ఖమ్మం సిటీ, ఏప్రిల్ 25: తెలంగాణ ప్రభుత్వ సహకారంతో ఖమ్మంలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న మెడికల్ కళాశాలకు సంబంధించి అన్ని పనులు మే నెల 10వ తేదీ నాటికి పూర్తి చేయాలని, అవసరమైతే ఎక్కువ మంది టెక్నీషియన్లు, వర్కర్లను తెచ్చుకోవాలని తెలంగాణ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ ఎడ్యుకేషన్(డీఎంఈ) డాక్టర్ రమేశ్రెడ్డి ఆదేశించారు. మంగళవారం ఖమ్మానికి విచ్చేసిన ఆయన ప్రభుత్వాసుపత్రికి అనుసంధానంగా మంజూరైన ప్రభుత్వ మెడికల్ కళాశాల పనులను పరిశీలించారు. పాత కలెక్టరేట్, ఆర్అండ్బీ శాఖ కార్యాలయ ఆవరణలో చురుగ్గా సాగుతున్న తరగతి గదులు, ఛాంబర్, బాలికల హాస్టల్ ఏర్పాటు పనులను సందర్శించారు. ఆ క్రమంలో ఆయన అడిగిన ప్రశ్నలకు స్థానిక యంత్రాంగం సమాధానాలు ఇచ్చింది. క్లాస్ రూమ్స్, అనాటమీ, అడ్మినిస్ట్రేషన్కు సంబంధించిన పనులు పూర్తయ్యాయని వివరించారు. అనంతరం మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్, ప్రభుత్వాసుపత్రి అన్ని విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంఈ మాట్లాడుతూ నేషనల్ మెడికల్ కమిషన్ నుంచి అన్ని రకాల అనుమతులు వచ్చిన నేపథ్యంలో ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచే తరగతులు ప్రారంభించనున్నామని పేర్కొన్నారు. నీట్ పరీక్ష ముగిసిన వెంటనే 100 సీట్లకు అడ్మిషన్లు తీసుకుంటామన్నారు.
ఫుట్ ఓవర్ బ్రిడ్జికి నిధులు
ప్రభుత్వాసుపత్రికి-పాత కలెక్టరేట్లోని మెడికల్ కాలేజీకి అనుసంధానంగా నిర్మించనున్న ఫుట్ ఓవర్ బ్రిడ్జికి రూ.3.25కోట్ల్ల నిధులకు పరిపాలనా అనుమతులు వచ్చాయని డీఎంఈ డాక్టర్ రమేశ్రెడ్డి వెల్లడించారు. తక్షణమే పనులు ప్రారంభించాలన్నారు. అలాగే ఖమ్మం ప్రభుత్వాసుపత్రి, మెడికల్ కాలేజీ అవసరాల నిమిత్తం మరో 20 మంది అసోసియేట్ ప్రొఫెసర్లు, 40 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లను తెలంగాణ ప్రభుత్వం కేటాయించిందన్నారు. వారు త్వరలోనే విధుల్లో చేరుతారని డీఎంఈ తెలిపారు. సమావేశంలో మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ రాజేశ్వరరావు, పెద్దాసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బీ.వెంకటేశ్వర్లు, ఆర్ఎంవో డాక్టర్ బొల్లికొండ శ్రీనివాసరావు, ఆసుపత్రి ఏవో డాక్టర్ కేసగాని రాజశేఖర్గౌడ్, ఎంసీహెచ్ ఇన్చార్జ్ డాక్టర్ కృపా ఉషశ్రీ, డాక్టర్ మంగళ, డాక్టర్ యామిని, డాక్టర్ సరిత, పరిపాలనా విభాగపు ఏవో ఆర్వీఎస్ సాగర్, డైటీషియన్ సూర్యపోగు మేరీ, ఆయుష్ డాక్టర్స్ దుర్గ, వైష్ణవి, కళ, దివ్య, తులసి, నందగిరి శ్రీను తదితరులు పాల్గొన్నారు. సమీక్ష అనంతరం ఆరోగ్య మహిళ కరపత్రాన్ని ఆవిష్కరించారు. చివరగా ప్రభుత్వాసుపత్రి హెచ్వోడీస్, టీఎన్జీవోస్ ఉద్యోగ సంఘ నాయకులు డీఎంఈ డాక్టర్ రమేశ్రెడ్డిని ఘనంగా సన్మానించారు.