మామిళ్లగూడెం, మే 29 : పండుగ వాతావరణంలో రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ఉన్నతస్థాయి అధికారులతో కలిసి తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జూన్ 2 నుంచి 22వ తేదీ వరకు రాష్ట్ర దశాబ్ది వేడుకలు మన ప్రగతి చాటే విధంగా నిర్వహించాలని సూచించారు. రైతు దినోత్సవం, ఊరూరా చెరువుల పండుగ నిర్వహణ పట్ల అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ ప్రణాళిక తయారు చేసుకోవాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ మాట్లాడుతూ జిల్లాలోని 129 రైతువేదికల్లో రైతు దినోత్సవం నిర్వహిస్తామని, లైటింగ్ చేపట్టి, షామియానాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్. వారియర్, అదనపు కలెక్టర్లు స్నేహలత మొగిలి, ఎన్.మధుసూదన్, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.
తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను అధికారులందరూ సమన్వయం చేసుకొని విజయవంతం చేయాలని కలెక్టర్ వీపీ గౌతమ్ సూచించారు. ఐడీవోసీ సమావేశ మందిరంలో సీపీ విష్ణు ఎస్. వారియర్తో కలిసి అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలో 29వ రాష్ట్రంగా ఏర్పాటైన తెలంగాణ తన పదో అవతరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నట్లు తెలిపారు. కొత్త రాష్ట్రంగా ఏర్పడినప్పటికీ అభివృద్ధి, సంక్షేమంలో ఆదర్శంగా నిలిచిందన్నారు. మిషన్ భగీరథ, దళితబంధు, రైతుబంధు, టీఎస్ ఐపాస్, ఆసరా పెన్షన్లు తదితర పథకాల అమలుతో ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకంగా ఉన్నామన్నారు.
జూన్ 2న అమరవీరులకు నివాళులర్పించిన అనంతరం తొమ్మిది గంటలకు ఐడీవోసీలో పతాకావిషరణ, ముఖ్యఅతిథులుగా పాల్గొనే మంత్రి ద్వారా జండావిషరణ, సందేశం తదితర కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. 3న రైతు దినోత్సవం సందర్భంగా రైతు వేదికల వద్ద వెయ్యి మంది రైతులతో రైతు సంక్షేమం గురించి వారికి వివరించాలన్నారు. ముందస్తు వరినాట్లు, పంట మార్పిడిలపై అవగాహన కల్పించాలన్నారు. రైతువేదికలను తోరణాలు అందమైన లైట్లు ముస్తాబు చేయాలన్నారు. 4న శాంతి భద్రతలపై స్నేహపూర్వకంగా ప్రజలతో కలిసి మెలిసి ఉండే పోలీసువారి ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించాలన్నారు.
5న విద్యుత్ విజయాలపై, 6న పారిశ్రామిక విప్లవం ఐటీ కారిడార్ కార్యక్రమాలపై, 7న అధికారులు ఇరిగేషన్ కార్యక్రమాల ద్వారా ప్రజలకు సాగునీటి వసతులపై, 8న ఇరిగేషన్శాఖ ఆధ్వర్యంలో ఊరూరా చెరువుల పండుగలో భాగంగా జిల్లాలోని చెరువుల పరిధిలో ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించాలని, బోనాలు బతుకమ్మతో వెయ్యి మంది రైతులు, ప్రజలు పాల్గొనేలా చేసి వారికి భోజనాలు పెట్టాలన్నారు. 9న సంక్షేమ సంబరాలలో వివిధ శాఖల ఆధ్వర్యంలో ఎంతమంది లబ్ధి పొందారు, జిల్లాలోని పూర్తి వివరాల సేకరించి వారిచే మాట్లాడించాలన్నారు. బీసీ వెల్ఫేర్ శాఖ ఆధ్వర్యంలో కుల వృత్తుల వారి వివరాలు సేకరించాలన్నారు.
10న సుపరిపాలన దినం పాటించాలని, డీపీవో ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీలు కొత్తగా ఏవేవి ఏర్పాట్లు అయ్యాయో వాటిపై కరపత్రాలు పంపిణీ చేసి జరిగిన అభివృద్ధి వివరించాలన్నారు. 11న కవి సమ్మేళనం, 12న తెలంగాణ రన్, 13న మహిళా సంక్షేమం, 14న బస్తే దవాఖాన ఏర్పాటు వల్ల లాభాల గురించి వివరించాలని ఉత్తమ అంగన్వాడీ, ఏఎన్ఎంలకు, డాక్టర్లకు, నర్సులకు సన్మానం చేయాలన్నారు. 15న పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామాలలో చేపట్టిన కార్యక్రమాలను గ్రామ పంచాయతీల దగ్గర డీపీవో ఆధ్వర్యంలో నిర్వహించి ప్రజలకు వివరించాలన్నారు. 16న పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా మున్సిపాలిటీలలో నిర్వహించిన అభివృద్ధి పనులపై వివరించాలని ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలన్నారు.
పారిశుధ్యం- పచ్చదనం కార్యక్రమాలపై మాట్లాడాలన్నారు. 17న గిరిజన ఉత్సవం, 18న తాగునీటి సరఫరా, 19 తెలంగాణ హరిత ఉత్సవం, గ్రీన్ సిటీ, 20న విద్యాదినం, 21న తెలంగాణ ఆధ్యాత్మిక దినం, 22న అమరవీరుల సమస్మరణ కార్యక్రమం చేపట్టాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు స్నేహలత మొగిలి, ఎన్.మధుసూదన్, ఖమ్మం మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి, శిక్షణా సహాయ కలెక్టర్లు రాధికగుప్తా, మయాంక్ సింగ్, జిల్లా అటవీ అధికారి సిద్దార్థ్ విక్రమ్ సింగ్, అదనపు డీసీపీ బోస్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
భద్రాద్రి కొత్తగూడెం, మే 29 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ నుంచి జరిగిన సీఎస్ శాంతికుమారి వీడియో కాన్ఫరెన్స్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూన్ 2న ఉదయం ప్రగతి మైదానంలో అమరవీరుల స్థూపానికి నివాళులర్పించి కలెక్టరేట్ ప్రాంగణంలో వేడుకలను ఘనంగా నిర్వహిస్తామని అన్నారు. జిల్లాలో అన్నిశాఖల ద్వారా సాధించిన ప్రగతి వివరించేలా పకడ్బందీగా దశాబ్ది వేడుకలను నిర్వహిస్తామని తెలిపారు. సమావేశంలో అన్నిశాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.