‘రక్షకుండుదయించినాడట. దావీదు వంశమున ధన్యుడు జన్మించినాడట..’ అంటూ ప్రత్యేక ప్రార్థనలు జరుపుకుంటారు క్రైస్తవులు. లోకరక్షకుడి జన్మదినం మహిమాన్వితమైనదని, పవిత్రమైనదని విశ్వాసం. క్రైస్తవుల పండుగల్లో క్రిస్మస్ పండుగ అతి ముఖ్యమైనది. క్రీస్తు జన్మదినాన్ని క్రైస్తవులు క్రిస్మస్గా జరుపుకుంటారు. క్రైస్ట్, మాస్ అనే పదాల కలయికే క్రిస్మస్. క్రైస్ట్ అంటే క్రీస్తు, మాస్ అంటే ఆరాధన.
క్రీస్తు జన్మదినాన్ని సోమవారం ఉమ్మడి జిల్లా అంతటా క్రైస్తవులు అత్యంత భక్తి ప్రపత్తులతో ఆనందోత్సాహాలతో జరుపుకోనున్నారు. చర్చిలన్నీ రంగురంగుల విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. ఆదివారం రాత్రి పదకొండు గంటల నుంచే క్రిస్మస్ ఆరాధనలను నిర్వహిస్తారు. ప్రత్యేకమైన క్రీస్తు పాటలు పాడి, క్రీస్తు జన్మ వృత్తాంతానికి చెందిన సందేశాన్ని చాటుతారు. క్రైస్తవులంతా నూతన వస్ర్తాలను కొనుగోలు చేసి గృహాలను రంగులు, విద్యుత్దీపాలతో అలంకరించుకున్నారు. ప్రేమ, త్యాగం, కరుణ విలువలను చాటిన ఏసు సందేశం ఈ రోజున వాడవాడలా మార్మోగనుంది.
మన దేశంలోని క్రిస్మస్ తాతనే పాశ్చాత్యదేశాల్లో శాంతాక్లాజ్గా పిలుస్తారు. క్రిస్మస్ తాత సంప్రదాయం మూడో శతాబ్దంలో ప్రాచుర్యంలోకి వచ్చింది. క్రిస్మస్కు ముందు రోజు రాత్రి క్రిస్మస్ తాత ఇంటింటికీ వెళ్లి బహుమతులను ఇంటి ముంగిట పెట్టి తలుపుకొట్టి వెళ్లి పోయేవాడని పాశ్చాత్య దేశాల్లో ప్రాచుర్యం ఉంది. గంటల ప్రత్యేకత.. గడియారాలు లేని రోజుల్లో చర్చిల్లో సమయానుసారంగా మోగించే గంటలే ఊరంతటికీ సమయమెంతో తెలిపేవి. ముఖ్యంగా చర్చిలో ప్రార్థనలు, ఆరాధనల వేళల్లో గంటలు మోగగానే అందరూ హాజరయ్యేవారు. ప్రభువు సన్నిధికి తాము వెళ్లే సమయాన్ని సూచిస్తున్నందున గంటకు ప్రత్యేకత ఏర్పడింది.
రోమ్ సామ్రాజ్యానికి చెందిన తొలి క్రైస్తవ చక్రవర్తి అయిన కాన్స్లాంటిన్ క్రీస్తు జన్మదినాన్ని క్రిస్మస్గా ఆచరిం చడం ప్రారంభించారు. క్రీస్తు జన్మదినాన్ని క్రిస్మస్గా ఆచరిస్తున్నప్పటికీ ఈ సంప్రదాయం మాత్రం ఆయన పుట్టిన 356 ఏళ్ల తర్వాత ప్రారంభమైనట్లు చరిత్ర చెబుతోంది. ఆ తర్వాత పోప్ జూలియన్ డిసెంబర్ 25ను క్రీస్తు జన్మదినంగా అధికారికంగా ప్రకటించారు. కానీ క్రిస్మస్ను ప్రపంచం అంతటికీ పరిచయం చేసిన ఘనత మాత్రం బ్రిటన్కు చెందిన సెయింట్ ఆగస్టీన్కు దక్కుతుంది. ఈయన రోమన్ క్యాలెండర్ ఆచరించే పాశ్చాత్య దేశాలన్నింటికీ ఈ పండుగను పరిచయం చేశారు. భారతదేశంలో క్రైస్తవులు తొలి శతాబ్దం నుంచే ఉన్నప్పటికీ క్రిస్మస్ ఆచరణ మాత్రం బ్రిటీష్ మిషనరీల రాకతోనే ప్రాచుర్యంలోనికి వచ్చింది.
