద్యారోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ రిజ్వీ, ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్, పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్ వారియర్, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, డీసీఎంఎస్ చైర్మన్ రాయల శేషగిరిరావు, అదనపు కలెక్టర్లు స్నేహలత, ఎన్.మధుసూదన్, కేఎంసీ కమిషనర్ ఆదర్శ్ సురభి, శిక్షణ కలెక్టర్ రాధిక గుప్తా, డీఎంహెచ్వో డాక్టర్ మాలతి, ప్రోగ్రాం అధికారి డాక్టర్ రాంబాబు పాల్గొన్నారు.
శభాష్ ఖమ్మం టీం..
ఖమ్మంలో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన బీఆర్ఎస్ తొలి బహిరంగ సభను అద్భుతంగా నిర్వహించారంటూ జిల్లా నేతలను సీఎం కేసీఆర్ అభినందించారు. జాతీయ నేతలకు, ముఖ్యమంత్రులకు ఎలాంటి లోటూ రాకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారని, అశేష జనవాహినితో సభను విజయవంతం చేశారని ప్రశంసించారు. ఈ మేరకు మంత్రి పువ్వాడ అజయ్కుమార్తోపాటు ఎంపీలు నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర, బండి పార్థసారథిరెడ్డి, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్రెడ్డి, తాతా మధు, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యలకు సీఎం కేసీఆర్ బుధవారం రాత్రి వేర్వేరుగా ఫోన్ చేశారు. సభ విజయవంతం కోసం జిల్లా నేతలందరూ సమష్టిగా పనిచేశారని, ఏర్పాట్లు అద్భుతంగా చేశారని ప్రశంసించారు.