– నాటి సీఎం కేసీఆర్ సహకారంతో మున్నేరు వల నిర్మాణానికి శ్రీకారం
– మాయమాటలకు, హంగు ఆర్భాటాలకు తలొగ్గొద్దు
– విజ్ఞతతో ఆలోచించండి నిబద్ధతకు పట్టం కట్టండి
– పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి
– 4వ డివిజన్ జలగంనగర్లో పలు కుటుంబాలు బీఆర్ఎస్లో చేరిక
ఖమ్మం రూరల్, ఫిబ్రవరి 02 : దశాబ్దాలుగా మున్నేరు సమీపంలో నివసిస్తున్న ప్రజలు ఎదుర్కొంటున్న వరద సమస్య బీఆర్ఎస్ సర్కార్ తో పరిష్కారం అయ్యిందని పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి అన్నారు. సోమవారం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని జలగం నగర్ 4వ డివిజన్లో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో డివిజన్ పరిధిలోని 35 కుటుంబాలు డివిజన్ పార్టీ నాయకుడు చీరాల వీరభద్రం ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారికి కందాల గులాబీ కండువాలు కప్పి సాదర స్వాగతం పలికారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బెల్లం వేణుగోపాల్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
గడిచిన ఐదేళ్ల కాలంలో ఏదులాపురం మున్సిపాలిటీ ప్రజలను ముఖ్యంగా మున్నేరు బాధితులు పోలేపల్లి నుండి మొదలుకుని టెంపుల్ సిటీ వరకు ఏ ఒక్కరికి ఎలాంటి ఆపద వచ్చినా నిమిషాల వ్యవధిలో వారి ముందు ఉన్నట్లు చెప్పారు. ముఖ్యంగా వరదల సమయంలో నిరంతరం అధికారాలను అప్రమత్తం చేస్తూ ఏ ఒక్కరికి ఇబ్బంది కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరిగిందన్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనాలనే ఉద్దేశంతో నాటి సీఎం కేసీఆర్ ను ఒప్పించి మెప్పించి సుమారు రూ.750 కోట్ల నిధుల ప్రతిపాదనలతో మున్నేరు రిటర్నింగ్ వాల్ నిర్మాణం ఆమోదం పొందడం జరిగిందన్నారు. ఆమోదం పొందడమే కాకుండా టెండర్ ప్రక్రియ నిర్వహించి పనులకు సైతం శ్రీకారం చుట్టామన్నారు. అదేవిధంగా మున్నేరు పాత బ్రిడ్జి స్థానంలో రూ.200 కోట్లతో తీగల వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేసుకోవడం జరిగిందన్నారు. ఖమ్మం మున్నేరు బాధితుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని స్వయంగా తానే వరదలలో తిరిగి చూసిన పరిస్థితి ఉన్నందున ఈ రెండు కార్యక్రమాలకు తన హయాంలోనే శ్రీకారం చుట్టినట్లు వెల్లడించారు.
ముఖ్యంగా జలగం నగర్ ప్రజలకు ఏ ఒక్కరికి ఇబ్బందికి కలగకుండా కడుపులో పెట్టుకుని చూసుకున్నామన్నారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నాయకులు హంగూ ఆర్భాటాలు తప్పా ఏ ఒక్క కుటుంబానికి మేలు చేసింది లేదని తీవ్రంగా విమర్శించారు. నిరంతరం మీ మధ్యలో ఉండే మనుషులని కౌన్సిలర్ అభ్యర్థులుగా నిలబెట్టడం జరిగిందని, వారిని గెలిపించుకోవడం ద్వారానే ఈ అభివృద్ధి సంక్షేమం ఆధారపడి ఉంటుందన్నారు. ఈ నెల 11న జరిగే ఎన్నికల్లో బీఆర్ఎస్ కారు గుర్తుకు ఓటేసి ఘన విజయం తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. తద్వారా కేసీఆర్కు మనం బహుమతి ఇచ్చినట్లు అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ బెల్లం ఉమా, ఆయా డివిజన్ ఇన్చార్జిలు, పలువురు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

Kandala Upender Reddy : బీఆర్ఎస్ పాలనలోనే ‘మున్నేటి’ కష్టాలకు చెక్