బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ప్రస్తావన లేదు.. భద్రాచలం – రైల్వే లైన్ ఊసే లేదు.. ఎరువులు, పెట్రోల్, డీజిల్, గ్యాస్ సిలిండర్ల ధరల తగ్గింపుపై పట్టింపే లేదు.. రైతులను పట్టించుకున్న పాపాన పోలేదు.. ఉమ్మడి జిల్లా వరప్రదాయిని సీతారామ ప్రాజెక్ట్ నిర్మాణానికి పైసా విదిల్చలేదు. మొత్తానికి కేంద్ర బడ్జెట్ అట్టర్ ఫ్లాప్ పద్దు. సాధారణ, మధ్యతరగతి ప్రజలకు మేలు చేసే విధంగా బడ్జెట్లో కేటాయింపులు జరగలేదు. బడ్జెట్పై బీఆర్ఎస్తో పాటు రాజకీయ పార్టీలు, రైతు సంఘాలు పెదవి విరుస్తున్నాయి. కార్పొరేట్ శక్తులకు మేలు చేసేలా బడ్జెట్ ఉందని ముక్తకంఠంతో పేర్కొంటున్నాయి.
– ఖమ్మం, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
ఖమ్మం, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): పంటలకు వినియోగించే ఎరువులు ధరలు, దేశంలో మెజార్టీ జనం వినియోగించే పెట్రోల్, డీజిల్, గ్యాస్ సిలిండర్ ప్రస్తావన లేదు.. సామాన్యులకు మేలు చేసే ఒక్క వరమైనా కేంద్ర బడ్జెట్లో లేదు. కేంద్ర ప్రభుత్వం బుధవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ రైతులు, కూలీలు, నిరుపేదల వ్యతిరేక బడ్జెట్. తెలంగాణకు వ్యతిరేక బడ్జెట్. రాష్ట్రంపై వివక్షను కొనసాగింపుగా వచ్చిన బడ్జెట్. దీనిలో భాగంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాకూ మొండిచేయే చూపింది. ఉమ్మడి జిల్లా వరప్రదాయిని అయిన సీతారామప్రాజెక్ట్ నిర్మాణానికి కేంద్రం పైసా అయినా విదిల్చలేదు. సాధారణ, మధ్యతరగతి ప్రజలకు మేలు చేసే విధంగా బడ్జెట్లో కేటాయింపులు జరగలేదు. ఇల్లెందు నియోజకవర్గంలో బయ్యారం ఉక్కు కర్మాగారంపై ఏదైనా స్పష్టత వస్తుందని ఆశించిన ప్రజలకు ఈసారి కూడా నిరాశే మిగిలింది. బడ్జెట్లో బయ్యారం పరిశ్రమ ఊసే లేదు. భద్రాచలం పుణ్యక్షేత్రానికి రైలు మార్గం ఉండాలనేది భద్రాద్రి జిల్లా వాసుల చిరకాల కోరిక. ఈ బడ్జెట్లోనూ భద్రాచలం- కొవ్వూరు రైల్వేలైన్కూ శూన్యహస్తాలే మిగిలాయి.
అశ్వాపురం భారజల కర్మాగారానికి నిధులు..
సింగరేణిపైనా కేంద్రం శీతకన్నే వేసింది. సంస్థకు అరకొరగా నిధులు కేటాయించి చేతులు దులుపుకొన్నది. వేతన జీవులకు రూ.7 లక్షల వరకు ట్యాక్స్ మినహాయించడం ఉపశమనం. మరోవైపు పన్ను మినహాయింపును రూ.15 లక్షలకు పెంచితే బాగుండేదని ఉద్యోగ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో రైతులు విస్తారంగా పత్తి సాగు చేస్తారు. కేంద్రం తన పరిధిలోని కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా పంటకు కనీస మద్దతు ధర ఇస్తే బాగుంటుందనే అభిప్రాయం రైతు సంఘాల నుంచి వ్యక్తమవుతున్నది. ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపాలంటే వారిని ప్రోత్సహించే విధంగా బడ్జెట్ కేటాయింపులు జరిగితే బాగుంటుందని రైతులు వెల్లడిస్తున్నారు. రెడీమెడ్ వస్ర్తాలపై సుంకం పెంచడంతో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో పెంచడంతో ధరలు పెరగనున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ఆశ్వాపురం భారజల కర్మాగారంతో పాటు మరో భారజల కర్మాగారానికి రూ.1,473 కోట్లు మంజూరు చేసింది.
సాగునీటి ప్రాజెక్టులకు కేటాయింపులేవి?
కేంద్రం వ్యవసాయ రంగాన్ని పట్టించుకోలేదు. బడ్జెట్లో కేటాయింపులు లేవు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో తప్పితే ఇతర రాష్ర్టాల్లో ఏ సాగునీటి ప్రాజెక్టుకూ కేటాయింపులు లేవు. కేంద్రం వ్యవసాయ రంగానికి ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేస్తుందని ఆశించాం. కానీ అలాంటిదేమీ జరగలేదు. రైతులు పండించిన పంటలకు మద్దతు ధర ప్రస్తావనే లేదు. రైతుల సంక్షేమాన్ని బీజేపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.
