ఖమ్మం వ్యవసాయం, ఫిబ్రవరి 21: ఖమ్మం నగరంలోని వ్యవసాయ మార్కెట్లో జోర్దార్గా మిర్చి అమ్మకాలు జరుగుతున్నాయి. రెండు రోజుల క్రితం రైతులు మార్కెట్కు లక్ష మిర్చి బస్తాలకు పైగా తీసుకురాగా మార్కెటింగ్శాఖ అధికారులు మిర్చి యార్డుతోపాటు అపరాల యార్డునూ మిర్చి విక్రయాలకు కేటాయించారు. ఏఎంసీ పరిధిలో బుధవారమూ ఇదే ఒరవడి కనిపించింది. రైతులు ఇంచుమించు లక్ష బస్తాలకు పైగా మిర్చిని మార్కెట్కు తీసుకొచ్చారు. దీంతో మిర్చి యార్డుతో పాటు అపరాల యార్డు కూడా మిర్చి బస్తాలతో నిండింది. ఏఎంసీకి ఖమ్మం జిల్లా నుంచే కాక పొరుగు జిల్లాలైన భద్రాద్రి, మహబూబాబాద్ జిల్లాల నుంచీ పంట తరలొచ్చింది. గత్యంతరం లేని స్థితిలో కొన్ని బస్తాలను రహదారి పక్కన ఉంచి క్రయ విక్రయాలు చేపట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉదయం జరిగిన జెండా పాటలో క్వింటాకు గరిష్ఠ ధర రూ.21,350 పలుకగా, మధ్యస్థ ధర రూ.19,500, కనిష్ఠ ధర రూ.14 వేల చొప్పున పలికింది. అలాగే తాలు రకం మిర్చికి గరిష్ఠ ధర క్వింటాల్కు రూ.12 వేలు పలుకగా, కనిష్ఠ ధర రూ.7 వేలు పలికింది. ఏఎంసీకి భారీగా పంట రావడంతో కాంటాలు, తోలకాల ప్రక్రియలు మందకొడిగా సాగాయి. క్రయవిక్రయాలను మార్కెట్ కమిటీ ఉన్నత శ్రేణి కార్యదర్శి ప్రవీణ్కుమార్ పర్యవేక్షించారు. కాగా మేడారం జాతరను పురస్కరించుకొని గురు, శుక్రవారాల్లో మార్కెట్కు సెలవులు ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. శనివారం వారాంతపు సెలవు అయినప్పటికీ మిర్చి క్రయవిక్రయాలు కొనసాగుతాయని వెల్లడించారు.
చింతకాని, ఫిబ్రవరి 21: గ్రీన్ ఫీల్డ్ హైవేతో గ్రామాలకు మంచి జరుగుతుందని రూ.కోట్లు విలువ చేసే భూములు అప్పగించామని, కానీ ఇప్పటివరకు ఖమ్మం జిల్లా చింతకాని మండలంలోని రామకృష్ణాపురం వద్ద ఎగ్జిట్ పాయింట్ ఇవ్వలేదని బుధవారం రామకృష్ణాపురం, ధంసలాపురానికి చెందిన సుమారు 200 మంది రైతులు హైవే పనులను అడ్డుకుని ఆందోళన చేపట్టారు. హైవే అధికారులు, జిల్లా మంత్రులు చొరవ చూపి తమకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. ఆందోళనలో రైతులు సీతారామిరెడ్డి, నరసింహారెడ్డి, పిన్నెల్లి శ్రీను, అప్పిరెడ్డి, ప్రభాకర్రెడ్డి, ఉపేంద్ర, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.