క్రిస్మస్ సందర్భంగా క్రైస్తవుల షాపింగ్ల సందడి ముగిసింది. వారం రోజుల ముందు నుంచే నగరంలో పండుగ సందడి నెలకొంది. క్రిస్మస్ వేడుకల కోసం కేక్లు, స్వీట్లు ఆర్డర్ ఇచ్చేందుకు స్వీటు షాపులు కిటకిటలాడాయి. క్రైస్తవుల ఇళ్లపైన నక్షత్రం ఆకారంలో విద్యుత్ బల్బులు ఏర్పాటు చేశారు. అంతటా క్రిస్మస్ ట్రీలు, బెల్స్, బెలూన్లు, స్టార్లు, శాంతాక్లాజ్ స్టిక్కర్లు, పండుగ శుభాకాంక్షలు తెలిపే బోర్డులు, పశువుల పాకలతో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.
జిల్లాలో రోమ్ క్యాథలిక్ మిషన్ (ఆర్సీఎం)కు చెందిన పలు చర్చిల్లో ఆదివారం అర్ధరాత్రి నుంచే క్రిస్మస్ ఆరాధనలను ప్రారంభించారు. ఖమ్మం రూరల్ మండలం కరుణగిరి, నాయుడుపేట, ఖమ్మం నగరంలోని వైరారోడ్డు, శ్రీనివాసనగర్, మౌంట్ఫోర్టు, తల్లాడ, కల్లూరు, పాల్వంచ, కొత్తగూడెంలోని ఆర్సీఎం చర్చిల్లో, భద్రాచంలోని సెయింట్ ఆన్స్ ఆర్సీఎం చర్చిల్లో రాత్రి 11 గంటల నుంచే క్రిస్మస్ ఆరాధనలు ప్రారంభించారు. ప్రొటాస్టేన్స్ చర్చిలైన సెయింట్ మేరిస్, సీఎస్ఐ చర్చి, ఎన్ఎస్పీ క్యాంపులోని హోలీ ట్రీనిటీ చర్చి, ఇందిరానగర్లోని సీఎస్ఐ క్రైస్ట్ చర్చి, ఖానాపురం హవేలీలోని లివర్స్ చర్చి, కూసుమంచిలోని ఇమ్మాన్యూయేల్ చర్చి, కొత్తగూడెంలోని ఆండ్రూస్ చర్చి, భద్రాచలంలోని సీఎస్ఐ క్రైస్ట్ చర్చి, పాల్వంచ, ఇల్లెందు, వైరా, రుద్రంపూర్, రామవరం, సత్తుపల్లిలోని సీఎస్ఐ చర్చిల్లో సోమవారం ఉదయం నాలుగు గంటల నుంచి క్రిస్మస్ ఆరాధనలను నిర్వహించనున్నారు.
నెలలు నిండిన కన్య మరియమ్మను ఏసోబు తన సొంత గ్రామమైన బేత్తెహాముకు తీసుకుని వెళ్తారు. కానీ వారికి ఆ గ్రామంలో ఎక్కడా చోటు లభించదు. చివరికి ఒక పశువుల పాకలో తలదాచుకోవడానికి చోటు లభిస్తుంది. అప్పటికే నొప్పులు పడుతున్న మరియమ్మ చిన్నారి ఏసుకు జన్మనిస్తుంది. ఆ బాల ఏసును పొత్తి గుడ్డల్లో చుట్టి పశువుల తొట్టిలో ఉంచుతారు. దేవుడు భూమిపై జన్మించాలనుకుంటే ఏ రాజు కోటలోనో, ధనవంతుల ఇళ్లల్లో జన్మించి ఉండవచ్చు. కానీ తాను సామాన్య మానవుల కోసం లోకానికి వచ్చాననే సందేశాన్ని ఇవ్వడానికి పశువుల పాకలో క్రీస్తు జన్మించాడని క్రైస్తవుల విశ్వాసం.
ఖమ్మం/కొత్తగూడెం టౌన్, డిసెంబర్ 24: క్రిస్మస్ పండుగ సందర్భంగా ఉమ్మడి జిల్లాకు చెందిన క్రైస్తవులకు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, మాజీ ఎమ్మెల్యే కందాళ, ఉభయ జిల్లాల కలెక్టర్లు వీపీ గౌతమ్, ప్రియాంక ఆల శుభాకాంక్షలు తెలిపారు. సంతోషంగా పండుగ జరుపుకోవాలని ఆకాంక్షించారు. ప్రేమ, కరుణ, దయ, సహనం, క్షమాపణ గుణాన్ని జీవితంలో భాగంగా చేసుకోవాలని సూచించారు. ప్రజలందరూ సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కాంక్షించారు.