ఖమ్మం, మార్చి 7: వేసవి వస్తుందంటే చాలు.. గతంలో ఖమ్మం జిల్లాలో తాగునీటికి, సాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యేవి. వీటికి విద్యుత్ సమస్యలూ తోడయ్యేవి. కానీ తెలంగాణ సిద్ధించాక ఈ ఇబ్బందులు పూర్తిగా తొలగిపోయాయి. ఈ సమస్యలపై దృష్టి సారించిన సీఎం కేసీఆర్.. వీటికి ఫుల్స్టాప్ పెట్టారు. విద్యుత్ సమస్యలైతే వెతుకుదామన్నా కనిపించని పరిస్థితి. అయితే, ప్రస్తుత వేసవిలో జిల్లా ప్రజలకు తాగునీటి సమస్య ఎదురుకాకుండా పక్కాగా చర్యలు చేపడుతున్నామని చెబుతున్నారు మిషన్ భగీరథ జిల్లా ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పుష్పలత. ప్రజలు, ప్రజాప్రతినిధుల సహకారంతో జిల్లాలో ఎలాంటి సమస్యలూ లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అన్ని ప్రాంతాలకూ నిరంతరం మంచినీరు సరఫరా అయ్యేలా చర్యలు చేపట్టామని, దీనికోసం డీఈలు, ఏఈలను అప్రమత్తం చేశామని తెలిపారు. ఈ సందర్భంగా శనివారం ఆమె ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడారు.
నమస్తే తెలంగాణ: ఈ వేసవిలో నీటి ఎద్దడి నివారణకు ప్రణాళిక ఏమిటి?
ఈఈ పుష్పలత: జిల్లాలోని 9 గ్రామాలు మినహా 960 గ్రామాల్లో మంచినీటి ఎద్దడి నివారణకు చర్యలు చేపట్టాం. జిల్లాలో ప్రతి ఒక్కరికీ మిషన్ భగీరథ ద్వారా సురక్షితమైన మంచినీటిని అందించమే లక్ష్యంగా ప్రణాళిక రూపొందించాం. ఎక్కడైనా నీటి సమస్యల వస్తే వెంటనే పరిష్కరించేలా సిబ్బందిని ఏర్పాటు చేశాం.
నమస్తే: ఆ 9 గ్రామాలు భగీరథ నీరు ఇవ్వడం లేదా?
ఈఈ: జిల్లాలో పలు కారణాల రీత్యా 9 గ్రామాలకు భగీరథ నీళ్లు ఇవ్వలేకపోయాం. వీటిలో చింతకాని మంతడలంలోని గాంధీనగర్, బొప్పారం, ఖమ్మం రూరల్ మండలంలోని వెంకటగిరి ఇందిరమ్మకాలనీ, కోటనారాయణపురం, తిరుమలాయపాలెం మండలంలోని రాకాసితండ, పెనుబల్లి మండలంలోని కొత్తలంకపల్లి, కామేపల్లి మండలంలోని రాజీవ్నగర్ ఉన్నాయి. అక్కడ బ్రిడ్జిలు, రైల్వే లైన్లు, పైపులైన్లు, ట్యాంకుల పరిమాణాల వల్ల అందించలేకపోతున్నాం. త్వరలోనే ఆ గ్రామాలకూ నీళ్లు అందిస్తాం.
నమస్తే: జిల్లాలో నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాలను గుర్తించారా?
ఈఈ: జిల్లాలో వేసవిలో నీటి ఎద్దడి ఉన్న గ్రామాలు అంటూ ఏమీ లేవు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తరువాత మిషన్ భగీరథ ద్వారా ప్రతి గ్రామానికీ మంచినీటి పైపులైన్లు నిర్మించాం. వాటి ద్వారా నీళ్లు సరఫరా చేస్తున్నాం. ఆయా గ్రామాల్లో జనాభా సంఖ్య కంటే అదనంగా రాబోయే 30 ఏళ్ల వరకు పెరగబోయే జనాభాను అంచనా వేసి అందుకు సరిపడేలా ట్యాంకులను నిర్మించాం.
నమస్తే: పైపులైన్ల లీకేజీలను ఎలా అరికడుతున్నారు?
ఈఈ: జిల్లాలో అనేక అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. రహదారులు, బ్రిడ్జిలు, రోడ్ల విస్తరణ వంటివి జరుగుతున్న చోట్ల లీకేజీలు ఏర్పడుతున్నాయి. వాటిని అరికట్టడానికి సిబ్బందిని అప్రమత్తం చేశాం. ప్రస్తుతానికి లీకేజీల సమస్య అంతగా లేదు.
నమస్తే: ప్రజలకు సమస్య వస్తే ఎవరిని సంప్రదించాలి?
ఈఈ: జిల్లాలో మంచినీటి సమస్యలు ఎదురైతే జిల్లా కేంద్రంలోని మిషన్ భగీరథ కార్యాలయంలో సంప్రదించవచ్చు. 8247756276 పేరుతో టోల్ ఫ్రీం నెంబర్ ఏర్పాటు చేశాం. దీనికోసం ఒక మానిటరింగ్ సెల్ను కూడా ఏర్పాటు చేశాం. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సిబ్బంది అందుబాటులో ఉంటారు.