‘ఎన్నికలు వస్తూపోతూ ఉంటాయి. కానీ.. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను, వారి వెనుక ఉన్న పార్టీలను చూడాలి. అలాంటప్పుడు ప్రజలకు మేలు చేసే పార్టీని ఎంచుకోవాలి. ఆ పార్టీ అభ్యర్థికి ఓటు వేయాలి. కాంగ్రెస్ నేతలు చెబుతున్న ఇందిరమ్మ రాజ్యమంటే కరువు కాటకాలు, ఆకలి చావులే. అలాంటి దిక్కుమాలిన పాలన మనకు అవసరం లేదు. 50 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ చేసిందేమీ లేదు’ అని ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. వైరాలో మంగళవారం జరిగిన ప్రజా ఆశీర్వాద సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. బీఆర్ఎస్ వైరా అభ్యర్థి బానోత్ మదనలాల్ అధ్యక్షతన జరిగిన సభలో సీఎం ప్రసంగించారు. బీఆర్ఎస్ అభ్యర్థి మదన్లాల్ను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.
భద్రాద్రి కొత్తగూడెం, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ నేతలు చెబుతున్న ఇందిరమ్మ రాజ్యమంటే కరువు కాటకాలు, ఆకలి చావులేనని ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పష్టం చేశారు. అలాంటి దిక్కుమాలిన పాలన మనకు అవసరం లేదని తేల్చిచెప్పారు. ఇప్పటికే 50 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ చేసిందేమీ లేదని విమర్శించారు. వైరాలో మంగళవారం జరిగిన ప్రజా ఆశీర్వాద సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వైరా ఎమ్మెల్యే రాములునాయక్, బీఆర్ఎస్ అభ్యర్థి బానోత్ మదనలాల్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో సీఎం ఆయన ప్రసంగించారు. ప్రజాస్వామ్యంలో ఎంతో కీలకమైన ఓటును మంచి వ్యక్తిని ఎన్నుకునేందుకు వినియోగించుకోవాలని సూచించారు. ఆ ఓటుతోనే ఐదేళ్ల భవిష్యత్ను నిర్మించుకోవాల్సి ఉంటుందని అన్నారు. అప్పుడు గ్రామ పంచాయతీగా ఉన్న వైరాను బీఆర్ఎస్ ప్రభుత్వంలో మున్సిపాలిటీ చేశామని గుర్తుచేశారు. కరువుతో అలమటించిన జూలూరుపాడు, కారేపల్లి, ఏన్కూరు మండలాల్లో నేడు సిరులు కురిపిస్తున్నామని అన్నారు.
ఇప్పుడు ఇంత గొప్పలు చెబుతున్న కాంగ్రెస్.. మరి ఆ నాడు గోదావరిపై ఒక్క ప్రాజెక్టునూ కట్టలేకపోయిందని విమర్శించారు. తెలంగాణ వచ్చాకే సీతారామ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టామని, ఇప్పటికే 70 శాతం పనులు పూర్తి చేశామని అన్నారు. సీతారామ గురించి మాజీ మంత్రి తుమ్మల మాట్లాడడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. అలాంటి ప్రాజెక్టును ఆయన అప్పుడే ఎందుకు కట్టలేదని ప్రశ్నించారు. అలాగే ఇక్కడి బీఆర్ఎస్ అభ్యర్థులను అసెంబ్లీ గేటు తాకనివ్వబోనంటూ ఇంకొకాయన అంటున్నాడని, గేటు తాకనిచ్చేది ప్రజలు అనే విషయం ఆయనకు తెలియదనుకుంట అని విమర్శించారు.
బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసమని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. దాన్ని సాక్షాత్కరిస్తూ అన్ని వర్గాల ప్రజలకూ సంక్షేమ పథకాలు చేరుతున్నాయని అన్నారు. రైతుల కోసం రైతుబంధు పెట్టామన్నారు. ఆ పథకం నిలబడాలంటే ఇక్కడ మదన్లాల్ను గెలిపించాలని కోరారు. నియోజకవర్గంలో 3,650 మంది పోడు రైతులకు 7,140 ఎకరాలపై హక్కులు కల్పించి పట్టాలు అందించామని వివరించారు. నోట్ల కట్టలతో వచ్చి ఓట్లు కొనాలని వాళ్లు చూస్తున్నారని విమర్శించారు. కానీ ప్రజలు మాత్రం కోట్లాది ఓట్లను కారు గుర్తుకు వేసి బీఆర్ఎస్ను గెలిపించాలని కోరారు.
నియోజకవర్గంలోని కొన్ని సమస్యలను తమ పార్టీ అభ్యర్థి మదన్లాల్ తన దృష్టికి తెచ్చారని అన్నారు. అవి చాలా చిన్నవని, తాము అధికారంలోకి వచ్చి వెంటనే వాటిని పరిష్కరిస్తామని అన్నారు. ఇప్పుడున్న ఎమ్మెల్యే రాములునాయక్ చాలా మంచి మనిషి అని అన్నారు. వచ్చే ప్రభుత్వంలో ఆయనకు మంచి హొదా కల్పిస్తానని అన్నారు. ఈ నెల 30న జరిగే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటెయ్యాలని పిలుపునిచ్చారు. ఇక్కడ మదన్లాల్ గెలిస్తే అక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటవుతుందని స్పష్టంచేశారు. మాజీ స్పీకర్ మధుసూదనాచారి, ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ తాతా మధు, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నేతలు కొండబాల కోటేశ్వరరావు, సంభాని చంద్రశేఖర్, నాగభూషణం, దొండపాటి వెంకటేశ్వరరావు, బంధం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
గిరిజనులకు పది శాతం రిజర్వేషన్లు కల్పించిన సీఎం కేసీఆర్ గిరిజన బాంధవుడయ్యారని వైరా ఎమ్మెల్యే రాములునాయక్ పేర్కొన్నారు. తెలంగాణ రాకముందు ఇక్కడి పరిస్థితి ఎలా ఉండేదో ఇక్కడి ప్రజలకు తెలియనిది కాదని అన్నారు. తాగునీటికి, సాగునీటికి పడిన ఇబ్బందులన్నీ ఇక్కడి ప్రజలకు గుర్తే ఉన్నాయని అన్నారు. అలాంటి కాంగ్రెస్ పాలన మళ్లీ రాకూడదు కాబట్టే ప్రజలు మరోసారి బీఆర్ఎస్ను గెలిపించాలని పిలుపునిచ్చారు.
సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఖాతాల్లోనే నేరుగా వాటి ఫలాలను జమ చేసిన ఘనత సీఎం కేసీఆర్దేనని బీఆర్ఎస్ వైరా నియోజకవర్గ అభ్యర్థి మదన్లాల్ పేర్కొన్నారు. గత కాంగ్రెస్ పాలనలో పథకాలన్నీ పైరవీకారుల జేబుల్లోకే వెళ్లేవని గుర్తుచేశారు. వైరా నియోజకవర్గంలో గతంలో పరిశ్రమలు లేవని, కేసీఆర్ సీఎం అయ్యాకే ఆయిల్పామ్ ఫ్యాక్టరీ వచ్చిందని అన్నారు. నియోజకవర్గంలోని దళితులందరికీ ఏకకాలంలోనే దళితబందు పథకాన్ని అమలు చేయాలని కోరారు.