ఖమ్మంలో ఈ నెల 18న నిర్వహించనున్న బహిరంగ సభ చరిత్రలో నిలిచేవిధంగా విజయవంతం చేయాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ సత్తా ఏమిటో దేశానికి చాటిచెప్పేలా సభ ఉండాలన్నారు. 12, 18వ తేదీల్లో భద్రాద్రి, ఖమ్మం జిల్లాల్ల్లో పర్యటన నేపథ్యంలో సోమవారం హైదరాబాద్లో మంత్రి అజయ్కుమార్తో పాటు ఉమ్మడి జిల్లా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నియోజకవర్గ ఇన్చార్జిలతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడారు.
– ఖమ్మం, జనవరి 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
ఖమ్మం జనవరి 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): బీఆర్ఎస్ సత్తా ఏమిటో దేశానికి చాటిచెప్పేలే ఖమ్మంలో బహిరంగ సభ నిర్వహించాలని, ఈ సభ పార్టీ చరిత్రలో చారిత్రకఘట్టంగా నిలిచిపోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. ఈ నెల 12, 18 తేదీల్లో భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో సమీకృత కలెక్టరేట్ల ప్రారంభోత్సవానికి తాను హాజరు కానున్న నేపథ్యంలో సభ ఏర్పాట్లు, నిర్వహణ ఉద్దేశంపై సీఎం కేసీఆర్ మంత్రి పువ్వాడ అజయ్కుమార్తోపాటు ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నియోజకవర్గ ఇన్చార్జులతో సోమవారం సాయంత్రం హైదరాబాద్లో ప్రత్యేకంగా సమావేశమై దిశానిర్దేశం చేశారు. సాయంత్రం ఐదు గంటలకు ప్రారంభమైన సమావేశం సుమారు మూడు గంటలపాటు కొనసాగింది.
ఈ నెల 18న ఖమ్మంలో నిర్వహించే భారీ బహిరంగసభకు తనతోపాటు కేరళ, ఢిల్లీ, పంజాబ్ ముఖ్యమంత్రులు, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి హాజరుకానున్నట్లు చెప్పారు. అందుకని ఈ బహిరంగ సభకు భారీ సంఖ్యలో జనాన్ని సమీకరించే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. సభకు వస్తున్న ఇతర రాష్ర్టాల ముఖ్యమంత్రులకు సముచిత గౌరవం లభించేలా ఏర్పాట్లు ఉండాలని ఆదేశించారు. ఖమ్మం బహిరంగసభ బీఆర్ఎస్కు అత్యంత ప్రతిష్ఠాత్మకమైనదని అన్నారు.
జాతీయ పార్టీగా ఆవిర్భవించిన తరువాత జరిగే మొదటి సభ కానుండడంతో పార్టీ లక్ష్యాలను దేశ ప్రజలకు తెలియజేసే తొలి వేదిక అవుతుందని సీఎం వివరించారు. ప్రతీ నియోజకవర్గం నుంచీ జనసమీకరణ భారీగా ఉండాలని, ఇందుకోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసుకోవాలని సీఎం దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు ఈ నెల 11 నుంచి సభ పూర్తి అయ్యేంత వరకు ఖమ్మం జిల్లాలో మకాం వేసి ఏర్పాట్లను పర్యవేక్షిస్తారని చెప్పారు.
ఇతర జిల్లాలకు చెందిన నేతలను ఖమ్మంలోని ప్రతి నియోజకవర్గానికీ ఒకరి చొప్పున ఇన్చార్జిగా నియమిస్తామని అన్నారు. వారు స్థానిక నాయకులు, ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకొని సభ విజయవంతానికి కృషి చేస్తారని సీఎం వివరించారు. అలాగే 12న భద్రాద్రి కొత్తగూడెం నూతన కలెక్టరేట్ ప్రారంభోత్సవం కూడా విజయవంతం అయ్యేలా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. సమావేశంలో మంత్రి అజయ్కుమార్, ఎంపీ నామా నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, బండి పార్థసారథిరెడ్డి, ఎమ్మెల్సీ తాతా మధు, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, ఎమ్మెల్యేలు కందాళ ఉపేందర్రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య, రాములునాయక్, హరిప్రియ, జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు తదితరులు పాల్గొన్నారు.
ఖమ్మంలో ఈ నెల 18న జరిగే బీఆర్ఎస్ సభ విజయవంతం కోసం హైదరాబాద్లో ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించిన సన్నాహక సమావేశానికి పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎంను ఎమ్మెల్యే కందాళ ప్రత్యేకంగాక కలిసి పుష్పగుచ్ఛం అందించారు. – కూసుమంచి, జనవరి 9