సారపాక, జూన్ 9: అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం దేశానికి రోల్మోడల్గా నిలిచిందని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు పేర్కొన్నారు. ముఖ్యంగా సంక్షేమ పథకాల అమలులో దేశానికి దిక్సూచిగా నిలిపిన ఘనత కేసీఆర్దేనని స్పష్టం చేశారు. సంక్షేమ సారథి కేసీఆరే తెలంగాణ ప్రజలకు శ్రీరామరక్ష అని అన్నారు. దశాబ్ది వేడుకల సందర్భంగా మణుగూరు మండలం గుట్టమల్లారంలోని హనుమాన్ ఫంక్షన్ హాల్లో శుక్రవారం నిర్వహించిన సంక్షేమ సంబురాల్లో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ పాలనలో రాజకీయాలకు అతీతంగా రాష్ట్రంలోని నిరుపేదలందరికీ అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందాయని గుర్తుచేశారు.
గొల్ల కురుమలు ఆర్థికంగా ఎదగాలి..
గొల్ల కురుములు ఆర్థికంగా ఎదగాలన్నదే బీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు పేర్కొన్నారు. రెండో విడత గొర్రెల పంపిణీలో భాగంగా కలెక్టర్ అనుదీప్తో కలిసి పలువురు లబ్ధిదారులకు ఆయన గొర్రెలు పంపిణీ చేసి మాట్లాడారు. కుల, చేతివృత్తిదారులను ఆర్థిక చేయూతనందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.లక్ష ఆర్థిక సాయం అందిస్తోందని అన్నారు. సంక్షేమ వేడుకల్లో భాగంగా బూర్గ ంపహాడ్ మండలానికి చెందిన 9 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికీ రూ.లక్ష చొప్పున మొత్తం రూ.9 లక్షల చెక్కులను ఆయన పంపిణీ చేసి మాట్లాడారు. కులవృత్తులను ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న రూ.లక్ష ఆర్థిక సాయం కోసం లబ్ధిదారులు దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు సూచించారు.