భూ యజమానులు, రైతులు ఏ చీకు చింత లేకుండా ఉండడం కాంగ్రెస్ పార్టీకి నచ్చడం లేదనుకుంటా. భూముల భద్రత కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నడిపిస్తున్న ‘ధరణి’ పోర్టల్పై ఆ పార్టీ అక్కసు వెళ్లగక్కుతున్నది. కాలగర్భంలో కలిసిపోయిన లిటిగేషన్ చట్టాలను తిరిగి తీసుకొచ్చేందుకు కుటిల యత్నాలు చేస్తున్నది. అందుకు నిదర్శనమే కాంగ్రెస్ పార్టీ శుక్రవారం ప్రకటించిన మ్యానిఫెస్టో. తమ పార్టీ అధికారంలోకి వస్తే ధరణి స్థానంలో ‘భూమాత’ పోర్టల్ తీసుకొస్తామని ఆర్భాటంగా ప్రకటించింది. దీనిపై సీఎల్పీ నేత, మధిర ఎమ్మెల్యే మల్లు భట్టివిక్రమార్క ఓ టీవీ చానెల్ ఇంటర్వ్యూలో ‘ధరణి’పై మరింత స్పష్టంగా విషం చిమ్మారు. తమ పోర్టల్లో పట్టేదారు, అనుభవదారు, మాన్యందారు వంటి పాతకాలపు కాలమ్స్ తీసుకొస్తామని, రైతులు భూమిని కౌలుకు ఇవ్వాలంటే కౌలురైతుతో ఒప్పంద పత్రం రాయించుకునేలా నిబంధనలు తీసుకువస్తామని స్పష్టం చేశారు. గతంలో ఎవరెవరి పేరు మీద భూములు ఉన్నాయో.. వాటన్నింటినీ తిరిగి వాళ్లకే ఇచ్చేస్తామని ప్రకటించారు. ఈ వ్యాఖ్యలను యావత్ రైతాంగం వ్యతిరేకిస్తున్నది. కాంగ్రెస్ పార్టీ మళ్లీ పటేల్, పట్వారీ వ్యవస్థను తీసుకొచ్చేందుకు, అవినీతి, దళారులు, మధ్యవర్తుల వ్యవస్థకు ఆజ్యం పోస్తున్నదని మండిపడుతున్నది.
ఖమ్మం, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): భూమి విలువైనది. ప్రతిఒక్కరికీ ప్రియమైనది. వారసత్వంగా సంక్రమించినా, కష్టపడి సంపాదించినా ఆ భూమి ప్రాణప్రదమే. అటు వంటి భూమిని అమ్మినప్పుడు, కొన్నప్పుడు గతంలో ప్రజలు రకరకాల ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొన్నవారు తమ పేరుపై భూరిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే సవాలక్ష సాంకేతిక సమస్యలు తలెత్తేవి. నెలల తరబడి, సంవత్సరాల తరబడి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ, అధికారుల చేయితడిపితే కానీ పని పూర్తయ్యేది కాదు. వెరసి రైతులు ఏళ్లపాటు మానసిక ఆందోళనకు గురయ్యేవారు. ఇక వృద్ధులైతే తమ చిరకాల వాంఛ తీరకుండానే కాలం చేసేవారు. ఇప్పుడా పరిస్థితి లేదండోయ్.. సీఎం కేసీఆర్ భూరికార్డుల ప్రక్షాళన చేస్తూ మూడేళ్ల క్రితం ప్రతిష్ఠాత్మకంగా ‘ధరణి’ పోర్టల్ను ప్రారంభించారు. ఇక రిజిస్ట్రేషన్లకు దళారులు, మధ్యవర్తుల అవసరమే లేదు. అధికారులకు లంచం అగత్యం అంతకంటే లేదు.
