కొత్తగూడెం అర్బన్, ఏప్రిల్ 13 : వలసలను నిరోధించేందుకు, స్థానికంగానే కూలీలకు ఉపాధి పనులు కల్పించేందుకు 2005లో అప్పటి కేంద్ర ప్రభుత్వం(యూపీఏ) ప్రవేశపెట్టిన ఉపాధి హామీ పథకానికి ఇప్పటి కేంద్ర ప్రభుత్వం(ఎన్డీఏ) తూట్లు పొడుస్తోంది. ఏకంగా పని దినాలను తగ్గిస్తోంది. దీంతో ఏటికేడు పరిశీలిస్తే ఈ తగ్గుదల గణనీయంగా ఉంది. సుమారు 40 రకాల పనులను ఈ పథకంలో చేయాల్సి ఉండగా.. ప్రస్తుతం 14 పనులను మాత్రమే జాబితాలో చేర్చింది. కూలీలను మరింత ఇబ్బందుల్లోకి నెట్టింది.
భద్రాద్రి జిల్లాలో ఎక్కువగా ఆదివాసీలు, గిరిజనులు నివాసం ఉన్నారు. బతుకుదెరువు కోసం గతంలో వలసలు వెళ్లిన వీరంతా ఉపాధి హామీ పథకం వచ్చాక స్థానికంగానే ఉంటూ ఆ పనులు చేస్తూ జీవిస్తున్నారు. జాబ్కార్డులో పేరున్న కుటుంబ సభ్యులందరూ ఈ పనులను సద్వినియోగం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఏటికేడూ ఉపాధి హామీ పని దినాలను తగ్గిస్తుండడంతో వారికి తగినన్ని రోజులు పనులు లభించడం లేదు.
ఫలితంగా కూలీలందరూ క్రమంగా ఊరిని వదిలి పొట్టచేతపట్టుకొని ఇతరత్రా ప్రాంతాలకు వెళ్తున్నారు. దీనికి తగినట్లుగానే కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది కూడా ఈజీఎస్ పని దినాల సంఖ్యను భారీగా తగ్గించింది. ఈ 2024-25 ఆర్థిక సంవత్సరంలో కేవలం 32.78 లక్షల పనిదినాలను మాత్రమే కల్పించాలని కేంద్ర ప్రభుత్వం అధికారులకు నిర్దేశించింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 43.16 లక్షల పని దినాల లక్ష్యాన్ని కేటాయించిన కేంద్రం.. ఈ ఏడాది గణనీయంగా సుమారు 10 లక్షల పని దినాలను తగ్గించడం గమనార్హం.
జిల్లాలో మొత్తం 1.29 లక్షల కుటుంబాలకు జాబ్కార్డులున్నాయి. వాటిలో 2.16 లక్షల మంది తమ పేర్లను నమోదు చేసుకొని ఉన్నారు. ఉపాధి హామీ పనులను 481 పంచాయతీల్లోని కూలీలు వినియోగించుకుంటున్నారు. ఈ వేసవిలో ప్రతి రోజూ సుమారు 50 వేల మంది ఉపాధి పనులకు వెళ్తుంటారు. జిల్లాలోని 481 గ్రామ పంచాయతీల్లో సగటున 100 మంది పనులకు హాజరవుతున్నారు. ఈ వేసవి సీజన్లో ఎక్కువగా వ్యవసాయ సంబంధ పనులు చేపట్టగా.. రైతులు తమ పొలానికి వెళ్లే దారులు,
మట్టి పనులు, చెరువు పూడికతీతలు, కాల్వల నిర్మాణాలు, అంతర్గత రోడ్లు, ట్యాంకు, మినీ ట్యాంకుల నిర్మాణాలు సహా వివిధ రకాల పనులు చేయిస్తున్నారు. మహిళా కూలీలు అత్యధికంగా ఉపాధి పనులను సద్వినియోగం చేసుకుంటున్నారు. అయితే, ఇంతటి ముఖ్యమైన ఉపాధి హామీ పనులపై కేంద్రం ఆసక్తి చూపడం లేదు. దీంతో కూలీలు ఉపాధి కోల్పోవాల్సి వస్తోంది. ఇక వారం రోజులకు ఒకసారి కూలీల బ్యాంకు ఖాతాల్లో జమ కావాల్సిన కూలి నగదు కూడా నాలుగు నెలలు గడిచినా జమ కావడం లేదు.
ఏటా పని దినాల సంఖ్యను కేంద్ర ప్రభుత్వం తగ్గిస్తోంది. దీనిపై ఆధారపడి ఉపాధి హామీ పనులు చేసుకునే మాలాంటి వారికి ఇబ్బందిగా మారుతోంది. గ్రామాల్లో వలసలను నిరోధించడానికి పెట్టిన ఈ పథకం కొనసాగాలంటే వీలైనన్ని ఎక్కువ పనిదినాలు కూలీలకు కల్పిస్తేనే బాగుంటుంది. అప్పుడే గ్రామాల్లో కూలీలు వేరే గ్రామాలకు పనులకు వెళ్లకుండా స్థానికంగానే పని చేసుకునే అవకాశం ఉంటుంది.
– మాలోతు నార్యా, లాలుతండా
మేం నాలుగు నెలలుగా ఉపాధిహామీ పథకం కింద పనులకు వెళ్తున్నాం. అయినా ఇప్పటివరకు వేతనాలు రాలేదు. ప్రతిరోజు ఉపాధిహామీ పనులకే వెళ్తున్నాం. వేరే పనులకు వెళ్లలేకపోతున్నాం. ఈ వారం.. వచ్చే వారం పడతాయేమో అనే ఉద్దేశంతో రోజూ పనులకు వెళ్తున్నాం. వేతనాలు సకాలంలో రాకపోవడంతో పూట గడవడం కష్టంగా ఉంది. అధికారులు సకాలంలో వేతనాలు వచ్చేలా చూడాలి.
– వాంకుడోతు పద్మ, సీతారాంపురం