రఘునాథపాలెం, ఏప్రిల్ 21: అనుకున్నదే జరిగింది. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో మిర్చి వ్యాపారుల జిమ్మిక్కు నిజమని రుజువైంది. పంట తగ్గితే ధర పెంచడం, పంట పెరిగితే ధర తగ్గించడం ఇక్కడ ఏళ్లుగా సాగుతున్న కుట్ర తంతు. దీనిపై ఆదివారం ‘పంట తగ్గింది.. ధర పెరిగింది’ పేరుతో ‘నమస్తే తెలంగాణ’ వార్తను ప్రచురించింది. అనుకున్నట్లుగానే వ్యాపారులు మిర్చి ధరను అమాంతం తగ్గించేశారు. సోమవారం రూ.22 వేలు పలికిన క్వింటా మిర్చి ధర మంగళవారానికి రూ.21,400 జెండాపాటగా పలికింది.
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో ఒకటి రెండురోజులు ధరను పెంచి మిర్చి రైతుల్లో ఆశలు కల్పించడం, పంట పెద్దమొత్తంగా రాగానే అమాంతం తగ్గించేయడం ఇక్కడ వ్యాపారులకు వెన్నతో పెట్టిన విద్య. ఏళ్లుగా వ్యాపారులు సాగిస్తున్న ఈ వ్యవహారంపై మార్కెట్ అధికారులు, పాలకవర్గాలు ఏనాడూ దృష్టి సారించి అరికట్టిన దాఖలాలు లేవు. దీంతో ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో వ్యాపారుల ఇష్టారాజ్యానికి తిరుగులేకుండా పోయింది. ఫలితంగా కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు మార్కెట్కు వచ్చే రైతులు ఏళ్లుగా వ్యాపారుల ధన దాహానికి బలవుతూనే ఉన్నారు. మంగళవారం ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు 25వేల మిర్చి బస్తాలను రైతులు తీసుకొచ్చారు. వ్యాపారులు నెంబర్వన్ మిర్చిని సైతం జెండాపాటకు రూ.2 వేల నుంచి రూ.3 వేల తేడాతో కొనుగోలు చేయడం కనిపించింది.