ఒక్కసారి ‘మీసేవ’లో స్లాట్ బుక్ చేసుకుంటే చాలు.స్లాట్ వచ్చిన రోజు తహసీల్దారు కార్యాలయానికి వెళ్తే టీ తాగినంత సమయంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుంది. ఇప్పుడు డబుల్ రిజిస్ట్రేషన్కు అవకాశమే లేదు. గతంలో రిజిస్ట్రేషన్ కోసం సబ్రిజిస్ట్రార్ కార్యాలయాలకు వెళ్లాల్సివచ్చేది. ఆ కార్యాలయాలు మారుమూల గ్రామాలకు చాలా దూరంగా ఉండేవి. ధరణి వచ్చిన తర్వాత ఇప్పుడు తహసీల్దారు కార్యాలయంలోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతున్నది. ముఖ్యంగా వృద్ధులు సులువుగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయించుకుంటున్నారు. పోర్టల్లో రైతులు సర్వే నంబర్లు చూసుకునే అవకాశం ఉంటుంది. ధరణితో ఎవరి భూమి ఏమిటని తేలడంతో గ్రామాల్లో గెట్టు పంచాయితీల గొడవలూ తగ్గాయి.
కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన మ్యానిఫెస్టోలో ‘భూమాత’ను ప్రధానంగా పేర్కొన్నది. దీనిపై సీఎల్పీ నేత, మధిర ఎమ్మెల్యే మల్లు భట్టివిక్రమార్క ఓ టీవీ చానెల్ ఇంటర్వ్యూలో కొన్ని విషయాలు స్పష్టం చెప్పారు. తాము అధికారంలోకి వస్తే ‘ధరణి’ని పూర్తిగా రద్దు చేస్తామని ప్రకటించారు. భూమాత పోర్టల్ పెట్టి కాలం చెల్లిన పట్టేదారు, అనుభవదారు, మాన్యందారు వంటి పాతకాలపు కాలమ్స్ తీసుకొస్తామన్నారు. రైతులు భూమిని కౌలుకు ఇవ్వాలంటే కౌలురైతుతో ఒప్పంద పత్రం రాయించుకునేలా నిబంధనలు తీసుకువస్తానమని స్పష్టం చేశారు. గతంలో ఎవరెవరి పేరు మీద భూములు ఉన్నాయో.. వాటన్నింటినీ తిరిగి వాళ్లకే ఇచ్చేస్తామని గోల్మాల్ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను యావత్ రైతాంగం వ్యతిరేకిస్తున్నది. కాంగ్రెస్ పార్టీ మళ్లీ పటేల్, పట్వారీ వ్యవస్థను తీసుకొచ్చేందుకు పావులు కదుపుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. ధరణి వచ్చిన తర్వాత తమ భూములకు భద్రత లభించిందని, ఇప్పుడు తామెంతో ధైర్యంగా ఉన్నామని ముక్తకంఠంతో చెప్తున్నారు. భూమాత వస్తే మళ్లీ దళారులు, మధ్యవర్తులు పుట్టుకొస్తారని, అవినీతి మళ్లీ కోరలు విప్పుతుందని మండిపడుతున్నారు.
కౌలు రైతుల కాలంను రికార్డుల్లో పెడితే ఇంకా ఏమైనా ఉంటుందా..? కౌలు రైతులకు, భూ యజమానులకు గొడవ పెట్టుడే అవుతుంది. అప్పుడు ఎంతో మంది భూమి మునాబకు ఇస్తున్నారు. అట్లాంటింది బాండ్లు అని.. ఇంకా ఏదో అని వారికి ఆశచూపి కోర్టుల చుట్టూ తిప్పడం తప్ప మరే ఉద్దేశం కనపడడం లేదు. అన్ని సమస్యలకు ధరణి పరిష్కారం చూపింది. కాంగ్రెస్ మాటలను ఎవరూ పట్టించుకోరు. ఇలాంటి ప్రకటనలు చేయడం వల్లే ఆ పార్టీ అంత చులకన అయ్యింది. భూ యజమానులు, కౌలు రైతుల మధ్య అగాధాలు తెచ్చేందుకే కాంగ్రెసోళ్లు మాట్లాడుతున్నట్లుంది.
గత ప్రభత్వాల హయాంలో లంచాలు ముడితే కానీ భూములు మార్పిడి అయ్యేవి కావు. దాని నుంచి రైతులకు విముక్తి కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం ధరణి పోర్టల్ను తీసుకొచ్చింది. మళ్లీ కాంగ్రెస్ వస్తే ధరణిని తీసివేసి పాత పద్ధతి మాదిరిగా పటేల్, పట్వారీ వ్యవస్థను తీసుకొస్తాం అంటున్నది. దీనివల్ల అంతా దాచుకోవడం, దోచుకోవడమే అవుతుంది. రికార్డుల్లో భూ యజమాని పేరు మాత్రమే ఉండాలి. ఐట్లెతేనే అతనికి స్వేచ్ఛ, భూమికి భద్రత. భూమి ఒకరిదైతే రికార్డుల్లో మరో కాలం పెట్టుడు ఎందుకు? ఇద్దరి మధ్య కిరికిరి పెట్టుడెందకు? ధరణిని తీసివేస్తామని రైతులకు దగ్గరికి వచ్చి చెప్పండి అప్పుడు తెలుస్తుంది.
