నేలకొండపల్లి, ఏప్రిల్ 21: ఇటీవల కాలంలో జరుగుతున్న చోరీలను చూస్తుంటే యువత ఎంత చెడుమార్గంలో పయనిస్తున్నదో అర్థమవుతోంది. ఇందులో జల్సాల కోసం చోరీలకు పాల్పడిన సంఘటనలు అనేకం. చెయిన్ స్నాచింగ్, మాదకద్రవ్యాలు, ఇతర మార్గాల ద్వారా యువత డబ్బులు సంపాదించాలనే ఆశతో పెడతోవలో పయనిస్తున్నారు. కష్టపడి పనిచేసేతత్వం లేకపోవడం, తల్లిదండ్రులను డబ్బులు అడగలేకపోవడం వంటి కారణాలతో తమ జల్సాల కోసం స్నేహితుల ద్వారా వక్రమార్గంలో వెళుతున్నారు. కొన్ని సందర్భాల్లో డబ్బు కోసం అయిన వారిని సైతం హతమార్చేందుకూ వెనుకాడడం లేదంటే అతిశయోక్తి కాదు. డబ్బులు సంపాదించడానికి ఎంతలా కష్టపడాలో, వాటిని ఏ విధంగా పొదుపు చేసుకోవాలో అనే అంశాలపై తల్లిదండ్రులు తమ పిల్లలకు చిన్నప్పటి నుంచే అవగాహన కల్పించాలి. వారి చిట్టి చేతులకు పొదుపు మంత్రాన్ని నేర్పించాలి. ప్రస్తుత జీవన విధానంలో తల్లిదండ్రులు బిజీగా అవుతున్నారు. తమ పిల్లలకు జీవన సూత్రాలను నేర్పించేంత సమయం వారికి ఉండడం లేదు. మునుపటిలా ఉమ్మడి కుటుంబాలు, పెద్దల నీతి కథలు లేవు. దీంతో పిల్లలు తప్పుదోవ పడుతున్నారు. కానీ చిన్నప్పటి నుంచి మంచి అలవాట్లను నేర్పిస్తే పిల్లలు పెద్దయ్యాక తమ జీవితంలో ఉన్నత స్థితికి చేరుతారనే జీవిత సత్యాన్ని తల్లిదండ్రులు మరువకూడదు.
తల్లిదండ్రులు తమ పిల్లలకు చిన్నతనంలోనే ఇంట్లో కిడ్డీ బ్యాంకులను ఏర్పాటు చేసి వారి చేతులతోనే అందులో డబ్బులు దాచుకునే విధంగా ప్రోత్సహించాలి. వారికి ప్రతిరోజూ అది ఒక అలవాటుగా మారుతుంది. వారు దాచుకున్న డబ్బును మరొకరు ముట్టుకోకుండా చూసుకుంటారు. పిల్లలకు అవసరమైన వస్తువులను కొనేటప్పుడు వారు దాచుకున్న డబ్బుతో కొనిస్తే ఆ వస్తువును వారు ఎంతో జాగ్రత్తగా, అపురూపంగా చూసుకుంటారు. కొనుకున్న వస్తువు కోసం పొదుపు చేసుకున్న విధానాన్ని పిల్లలకు వివరించాలి. పొదుపు వల్ల కలిగే లాభాలను వారికి తెలియజేయాలి. సెలవు రోజుల్లో వారు ఇంటి వద్ద తరచూ తల్లిదండ్రులను చిరుతిళ్ల కోసం మారాం చేస్తుంటారు. అలాంటప్పుడు డబ్బు విలువను తెలియజేస్తూ పొదుపు చేసుకునే విధంగా వారి లేత మనసుకు అర్థమయ్యేలా తెలపాలి. పిల్లలు వారు దాచుకున్న డబ్బుతో అవసమైన పెన్నులు, పెన్సిళ్లు, పుస్తకాలు కొనుక్కోవచ్చని వారికి నచ్చజెప్పాలి. అనవసర ఖర్చు వల్ల కలిగే నష్టాల గురించి వివరించాలి. ఇంటి అవసరాల కోసం ఏ విధంగా పొదుపు చేసుకుంటున్నామో తమ పిల్లలకు తెలిసేలా తల్లిదండ్రులు మాట్లాడుకుంటే వారిలో కూడా పరివర్తన వచ్చి పొదుపుపై వారికి అవగాహన కలుగుతుంది.
ఎంత దూరం పరుగెత్తాలన్నా అది ఒక్క అడుగుతోనే ప్రారంభమవుతుంది. అదేవిధంగా లక్ష రూపాయలు కావాలన్నా అది ఒక్క రూపాయితోనే ప్రారంభమవుతుంది. చిన్నారులకు తమ చిరుప్రాయం నుంచే కొద్దికొద్దిగా పొదుపు చేయడం నేర్పించాలి. అలా రోజుకు కొంత మొత్తాన్ని వారు పొదుపు చేసుకునే విధంగా తల్లిదండ్రులు అలవాటు చేయాలి. రోజుకు రూ.34 చొప్పున నెలకు రూ.1000 పొదుపు చేస్తే అది ఏడాదికి రూ.12 వేలు అవుతుంది. అలా వాటితో తమ పిల్లలకు అవసరమైన పుస్తకాలు, ఇతర వస్తువులు కొనుక్కోవచ్చు. వారు దాచుకున్న డబ్బులతో కొనుక్కున్నప్పుడు వారికి కూడా ఎంతో ఆనందం కలుగుతుంది. ప్రస్తుతం బ్యాంకులు కూడా చిన్నారులకు, విద్యార్థులకు ఖాతాలను తెరుస్తుండడంతో వాటిలో వారిని పొదుపు చేసుకునేలా నేర్పించాలి. భవిష్యత్తులో ఉన్నత చదువులు చదువుకోవడానికి, ఆర్థికంగా వారు ప్రణాళిక వేసుకోవడానికి వారికి అవగాహన కల్పించాలి. తమ పిల్లల ఉన్నత చదువుల ఖర్చులు పెరుగుతుండడంతో తల్లిదండ్రులు తమ పిల్లల కోసం ప్రణాళికను తయారు చేసుకొని అనవసర ఖర్చులను తగ్గించుకోవాలి. పిల్లలు పెరుగుతున్న కొద్దీ వారికి డబ్బు విలువను తెలియజేస్తూ పొదుపు చేసే విధానాలను వివరిస్తే వారిని సన్మార్గంలో పెట్టిన వారవుతారు. ఈ విధంగా చేయడం వల్ల వారు మంచి అలవాట్లను అలవర్చుకో వడంతోపాటు సమాజంలో ఉన్నత స్థితిలో ఉండవచ్చనే నమ్మకం ఏర్పడుతుంది. భవిష్యత్తులో మంచి ప్రణాళికను వేసుకోవడంలో వారు ముందుండి మరొకరికి ఆదర్శంగా నిలుస్తారు. నేరాల వైపు మళ్లే ప్రమాదం తప్పుతుంది.