అవయవ లోపం ఉన్నదని తమలో తామే కుమిలిపోయారు. సమాజంలో తక్కువ చేసి చూస్తారని మదనపడ్డారు. ఏళ్లు గడుస్తున్నా ఎలాగోలా నెట్టుకొచ్చారు. గత ప్రభుత్వాలేవీ అంతగా పట్టించుకోకపోయినా మనో నిబ్బరంతో జీవితాలను వెళ్లదీస్తున్న దివ్యాంగులకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచింది. పింఛన్తో వారి బతుకులకు భరోసానిచ్చింది. రాష్ట్రం సిద్ధించినప్పటి నుంచి ఇస్తున్న పింఛన్ను తెలంగాణ సర్కారు పెంచుతూ పోతున్నది. పెరుగుతున్న ఖర్చులు, వారి అవసరాలను దృష్టిలో ఉంచుకుని సీఎం కేసీఆర్ పింఛన్ను రూ.4,016కు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఇక వారి ఆనందానికి అవధులు లేవు. మా కష్టాలు, కన్నీళ్లను తుడిచేది సీఎం కేసీఆర్ సారే అంటూ రెండు చేతులెత్తి మొక్కుతూ కృతజ్ఞతలు చెబుతున్నారు.
– ఖమ్మం, జూలై 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/కొత్తగూడెం అర్బన్
ఖమ్మం, జూలై 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ కొత్తగూడెం అర్బన్: కాంగ్రెస్, టీడీపీ హయాంలో వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు అరకొర పింఛను అందేది. కుటుంబంలో ఇద్దరు అర్హులంటే కేవలం ఒక్కరికే లబ్ధి. రాజకీయ నాయకుల ప్రసన్నం ఉన్నవారికే ఆ పింఛన్. అంతా చేసి అందే పింఛను నెలకు రూ.200. అందిన సొమ్ము ఒకటి రెండు రోజుల్లోనే ఖర్చయిపోయేది. కానీ స్వరాష్ట్రం వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా ‘ఆసరా’ పథకం అమలు చేస్తున్నారు. మూడుసార్లు పింఛను పెంచి అంగవైకల్యం ఉన్న వారికి సేవకుడిగా.. వృద్ధులకు పెద్ద కొడుకుగా.. వితంతువులు, ఒంటరి మహిళలకు అన్నగా.. చేనేత, గీత కార్మికుల స్నేహితుడిగా.. బోధకాలు, ఏయిడ్స్ బాధితులకు ఆపద్బాంధవుడిలా నిలుస్తున్నారు.
పింఛను పెంపు ఇలా..
సీఎం కేసీఆర్ రాష్ట్రం వచ్చిన కొత్తలోనే వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు నెలకు రూ.500 ప్రకటించారు. అన్నట్లే అమలు చేశారు. తర్వాత కొద్దికాలానికి సాధారణ పింఛనుదారులకు రూ.1,016, దివ్యాంగులకు రూ.1,500కు పింఛన్ పెంచారు. మళ్లీ ఆ తర్వాత కొద్దికాలానికి సాధారణ పింఛను రూ.2,016, దివ్యాంగుల పింఛను రూ.3,016కు పెంచారు. తాజాగా దివ్యాంగుల పింఛనును రూ.4,016 పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఎలాంటి ఆంక్షలు లేకుండా సదరం సర్టిఫికెట్ల ఆధారంగా పింఛను ప్రభుత్వం పింఛను ఇస్తున్నది. యంత్రాంగం ఎప్పటికప్పుడు పింఛనుదారులను గుర్తించి పింఛను అందేలా చర్యలు తీసుకుంటున్నది. ఆత్మగౌరవంతో బతికేలా పింఛను అందిస్తున్నందుకు దివ్యాంగులు సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. దేశంలో మరే ఇతర రాష్ట్రంలోనూ ఇంత పింఛను ఇవ్వడం లేదని హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఉమ్మడి జిల్లాలో పింఛనుదారులు ఇలా..