ధరణిని తీసివేయడం అంటే రెవెన్యూ వ్యవస్థను తిరిగి అస్తవ్యస్తం చేయడమే అవుతుంది. సీఎం కేసీఆర్ దయతో రూపాయి ఖర్చు లేకుండా పాస్ పస్తకాలు వచ్చాయి. లక్షలాది మంది రైతులకు ఎంతో ధైర్యం వచ్చింది. ఆపదకు సొంత భూమిని అమ్ముకోవాలన్నా.. కొనాలన్నా ఇప్పుడు చాలా తేలిక అయ్యింది. కాంగ్రెసోళ్లు ఇంతమంచి సౌలతును తీసివేయడం అంటే మళ్లీ లంచాలకు తెరతీయడమే అవుతుంది. అసలు ధరణిని తీసివేయాలని రైతులను ఎవరు అడగారని కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు. వారి స్వలాభం కోసం మాట్లాడడం తప్ప మరేం లేదు.
తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన ధరణి పోర్టల్ వల్ల తహసీల్దార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ వెంటనే పూర్తవుతుంది. క్రయ, విక్రయదారు ఉంటే వెంటనే వేలిముద్రల ద్వారా రిజిస్ట్రేషన్ పూర్తయి పాస్బుక్లోకి పేరు ఎక్కిస్తున్నారు. కానీ.. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ధరణి తీసేసి భూమాత పోర్టల్ ఏర్పాటు చేస్తామని ప్రకటించడంతో అయోమయంగా ఉంది. కౌలుదారులు, అనుభవదారుల కాలమంటూ మళ్లీ పరిస్థితి మొదటికొస్తుంది. పటేల్, పట్వారీ వ్యవస్థను తీసుకొచ్చే పరిస్థితి ఉంది. దీనివల్ల రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతారు. మళ్లీ భూ సమస్యలు తలెత్తుతాయి.
ధరణి స్థానంలో కాంగ్రెస్ నాయకులు భూమాత పోర్టల్ తీసుకొస్తామని ప్రకటన చేయడం ఆందోళనగా ఉంది. మళ్లీ పాత రోజులు వస్తాయేమో.. రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తుందేమోనని రైతులు ఆలోచనలో పడ్డారు. ధరణి పోర్టల్ విధానం వల్ల మా రికార్డులు భద్రంగా ఉన్నాయి. భూమాత పోర్టల్ పేరుతో కౌలు, అనుభవదారులు కాలమ్స్ ఏర్పాటు చేసి రికార్డులు తారుమారు చేస్తారేమోనని భయంగా ఉంది. తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన ధరణి పోర్టల్ మా భూములకు శ్రీరామరక్ష.
గత ప్రభుత్వాల హయాంలో రెవెన్యూ పరిపాలన రైతుల పాలిట శాపంగా ఉండేది. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్ ద్వారా రైతులకు చాలా వరకు మేలే జరిగింది. గతంలో ఉన్న తప్పులను సరిదిద్దేందుకు.. రైతుల భూములకు రక్షణగా నిలిచింది. కానీ.. చిన్నచిన్న సాకులు చూపుతూ కాంగ్రెస్ పార్టీ మళ్లీ యాభై ఏళ్ల క్రితం నాటి పటేల్, పట్వారీ వ్యవస్థను తీసుకొస్తామని చెప్పడం రైతులను మోసం చేయడమే అవుతుంది. ఆనాటి వ్యవస్థ అక్రమాలకు, అవినీతికి అడ్డాగా ఉండేది. మళ్లీ అలాంటి రోజులే రావాలని రైతులు కోరుకోరు. ధరణితోనే రైతుల భూములకు భరోసా.
