సత్తుపల్లిటౌన్, జూలై 17 : సీతారామ ప్రాజెక్టు రూపకల్పన చేసిందే కేసీఆర్ అని, ఆయన హయాంలోనే కాలువలు, ప్రాజెక్టు పనులు 70 శాతం పూర్తయ్యాయని మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య గుర్తు చేశారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార రెండున్నరేళ్లలో రూ.వెయ్యి కోట్లు ఖర్చు పెట్టామని చెప్పారని, జిల్లాలో ఒక మంత్రికి పేరొస్తుందనే ఉద్దేశంతో ఇద్దరు మంత్రులు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డిని తీసుకొచ్చి హడావుడి చేశారని విమర్శించారు.
సత్తుపల్లి పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో శుక్రవారం బీఎల్ఏలతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. రూ.19వేల కోట్ల ప్రాజెక్టులో రూ.10 వేల కోట్లతో బీఆర్ఎస్ ప్రభుత్వమే ప్రాజెక్టు నిర్మాణం, మోటర్లు, భూసేకరణ, కాలువల తవ్వకాలకు ఖర్చు పెట్టిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చిన్న కాలువ తవ్వి ఇదంతా తమ గొప్పతనమేనని చెప్పుకోవడం తగదన్నారు. యాతాలకుంట టన్నెల్ పనులకు తానే శంకుస్థాపన చేసిన విషయాన్ని గుర్తు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై దుష్ప్రచారం చేయడం తగదని, కన్నెపల్లి పంప్హౌస్ వద్ద మోటర్లు ఆన్ చేస్తే గోదావరి జలాలు రైతుల పొలాలకు అందించవచ్చన్నారు.
నీళ్లు అడిగితే రక్తం చెల్లిస్తామని సీఎం స్థాయి వ్యక్తి దిగజారి మాట్లాడుతున్నారని, అవసరమైతే మా కార్యకర్తల రక్తం పంపించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. రైతుబంధు రెండుసార్లు ఎగ్గొట్టిన విషయం రైతులకు తెలుసన్నారు. ఎవరు ఎన్ని చెప్పినా రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించడం ఖాయమన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు కూసంపూడి మహేశ్, శీలపురెడ్డి హరికృష్ణారెడ్డి, కొత్తూరు ఉమామహేశ్వరరావు, ఎస్కే రఫీ, మల్లూరు అంకమరాజు, ఎస్కే చాంద్బాషా, అమరవరపు కృష్ణారావు, దొడ్డా శంకర్రావు, ఎండీ అయూబ్పాషా, కోటగిరి వెంకటరావు పాల్గొన్నారు.