ఖమ్మం, జనవరి 16 : ఖమ్మంలో ఈ నెల 18వ తేదీన జరుగనున్న బీఆర్ఎస్ పార్టీ తొలి బహిరంగ సభ చరిత్రలో నిలిచిపోనున్నదని సభా ఇన్చార్జి రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. ఖమ్మం నగరంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో సోమవారం జరిగిన ఖమ్మం నియోజకవర్గ సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ సభ నుంచి దేశానికి సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారని తెలిపారు. బీఆర్ఎస్ ద్వారానే ఖమ్మం రూపురేఖలు మారాయన్నారు. సీతారామ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలు ఖమ్మం నేలను ముద్దాడితే రెండు పంటలు అద్భుతంగా పండుతాయన్నారు. కృష్ణ, గోదావరి జలాలు ఖమ్మం జిల్లాలో పారడానికి సీఎం కేసీఆర్ చేస్తున్న కృషి అమోఘమన్నారు. పాలేరు నియోజకవర్గ ప్రజలు చాలా అదృష్టవంతులని, దేశంలో ఎక్కడా లేనివిధంగా రెండు జీవనదులు పారుతున్నాయని పేర్కొన్నారు. ఎస్ఆర్ఎస్పీ ద్వారా గోదావరి జలాలు, తుమ్మిళ్ల లిప్టు ఇరిగేషన్ ద్వారా పాలేరుకు కృష్ణ జలాలను తరలించే అవకాశం ఉందన్నారు. సీఎం కేసీఆర్ ఖమ్మం జిల్లాలపై ప్రత్యేక దృష్టి పెట్టారని, కొత్తగూడెం, ఖమ్మానికి మెడికల్ కళాశాలను మంజూరు చేశారని, వీటికి రూ.వెయ్యి కోట్లను కేటాయించినట్లు తెలిపారు.
దేశంలో బీజేపీ ప్రభుత్వం 157 మెడికల్ కళాశాలలు మంజూరు చేస్తే మన రాష్ర్టానికి ఒక్కటి కూడా ఇవ్వలేదన్నారు. కేంద్రం ఇవ్వకపోయినా 33 మెడికల్ కళాశాలలను రాష్ట్రంలో ఏర్పాటు చేసేందుకు కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. దేశానికి తెలంగాణ రోల్మోడల్గా మారిందన్నారు. మనం మిషన్ భగీరథ పెడితే దేశం మొత్తం కూడా హర్ఘర్కో జల్ అని అన్నారని, మనం మిషన్ కాకతీయ పెట్టి చెరువులు బాగుచేస్తే అమృత్ సరోవర్ అని పేరు మార్చరన్నారు. మనం రైతుబంధు పెడితే పీఎం కిసాన్ అనే పథకం పెట్టి తెలంగాణ పథకాలన్ని కాపీ కొట్టారని అన్నారు. సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని పెంచారన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా రాష్ట్రంలో మూడోసారి ఎగిరేది బీఆర్ఎస్ జెండా అని మంత్రి స్పష్టం చేశారు. రానున్నది కేసీఆర్ ప్రభుత్వమే అన్నారు. ఈ సభ ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పదికి పది స్థానాలను గెలిచితీరాలన్నారు. కాంగ్రెస్ పార్టీ రోజురోజుకు పతనం చెందుతున్నదని, బీజేపీకి ఖమ్మంలో స్థానం లేదన్నారు.
తెలిసో తెలియకే ఎవరైనా బీజేపీలో చేరితే ఆత్మహత్య సాదృశమేనని పేర్కొన్నారు. పోరాటల గడ్డ ఖమ్మం జిల్లాలో బీజేపీ మొలకెత్తడం జరగదని, మతతత్వ పార్టీలకు ఇక్కడ స్థానం లేదన్నారు. ఖమ్మం ప్రజలు ధర్మం, న్యాయం వైపు ఉంటారని అభివృద్ధికి పట్టం కడతారని మంత్రి పేర్కొన్నారు. ప్రజలను సమీకరించాల్సిన బాధ్యత కార్పొరేటర్లు, నాయకులపై ఉందన్నారు. ఖమ్మంలో జరిగిన అభివృద్ధి చూసి తాను చాలా నేర్చుకున్నానని, ఇక్కడ జరిగిన అభివృద్ధి నమూనానే సిద్దిపేటలో అమలు చేశానన్నారు. ఖమ్మం నగర అభివృద్ధికి సుమారు 13వందల కోట్లను ఖర్చు చేయడం జరిగిందన్నారు. హైదరాబాద్ తర్వాత ఖమ్మంలోనే ఎంతో అభివృద్ధి జరిగిందన్నారు. అనంతరం నాయకులకు జన సమీకరణపై పలు సూచనలు చేశారు. మధ్యాహ్నం 1గంట వరకు సభా ప్రాంగణంలో ఉండేలా చూడాలన్నారు. బాధ్యత తీసుకున్న వ్యక్తులు జనం మధ్యలో కూర్చోవాలని జనంతోపాటే రావాలని సూచించారు.
ప్రతిఒక్కరూ సభలో పాల్గొనాలి
బహిరంగ సభకు బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజలందరూ పాల్గొనాలని ఆ పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ పిలుపునిచ్చారు. సభలో అనేకమంది జాతీయ నాయకులు, సీఎంలు వస్తున్నారని చీమలదండులా కదలిరావాలని కోరారు. ఈ యజ్ఞంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు.