జూలై 2023 నాటికి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 29,094 పింఛనుదారులు ఉన్నారు. వీరిలో ప్రతి ఒక్కరికీ నెలకు రూ.3,016 పింఛను అందుతున్నది. ఈ చొప్పున పింఛనుదారుల ఖాతాల్లో ప్రతి నెలా రూ.8.77 కోట్లు జమ అవుతాయి. తాజాగా సర్కార్ తీసుకున్న నిర్ణయంతో ఒక్కో లబ్ధిదారుకు రూ.వెయ్యి పింఛను పెరగనున్నది. ప్రతి నెలా ఒక్కొక్కరి ఖాతాలో రూ.4,016 చొప్పున రూ.11.67 కోట్లు జమ కానున్నాయి. ఈ చొప్పున సర్కార్పై నెలకు రూ.3 కోట్ల చొప్పున అదనపు భారం పడనున్నది. భద్రాద్రి జిల్లావ్యాప్తంగా 13,807 మంది దివ్యాంగులు పింఛను తీసుకుంటున్నారు. వీరి ఖాతాల్లో నెలకు రూ.1.38 కోట్లు జమ అయ్యేది. తాజాగా పింఛను పెంచిన నేపథ్యంలో సర్కార్పై ఏడాదికి రూ.16.56 కోట్ల అదనపు భారం పడనున్నది.
పెన్షన్ పెంపుపై ఎమ్మెల్యే సండ్ర హర్షం
సత్తుపల్లి, జూలై 23 : తొమ్మిదేళ్ల సుపరిపాలనలో కనీవినీ ఎరుగని రీతిలో రాష్ర్టాన్ని అభివృద్ధి చేసి దేశానికే తెలంగాణను రోల్మోడల్గా తీర్చిదిద్దిన కృషీవలుడు సీఎం కేసీఆర్. దివ్యాంగుల పింఛన్ను రూ.1000 పెంచి.. రూ.4,016 చేస్తూ జీవో జారీ చేయడం హర్షణీయం. దివ్యాంగుల పింఛన్ రూ.3,016 నుంచి రూ.4,016కు పెంచడం పట్ల సీఎం కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు. దేశంలోనే దివ్యాంగులకు అత్యధిక పింఛన్ ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమే.
సీఎం కేసీఆర్, కేటీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం
పెనుబల్లి, జూలై 23 : దివ్యాంగులపై ప్రేమానురాగాలను సీఎం కేసీఆర్ మాటల్లో చెప్పకుండా చేతల్లో చూపుతున్నారని పాతకారాయిగూడెం సొసైటీ చైర్మన్ చింతనిప్పు సత్యనారాయణ అన్నారు. దివ్యాంగులకు పింఛన్ను పెంచడాన్ని హర్షిస్తూ ఆదివారం గ్రామానికి చెందిన యువజన నాయకుడు దూదిపాళ్ల ప్రసాద్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దివ్యాంగులతో కలిసి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలకు అండగా నేనున్నానంటూ సీఎం కేసీఆర్ తెలంగాణను కాపాడుతున్నారని, దివ్యాంగుల్లో మనోధైర్యాన్ని నింపేందుకు పెన్షన్లు పెంచి సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవడం హర్షించదగిన విషయమన్నారు. సీఎం కేసీఆర్కు ప్రతి ఒక్కరూ అండగా నిలవాలన్నారు. కార్యక్రమంలో చీకటి మోహన్రావు, సత్యనారాయణ, రామ్మోహన్, పూచి కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.
పింఛనే నాకు ఆధారం
ఈ రోజుల్లో రూ.500 అప్పు అడిగితే ఇచ్చే పరిస్థితి లేదు. అలాంటిది తొమ్మిదేళ్లుగా సీఎం కేసీఆర్ ప్రతి నెలా ఠంచన్గా ఆసరా పింఛన్ ద్వారా రూ.3,016 ఇస్తున్నడు. మంచిర్యాల సభలో ఇచ్చిన మాట ప్రకారం ఈ నెల నుంచి పెంచిన పెన్షన్ రూ.4,016 ఇస్తున్నందుకు సంతోషంగా ఉంది. నాకు వచ్చే వికలాంగ పింఛన్తోనే మా కుటుంబం గడుస్తున్నది. ఎలాంటి పనులు చేసుకోలేను. మా అమ్మే అన్నీ తానై చేస్తుంది. కేసీఆర్ సార్ ఇచ్చే పింఛనే మాకు ఆధారమైంది. సీఎం కేసీఆర్కు ఏమిచ్చినా రుణం తీర్చుకోలేను.
– నాగండ్ల ఉపేందర్, దివ్యాంగుడు, ఆసరా లబ్ధిదారుడు, పాండురంగాపురం
పింఛనే ఆసరా..
సీఎం కేసీఆర్ ఇచ్చే పింఛన్తోనే నేను బతుకుతున్నా. నాకు చిన్నప్పుడే పోలియో వచ్చింది. అప్పట్లో నాకు నెలకు రూ.500 అందేది. అది కూడా ఠంచనుగా అందేది కాదు. సీఎం కేసీఆర్ సార్ పుణ్యమా అని మాకు నెల నెలా పక్కాగా పింఛను అందుతున్నది. ఇప్పుడు మరో వెయ్యి పెంచి పింఛనును రూ.4,016 పెంచారు. నిర్ణయం ఆనందాన్నిచ్చింది. సీఎం సార్ సల్లంగుండాలె..