రెవెన్యూ రికార్డులు సక్రమంగా ఉండేందుకు తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్తో రైతులకు ఎంతో మేలు. కాంగ్రెస్ తీసుకొస్తానంటున్న భూమాత పోర్టల్ ద్వారా తిరిగి భూ సమస్యలు మొదటికొస్తాయి. ఒకరి భూములు మరొకరికి రెవెన్యూ అధికారులు మార్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. మరోపక్క కౌలుదారులు, అనుభవదారుల కాలం అంటూ కొత్త గైడ్లైన్స్ తెచ్చి రైతులను ఇబ్బందులకు గురిచేసే పరిస్థితి వచ్చేలా ఉంది. ఈ పోర్టల్ వల్ల భూమి రికార్డులు తారుమారు కావడం, రైతులు నష్టపోవడం వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి.
ధరణి పోర్టల్ ద్వారా క్రయ, విక్రయదారులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా రిజిస్ట్రేషన్ ప్రక్రియ వెంటనే పూర్తవుతున్నది. పట్టాదారు పాస్పుస్తకంలో కొనుగోలు చేసిన వారి పేరు ఎక్కించుకునే అవకాశం ఉన్నది. భూమాత పోర్టల్ ద్వారా రకరకాల కాలమ్స్ను పెడతామనడంతో రైతులకు చిక్కులు తప్పవు. గతంలో మాదిరిగా భూ రికార్డులకు భద్రత లేకుండా మళ్లీ రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వచ్చే అవకాశం ఉన్నది. అవగాహన లేకుండా కాంగ్రెస్ నేతలు ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు.
కాంగ్రెస్ వస్తే ధరణి పోర్టల్ను రద్దు చేస్తామనడం విడ్డూరంగా ఉంది. గతంలో రైతులు పడిన కష్టాలు మళ్లీ వస్తాయి. కాంగ్రెస్ తెచ్చే భూమాత పోర్టల్లో తగాదాలు, కొట్లాటలు పెరుగుతాయి. రికార్డుల్లో పేర్ల మార్పులు, చేర్పులతో గొడవలు మొదలవుతాయి. ధరణి పోర్టల్ రద్దుతో దళారుల ప్రమేయం పెరుగుతుంది. రైతులకు భూసమస్యలు ఎక్కువవుతాయి. సీఎం కేసీఆర్ ధరణి పోర్టల్ తెచ్చిన తర్వాత భూసమస్యలు తగ్గిపోయాయి. రైతులకు కార్యాలయాల చుట్టూ తిరిగే బాధలు పోయాయి. ధరణి పోర్టల్తోనే రైతుల భూములకు రక్షణ ఉంటుంది.
సీఎం కేసీఆర్ ధరణి పోర్టల్ పెట్టి రైతులకు ఖర్చు లేకుండా పట్టాదారు పాస్పుస్తకాలు ఇచ్చారు. కాంగ్రెస్ మళ్లీ ధరణిని తీసివేసి భూమాత పోర్టల్ పెడతామని చెబుతున్నది. ఇందులో కౌలుదారులు, అనుభవదారుల కాలంలో పెడతామని చెప్పడం సరికాదు. కౌలుదారులను అనుభవదారుల కాలంలో పెడితే రైతుబంధు డబ్బులు మొత్తం కౌలుదారులకు వెళతాయి. ప్రస్తుతం భూమి హక్కు రైతులకు ఉన్నప్పటికీ భూమాత పోర్టల్ వల్ల రైతుకు భద్రత లేకుండా పోతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రైతాంగానికి నష్టం కలిగే పరిస్థితి ఏర్పడుతుంది.
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్ వల్ల అవినీతికి తావు లేకుండా రిజిస్ట్రేషన్లు చేసుకుంటున్నారు. రెవెన్యూ వ్యవస్థలో వీఆర్వోలను తొలగించి ధరణి అనే పోర్టల్ను సీఎం కేసీఆర్ తీసుకొచ్చారు. ఆన్లైన్ పద్ధతి విధానంలో సులభమైన పద్ధతిలో స్లాట్ చేసుకొని పదే పది నిమిషాల్లో రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. కాంగ్రెస్ నాయకులు అధికారంలోకి రావడానికి అనేక మాయమాటలు చెబుతూ ధరణి పోర్టల్ స్థానంలో భూమాత తీసుకొస్తామని చెప్పడం సిగ్గుచేటు.