సత్తుపల్లి రూరల్, అక్టోబర్ 3: గోదావరి జలాలతో ఉమ్మ డి జిల్లాను సస్యశ్యామలం చేసేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ సీతారామ ప్రాజెక్టును నిర్మిస్తున్నారని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు కాలువ కింద భూములు కోల్పోయిన వారిలో మిగిలిన నిర్వాసితులకు కూడా త్వరలోనే పూర్తిస్థాయిలో పరిహారం అందుతుందని అన్నారు. మండలంలోని కాకర్లపల్లి, రుద్రాక్షపల్లి, బుగ్గపాడు, రేగళ్లపాడు, యాతాలకుంట, నారాయణపురం, రేజర్ల గ్రామాల్లో మంగళవారం పర్యటించిన ఆయన.. రూ.22.50 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో జరిగిన సభల్లో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ సహకారంతో నాలుగున్నరేళ్ల కాలంలో రూ.1,000 కోట్ల నిధులను తెచ్చి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామని వివరించారు. రానున్న కాలంలో మరిన్ని నిధులు తీసుకువచ్చి నియోజకవర్గాన్ని అగ్రగామిగా నిలిపేందుకు కృషిచేస్తామని అన్నారు. పనిచేసే ప్రభుత్వాన్ని మరోసారి ఆశీర్వదించాలని పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ దీవెనలతో మరోసారి మీ ముందుకు వస్తున్న తనకు కూడా అత్యధిక మెజార్టీ అందించాలని కోరారు.
అలాగే, నియోజకవర్గంలో దళితులందరికీ దళితబంధు వర్తింపజేస్తామంటూ ఇటీవల ఇక్కడి సభలో మంత్రి కేటీఆర్ ప్రకటించారని గుర్తుచేశారు. ఆ తరువాత గంట వ్యవధిలోనే ఆ జావో జారీ చేసిన సీఎం కేసీఆర్.. దళితుల పట్ల ప్రేమను చాటుకున్నారని కొనియాడారు. త్వరలోనే నియోజకవర్గంలోని ప్రతి దళిత కుటుంబానికీ దళితబంధు అందుతుందని స్పష్టం చేశారు.
టీడీపీ నుంచి బీఆర్ఎస్లోకి 20 కుటుంబాలు..
కాకర్లపల్లిలో టీడీపీ నుంచి 20 కుటుంబాల వారు ఎమ్మెల్యే సండ్ర సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారందిరకీ ఆయన గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాగా, మండల పర్యటనలో భాగంగా ఎమ్మెల్యే సండ్రకు గ్రామగ్రామాలన ప్రజలు, బీఆర్ఎస్ నాయకులు బతుకమ్మలు, మేళతాళాలు, కోలాట నృత్యాలు, బాణసంచాలతో ఘన స్వాగతం పలికారు. మహిళలు హారతులిచ్చి స్వాగతం పలికారు.
ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు కొత్తూరు ఉమామహేశ్వరరావు, దొడ్డా హైమావతి, కంచర్ల రమాదేవి, తాటి మోహనరావు, కారం జయేందర్రావు, పూచి చిలకమ్మ, దేశిరెడ్డి రంగారెడ్డి, జక్కుల ప్రభాకర్, చల్లగుళ్ల కృష్ణయ్య, మోదుగు పుల్లారావు, తుమ్మూరు శ్రీరామప్రసాద్, యాగంటి శ్రీనివాసరావు, పెద్దిరాజు, హరికృష్ణారెడ్డి, మట్టా ప్రసాద్, కంచర్ల నాగయ్య, పాలకుర్తి రాజు, దేవరపల్లి సత్యనారాయణ, భీమిరెడ్డి గోపాలరెడ్డి, చింతల సురేందర్రెడ్డి, దేశిరెడ్డి సత్యనారాయణరెడ్డి, విస్సంపల్లి వెంకటేశ్వరరావు, గుర్రాల సురేశ్, నంధ్యాల వెంకటరెడ్డి, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.