– తాతా మధు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ
ఇక్కడే పోటీ చేస్తా.. కూకట్పల్లి వెళ్లేది లేదు
ఖమ్మం నుంచే పోటీ చేస్తానని.. కూకట్పల్లి వెళ్లేది లేదని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ స్పష్టం చేశారు. తనకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న వారిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తాను ఖమ్మం వదిలి కూకట్పల్లి పోతున్నానని, అక్కడ పోటీ చేస్తానని జరుగుతున్న ప్రచారమంతా బోగస్ అని కొట్టిపారేశారు. కొంతమంది తొట్టిగ్యాంగ్ సోషల్ మీడియాలో పనిగట్టుకొని తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఎవరెన్ని చేసినా ఇంకా దంచాల్సిది చాలా ఉందని, దంచిన తర్వాతనే ఇక్కడ నుంచి వెళ్తానని పేర్కొన్నారు. దేశానికి దిశానిర్దేశం చేసే బహిరంగ సభను విజయవంతం చేసే బాధ్యత ఖమ్మం ప్రజలపై ఉందన్నారు. ఖమ్మం ప్రజలు ప్రతి అంశాన్ని పరిశీలిస్తారని, అన్ని ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ వైపే నిలిచారని పేర్కొన్నారు. జిల్లా ప్రజలపై కేసీఆర్కు ఉన్న ప్రేమ కారణంగానే భారీగా నిధులు వచ్చాయన్నారు. నగరంలో డివిజన్ యూనిట్గా తీసుకొని తరలిరావాలన్నారు. కార్పొరేటర్లు పెద్దన్నపాత్ర పోషించాలన్నారు.
– మంత్రి పువ్వాడ అజయ్కుమార్
ఎనిమిదేండ్లలో ఎంతో అభివృద్ధి
బీఆర్ఎస్ సంప్రదాయం ప్రకారం ఏ సభనైనా సిద్దిపేట, కరీంనగర్లో ఏర్పాటు చేస్తారు.. కానీ సీఎం కేసీఆర్కు ఖమ్మం జిల్లా ప్రజలపై ఉన్న ప్రేమతో ఇక్కడ సభను ఏర్పాటు చేశారని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. కేసీఆర్కు జిల్లా ప్రజలందరూ ధన్యవాదాలు తెలపాలన్నారు. రాష్ట్రంలో 75ఏం డ్లలో జరుగని అభివృద్ధి కేవలం ఎనిమిదేండ్లలో చేసి చూపారని కొనియాడారు. మధిర నియోజకవర్గం నుంచి 50వేల మంది కంటే ఎక్కువ సంఖ్యలో ప్రజలను సమీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. ఖమ్మం నుంచి 50వేల మందిని తరలిస్తామన్నారు.
– వద్దిరాజు రవిచంద్ర, రాజ్యసభ సభ్యుడు
ఖమ్మం.. అభివృద్ధి గుమ్మం
రాష్ట్రంలోని 146 పట్టణాల్లో ఖమ్మం ఎంతో అభివృద్ధి చెందిందని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. ప్రతి ఒక్కరికి ఖమ్మం చూసిరమ్మని సీఎం కేసీఆర్ చెబుతున్నారని అన్నారు. ఖమ్మం కార్యకర్తలు సుశిక్షితులని కొనియాడారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా సమయానికి వచ్చి సభ పూర్తయ్యేవరకు ఉండాలని కోరారు.- పల్లా రాజేశ్వరరెడ్డి, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ
పెద్దఎత్తున తరలిరావాలి
ఊరూవాడా పెద్దఎత్తున సభకు కదిలిరావాలని బీఆర్ఎస్ లోక్సభా పక్షనేత, ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. భారీ జనసమీకరణ జరగాలని, ప్రతి నాయకుడు, కార్యకర్త ముందుండి పని చేయాలన్నారు. కేసీఆర్కు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని కోరారు. దేశంలో ఏ రాష్ట్రంలో జరగని అభివృద్ధి తెలంగాణలో జరిగిందని పేర్కొన్నారు. ఈ సన్నాహక సమావేశంలో ఎమ్మెల్సీ కౌశిక్రెడ్డి, బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, వైరా ఎమ్మెల్యే రాములునాయక్, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, మేయర్ పునుకొల్లు నీరజ, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహారా, సుడా చైర్మన్ బచ్చు విజయ్కుమార్, యువజన అధ్యక్షుడు చింతనిప్పు కృష్ణచైతన్య, కార్పొరేటర్లు కర్నాటి కృష్ణ, కమర్తపు మురళి తదితరలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బహిరంగ సభా వలంటీర్లకు టీ షర్టులను అందజేశారు.
– నామా నాగేశ్వరరావు, బీఆర్ఎస్ లోక్సభా పక్షనేత, ఎంపీ
45వేల కోట్లతో ఉమ్మడి ఖమ్మం అభివృద్ధి
ఉమ్మడి ఖమ్మం జిల్లాను 45వేల కోట్లతో అభివృద్ధి చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. దేశ రాజకీయాల్లో, ఖమ్మం రాజకీయ చర్రితలో, రాష్ర్టాన్ని సాధించిన వ్యక్తి, తెలంగాణ ప్రజలకు గౌరవం ఇచ్చిన ఏకైక వ్యక్తి కేసీఆర్ అని కొనియాడారు. వాగ్ధానాలను నెరవేర్చిన తర్వాత ఇవే పథకాలు దేశ ప్రజలకు అందించాలనే ఉద్దేశంతోనే బీఆర్ఎస్ను స్థాపించారని తెలిపారు. ఈ సభ ఖమ్మం జిల్లాకే గర్వకారణమన్నారు. ఖమ్మాన్ని చూసిన తరువాతనే మిగిలిన పట్టణాలు మారాయన్నారు. ఖమ్మం సభ దేశానికి దిక్చూచి కావాలని తుమ్మల పిలుపునిచ్చారు.
– తుమ్మల నాగేశ్వరరావు, మాజీ మంత్రి