– పిల్లి సరోజ, పింఛనుదారు, కొత్తగూడెం
సంతోషంగా ఉంది..
ఇప్పుడు వస్తున్న పింఛన్కు తోడుగా మరో రూ.వెయ్యి కలిపి ఇస్తానని సీఎం కేసీఆర్ ప్రకటించడం సంతోషాన్నిచ్చింది. పింఛన్తో నెలరోజులు బతుకుతున్నా. గతంలో ఏ ప్రభుత్వమూ ఇంత పింఛను ఇవ్వలేదు. తెలంగాణ వచ్చినంకనే దివ్యాంగులకు మేలు జరుగుతున్నది. సీఎం కేసీఆర్ మా పాలిట దేవుడు.
– సపావత్ లాలు, పింఛనుదారు, సీతారాంపురం
అర్హులందరికీ పింఛన్..
అర్హులైన దివ్యాంగులందరికీ ప్రభుత్వం పెంచిన పింఛన్ అందిస్తాం. ప్రభుత్వానికి ఇప్పటికే దివ్యాంగుల జాబితాను పంపాం. అర్హులందరికీ ప్రభుత్వ నిర్ణయం మేరకు నెలకు రూ.4,016 చొప్పున పింఛను అందుతుంది.
– జి.మధుసూదనరాజు, డీఆర్డీవో, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు), కొత్తగూడెం
కష్టాలు తెలిసిన నేత కేసీఆర్
పేదల కష్టాలు తెలిసిన నేత సీఎం కేసీఆర్. అందుకే అడగకున్నా.. ఇంటి పెద్దలా అవసరమైన అన్ని వసతులు కల్పిస్తున్నడు. ఆసరా పింఛన్ ద్వారా వస్తున్న డబ్బులతోనే ఇంటి అవసరాలు తీర్చుకుంటున్న. ప్రస్తుతం దివ్యాంగులకు ఇచ్చే రూ.3,016లకు మరో రూ.వెయ్యి పెంచి రూ.4,016 ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. వికలాంగుడిగా పుట్టించి దేవుడు చిన్నచూపు చూసినందుకు బాధగా ఉన్నా.. సీఎం కేసీఆర్ ఆసరా పింఛన్ ఇచ్చి బాధను మరిచిపోయేలా చేసిండు. కేసీఆర్ సార్కి జీవితాంతం రుణపడి ఉంటా.
– వేముల వెంకటేశ్, దివ్యాంగుడు, ఆసరా లబ్ధిదారుడు, ఖమ్మం
మా బతుకుకు భరోసా..
తెలంగాణ వచ్చాక కొంచెం మా బతుకులు మారాయి. తాజా పింఛనును రూ.3,016 నుంచి రూ.4,016కు పెంచారు. ఎలాంటి ఆధారం లేని దివ్యాంగులు ప్రభుత్వం ఇచ్చే పింఛనుతో బతికేలా సీఎం కేసీఆర్ పింఛను ఇస్తున్నారు. నాకు సర్కార్ ఇప్పటికే ట్రై సైకిల్ ఇచ్చింది. పింఛను అందుతున్నది.
– ఎండి. మౌలాన, పింఛనుదారు, కొత్తగూడెం
దివ్యాంగుల పాలిట దేవుడు సీఎం కేసీఆర్
సమాజంలో ఎలాంటి ఆదరణకు నోచుకోని దివ్యాంగులకు సీఎం కేసీఆర్ పెద్ద దిక్కయ్యారు. గతంలో ఎవరూ మా బాగోగులు పట్టించుకున్న పాపాన పోలేదు. కానీ.. కేసీఆర్ సీఎం అయిన తర్వాత స్వరాష్ట్రంలో పెద్ద మనస్సు చేసుకొని దివ్యాంగులకు రూ.3వేల పింఛన్ ఇప్పటివరకు అందించారు. పెరుగుతున్న నిత్యావసర వస్తువుల దృష్ట్యా మరో రూ.1000 పెంచుతూ జీవో జారీ చేయడం ఆయన మంచితనానికి నిదర్శనం. రూ.3,016 నుంచి రూ.4,016 వరకు పెన్షన్ పెంచి అందుకోవడం చాలా సంతోషం. దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రీ చేయని సాహసం సీఎం కేసీఆర్ చేశారు. ఆయన చూపుతున్న ప్రేమకు జన్మజన్మలా రుణపడి ఉంటాం.
– గుగులోతు దసురు, దివ్యాంగుడు, పాతకారాయిగూడెం, పెనుబల్లి మండలం