ఖమ్మం, అక్టోబర్ 19: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం ఖాయమని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ధీమా వ్యక్తం చేశారు. ఖమ్మం నగరంలోని శ్రీనివాసనగర్లో బుధవారం స్థానిక నాయకుడు పాలడుగు పాపారావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. ప్రజలు బీఆర్ఎస్కు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారన్నారు. బీఆర్ఎస్కు ప్రజల మద్దుతు ఉందన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా, ఎన్ని అవరోధాలు సృష్టించినా అంతిమ విజయం గులాబీదేనన్నారు. తాను ఖమ్మం నగరంలోనే పెరిగానని, మాంట్ఫోర్ట్ హైస్కూల్లో పాఠశాల విద్య, శాంతినగర్ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్, ఎస్ ఆర్అండ్ బీజీఎన్ఆర్ కళాశాలలో డిగ్రీ చదివానన్నారు. తన తండ్రి పువ్వాడ నాగేశ్వరరా వు వారసత్వంగా తానూ రాజకీయాల్లోకి వచ్చానని స్పష్టం చేశారు. తాము ఖమ్మం నగరాన్ని వదిలి ఎక్కడికీ పోలేదన్నారు. ప్రజల సంక్షేమం కోసం నిబద్ధతతో పనిచేస్తున్నానమన్నారు. స్వతంత్రం వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు ఖమ్మం జిల్లాకు ఒక్క మంత్రి పదవి రాలేదని, ఏ పార్టీ కూడా ఆ అవకాశాన్ని కల్పించలేదన్నారు.
స్వరాష్ట్రం వచ్చిన తర్వాత బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ తనకు మంత్రి పదవి ఇచ్చారన్నారు. ఖమ్మం నగరాన్ని అభివృద్ధి చేసేందుకు వేలాది కోట్లు కేటాయించారన్నారు. తాజాగా మున్నేరుపై ఆర్సీసీసీ వాల్స్, కేబుల్ బ్రిడ్జి నిర్మాణానికి నిధులు విడుదల చేశారన్నారు. ఇటీవల తాను మంత్రి హోదాలో పనులకు శంకుస్థాపన చేశానన్నారు. సీఎం కేసీఅర్, మంత్రి కేటీఆర్ సహకారంతోనే నగరం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందన్నారు. రూ.100 కోట్లతో గోళ్లపాడు చానల్ను ఆధునీకరించామన్నారు. సామాన్య పౌరుల భద్రత కోసం పోలీస్ వ్యవస్థను పటిష్ట పరిచామన్నారు. జిల్లాను పోలీస్ కమిషనరేట్ పరిధిలోకి తీసుకొచ్చామన్నారు. సమావేశంలో ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ, డీసీసీబీ చైర్మన్ కురాకుల నాగభూషణం, పార్టీ నాయకులు ఆర్జేసీ కృష్ణ, ధనాల శ్రీకాంత్, వినోద్ పటేల్, గరికపాటి వెంకటేశ్వరరావు, మాటూరి లక్ష్మీనారాయణ, తిరుపతయ్య, రవి, దడాల రఘు, యర్రా అప్పారావు, ఉపేందర్ పాల్గొన్నారు.