కల్లూరు, అక్టోబర్ 3 : అన్ని వర్గాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్న సీఎం కేసీఆర్ దళితులు మరింతగా అభివృద్ధి చెందడానికి దళితబంధు పథకాన్ని తీసుకొచ్చారు. తొలిసారిగా దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టిన తెలంగాణ ప్రభుత్వం హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రతి దళిత కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున అందించింది. తర్వాత సత్తుపల్లి నియోజకవర్గంలోని పెనుబల్లి మండలం కారాయిగూడెం, సత్తుపల్లి మండలం కిష్టారం గ్రామస్తులను పథకాన్ని వర్తింపజేసింది.
కాగా.. రెండో విడతలో సత్తుపల్లి నియోజకవర్గంలోని ప్రతి దళిత కుటుంబానికి పథకాన్ని అందేలా చేస్తామని శనివారం సత్తుపల్లిలో జరిగిన సభలో రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించిన విషయం విదితమే. దీంతో దళిత సంఘాల నాయకులు, దళితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య నియోజకవర్గవ్యాప్తంగా అందరికీ దళితబంధు అందించాలని సీఎం కేసీఆర్ దృష్టికి పలుమార్లు తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే మంత్రి కేటీఆర్ సభలో ప్రకటించిన గంటలోపే సీఎం కేసీఆర్ జీవో జారీ చేసి దళితులపై ప్రేమను చాటుకున్నారు.
నియోజకవర్గంలోని 34వేల దళిత కుటుంబాలకు ఒకేసారి పథకం అందించాలనే కృతనిశ్చయంతో ఎమ్మెల్యే సండ్ర చేసిన కృషి ఫలించింది. రాజకీయ ప్రమేయం.. మధ్యవర్తిత్వం లేకుండా పేదరికమే గీటురాటుగా నేరుగా నగదును లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయడమే ఈ పథకం లక్ష్యం. దళితబంధు పథకం లబ్ధిదారులు తమకు నచ్చిన యూనిట్లను ఏర్పాటు చేసుకొని యజమానిలా దర్జాగా బతకాలన్నదే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయం.
దళిత కుటుంబాల్లో వెలుగులు..
నియోజకవర్గంలోని ప్రతి దళిత కుటుంబానికి ఎలాంటి బ్యాంకు లింకేజీ రుణం లేకుండా 100 శాతం సబ్సిడీతో ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున సాయం అందించి ఆర్థికంగా అభివృద్ధి చేయాలని చూడడంతో వారి కుటుంబాల్లో వెలుగులు నిండినైట్లెంది. నియోజకవర్గంలోని తల్లాడ, కల్లూరు, పెనుబల్లి, సత్తుపల్లి, వేంసూరు మండలాల్లోని 34 వేల కుటుంబాలకు ఈ పథకాన్ని అందించేందుకు ప్రభుత్వం జీవో జారీ చేయడంతో దళిత సంఘాల నాయకులు, దళితులు పెద్ద ఎత్తున హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గవ్యాప్తంగా దళిత సంఘాల నాయకులు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య చిత్రపటాలకు పూలు, క్షీరాభిషేకాలు చేస్తూ కృతజ్ఞతను చాటుకుంటున్నారు.
నా కల సాకారమైంది..
నియోజకవర్గంలోని ప్రతి దళిత కుటుంబానికి ఈ పథకం అమలు చేసేందుకు మంత్రి కేటీఆర్ ఇచ్చిన మాట ప్రకారం సీఎం కేసీఆర్ జీవో సైతం జారీ చేశారు. త్వరలోనే అర్హులందరికీ దళితబంధు పథకం అమలుకు శ్రీకారం చుడతాం. ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకునే లబ్ధిదారులు సరైన యూనిట్లను ఎంచుకుని ఆర్థికంగా ఎదగాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం. నా కల సాకారమైంది. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్లకు ధన్యవాదాలు.
– సండ్ర వెంకటవీరయ్య, ఎమ్మెల్యే, సత్తుపల్లి
దళిత కుటుంబాల్లో వెలుగులు
సీఎం కేసీఆర్ దళితుల ఆర్థికాభివృద్ధి కోసం ప్రవేశపెట్టిన దళితబంధు దళిత కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నది. మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చిన గంటన్నర వ్యవధిలోనే సీఎం కేసీఆర్ అనారోగ్యంతో ఉన్నా సత్తుపల్లి నియోజకవర్గాన్ని పైలెట్ ప్రాజెక్టుగా చేస్తూ ఇచ్చిన జీవోతో దళితుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కృషితో దళితులకు దళితబంధు వర్తించడం ఆనందదాయకం.
– బీరవల్లి రఘు, దళిత నాయకుడు, కల్లూరు
దళితులకు దేవుడు కేసీఆర్
స్వయం ఉపాధితో దళితులు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు దళితబంధు పథకం బ్రహ్మాస్త్రం. సత్తుపల్లి నియోజకవర్గంలోని ప్రతి దళిత కుటుంబం దళితబంధు వర్తింపుతో కేసీఆర్ను దేవుడిలా చూస్తున్నారు. ఈ ప్రాంత దళితుల అభివృద్ధికి పాటుపడుతున్న ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యను దళితులు ఆరాధ్యునిగా చూస్తున్నారు.
– నామా వెంకటేశ్వర్లు, ఎస్సీ సెల్ నాయకుడు, చిన్నకోరుకొండి
పండుగ వాతావరణం
నియోజకవర్గవ్యాప్తంగా దళిత కుటుంబాల్లో పండుగ వాతావరణం నెలకొన్నది. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే సండ్ర చిత్రపటాలకు దళితులు, దళిత నాయకులు పాలు, పూలాభిషేకాలు చేస్తూ తమ అభిమానం చాటుకుంటున్నారు. గ్రామాలకు వస్తున్న ఎమ్మెల్యే సండ్రకు దళితులందరూ వినూత్న రీతిలో దారిపొడవునా టెంకాయలు కొడుతూ దేవుడిలా కొలుస్తున్నారు.
– పప్పుల రత్నాకర్, ఎస్సీ సెల్ నాయకుడు, పేరువంచ