భద్రాద్రి కొత్తగూడెం, మార్చి 26 (నమస్తే తెలంగాణ) : యాసంగి కోతలు పూర్తి కావొస్తున్నందున ప్రణాళికాబద్ధంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయం నుంచి రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులతో కలిసి ధాన్యం కొనుగోళ్లు, వేసవిలో తాగునీటి సరఫరా ప్రణాళికలపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వీసీ అనంతరం కలెక్టర్ ప్రియాంక ఆల సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడారు. రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలన్నారు. జిల్లాలో 1,11,369 మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని, వాటి అంచనాలతో 127 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. మన జిల్లాకు సమీప పొరుగు రాష్ర్టాల నుంచి ధాన్యం విక్రయానికి వచ్చే అవకాశం ఉన్నందున నియంత్రణకు సరిహద్దుల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సీఎంఆర్ రైస్ మిల్లులను ఆకస్మికంగా తనిఖీ చేసి ధాన్యం కొనుగోళ్లలో ఎలాంటి తేడాలున్నా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం జిల్లాలో తాగునీటి సమస్యపై అధికారులతో సమీక్షించారు. తాగునీటికి ఎక్కడా ఇబ్బంది కలగకుండా తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గతంలో మంజూరైన పనుల పురోగతిపై మున్సిపల్ కమిషనర్లు, మిషన్ భగీరథ డీఈలు, పబ్లిక్ హెల్త్ ఈఈలు, ఎంపీడీవోలతో టెలీకాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహిస్తామని అధికారులకు తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ వేణుగోపాల్, విద్యాచందన, మిషన్ భగీరథ ఎస్ఈ సదాశివం, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి రుక్మిణి, సివిల్ సైప్లె డీఎం త్రినాథ్బాబు, జిల్లా సహకార శాఖాధికారి ఖుర్షీద్, జిల్లా వ్యవసాయాధికారి బాబురావు, జిల్లా మార్కెటింగ్ అధికారి ఆలీం, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
మామిళ్లగూడెం, మార్చి 26 : యాసంగి వరి కోతల షెడ్యూల్ ప్రకారం జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులను ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్లోని డాక్టర్ బీఆర్ అంబేదర్ సచివాలయం నుంచి రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులతో కలిసి ధాన్యం కొనుగోళ్లు, వేసవిలో తాగునీటి సరఫరా ప్రణాళికపై జిల్లా కలెక్టర్లతో ఆమె వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ వీపీ గౌతమ్, అదనపు కలెక్టర్లు బి.సత్యప్రసాద్, డి.మధుసూదన్నాయక్, ఖమ్మం నగర పాలక సంస్థ కమిషనర్ ఆదర్శ్ సురభి, శిక్షణా కలెక్టర్లు మయాంక్ సింగ్, యువరాజ్లతో కలిసి వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. వీసీ అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన మేర ప్యాడీ క్లీనర్లు, వేయింగ్, తేమ యంత్రాలు, ఇతర సామగ్రి సన్నద్ధం చేస్తున్నామన్నారు. వేసవి దృష్ట్యా అవసరమైన సదుపాయాలు కల్పిస్తామని, ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ప్రవర్తనా నియమావళి కట్టుదిట్టంగా అమలయ్యే విధంగా జాగ్రత్తలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. ఖరీఫ్ 2023-24 సీజన్కు సంబంధించి సీఎంఆర్ రా రైస్ డెలివరీ సకాలంలో పూర్తి చేసే విధంగా రైస్ మిల్లులను పర్యవేక్షిస్తామన్నారు. తాగునీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. పాలేరు రిజర్వాయర్ నుంచి ఖమ్మం నగరానికి నీటిని సరఫరా ఉన్నట్లు తెలిపారు. మిషన్ భగీరథ నీటి సరఫరా లేని ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు వివరించారు. వీసీలో జిల్లా వ్యవసాయాధికారి విజయనిర్మల, జిల్లా సహకార అధికారి మురళీధర్రావు, జడ్పీ సీఈవో వినోద్, డీఆర్డీవో సన్యాసయ్య, డీపీవో హరికిషన్, జిల్లా పౌరసరఫరాల అధికారి చందన్కుమార్, డీఎం సివిల్ సైప్లె శ్రీలత, ఎఫ్సీఐ ఆర్ఎం రంగప్రసాద్ నాయక్, అధికారులు పాల్గొన్నారు.