– చామకూరి నాగభూషణం, రైతు, పిండిప్రోలు
సవాళ్లకు సమాధానం లేని బడ్జెట్
బడ్జెట్ కేటాయింపులు మాటల్లో ఘనం. కేటాయింపుల్లో తిరోగమనం. దేశం ఎదుర్కొంటున్న సవాళ్లకు సమాధానం తెలపని బడ్జెట్ ఇది. కార్పొరేట్ శక్తులకు రూ.12 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేసిన బీజేపీ ప్రభుత్వం రైతు రుణమాఫీకి మాత్రం రూ.2 లక్షల కోట్లు కేటాయించేందుకు సిద్ధంగా లేదు. బయ్యారం ఉక్కు పరిశ్రమ, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, భద్రాచలం- కొవ్వూరు రైల్వేలైన్, రాష్ట్ర విభజన హామీల ఊసేలేదు. వేతన జీవులకు రూ.7 లక్షల ట్యాక్స్ మినహాయింపు చిన్న ఊరట. మధ్య, చిన్న, సూక్ష్మతరహా పరిశ్రమలకు రూ.2శాతం పన్ను మినహాయింపు ఇవ్వడం కంటి తుడుపు చర్యే. కార్పొరేట్ శక్తులకు పన్నులు తగ్గించడం దారుణం.
– నున్నా నాగేశ్వరరావు, సీపీఎం జిల్లా కార్యదర్శి, ఖమ్మం
బడ్జెట్లో రైతుల మాటే లేదు..
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో రైతుల ప్రస్తావన లేదు. ఎరువులు, పురుగు మందులు ధరలు ఆకాశన్నంటుతున్నాయి. వాటిని తగ్గించే ఉద్దేశమే కేంద్ర ప్రభుత్వానికి లేదు. ధాన్యం కొనలేమని చెప్పినప్పుడే బీజేపీ ప్రభుత్వ తీరు అందరికీ అర్ధమైంది. రైతులపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతున్నది. రైతులు ఏం పాపం చేశారని వివక్ష..?
– ధరావత్ బన్సీలాల్, యువ రైతు, శాంతినగర్, టేకులపల్లి మండలం
రైతులు, కూలీలు, సామాన్య ప్రజల ఊసే లేని బడ్జెట్
కేంద్ర బడ్జెట్తో రైతులు, వ్యవసాయ కూలీలు, సామాన్యులకు ఒరిగిందేమీ లేదు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ సిలిండర్, నిత్యావసర సరుకుల ధరల గురించి ప్రస్తావించకపోవడం విచారకరం రోజుకు రూ.కోట్లు సంపాదించే కార్పొరేట్ శక్తులకు ఉపయోగపడేలా బడ్జెట్ ఉంది. రోజుకు రూ.300 సంపాదించే కూలీకి కొంచమైన ప్రాధాన్యత లేదు. కరోనా కారణంగా సామాన్య ప్రజలు ఎంతో నష్టపోయారు. బడా పెట్టుబడిదారులకు ఇన్కం ట్యాక్స్ను 37 శాతం నుంచి 22 శాతం తగ్గించారు సరే మరి పేదలకు ఏం చేశారు?
– దండు ఆదినారాయణ, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు, సత్తుపల్లి
నిరాశ జనకమైన పద్దు..
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ నిరుద్యోగులు, రైతులు, మధ్యతరగతి వర్గాలను నిరాశ పరిచింది. కార్పొరేట్ శక్తులను సంతృప్తి పరిచే బడ్జెట్ ఇదీ. మేడిపండు బడ్జెట్. దేశంలో అత్యంత కీలకమైన వ్యవసాయ రంగానికి తగిన కేటాయింపులు బడ్జెట్లో లేవు. రైతు ఆత్మహత్యలకు కారణమైన అంశాలకు సమాధానమే లేదు. నల్ల వ్యవసాయ చట్టాల రద్దు గురించి ప్రస్తావన లేదు. నిరుద్యోగ సమస్యకు పరిష్కారం లేదు. ద్రవ్యోల్బణం, బడ్జెట్ లోటు తగ్గింపునకు ఎలాంటి పరిష్కారం చూపించలేదు. వేతన జీవులకు టాక్స్ మినహాయింపు రూ.7 లక్షలకు పెంచడం కంటి తుడుపు చర్య. రూ.15 లక్షలకు పెంచితే బాగుండేది.
– పోటు రంగారావు, సీపీఐ(ఎంఎల్) ప్రజాపంథా కార్యదర్శి, ఖమ్మం
రాష్ర్టాలను బలహీనం చేస్తున్న కేంద్రం..
కేంద్రం ఏకపక్షంగా వ్యవహరిస్తూ రాష్ర్టాలను బలహీనం చేస్తున్నది. కేంద్ర బడ్జెట్ ఏ రంగానికీ సరైన మేలు చేయలేదు. కాళేశ్వరం ప్రాజెక్ట్కు జాతీయ హోదానిచ్చి నిధులు కేటాయించాలనే తెలంగాణ ప్రజల డిమాండ్ను పట్టించుకోలేదు. కేంద్రం దేశవ్యాప్తంగా 150 వైద్య కళాశాలలను మంజూరు చేసింది. వాటిలో ఒక్కటైనా తెలంగాణకు కేటాయించలేదు. ఇప్పుడు నర్సింగ్ కాలేజీలు ఇస్తామంటున్నది. వీటి కేటాయింపులోనూ తెలంగాణకు అన్యాయమే జరిగింది. రాష్ర్టానికి ఐఐఎం మంజూరు చేయకపోవడం, గిరిజన విశ్వవిద్యాలయానికి ఆశించిన రీతిలో నిధులివ్వకపోవడం దారుణం. జిల్లాకో నవోదయ పాఠశాల, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, రైల్వేకోచ్ ఫ్యాక్టరీల ఊసే ప్రస్తావించకపోవడం విచారకరం.
– వద్దిరాజు రవిచంద్ర, రాజ్యసభ సభ్యుడు
రైతులు, పేదల వ్యతిరేక బడ్జెట్..
కేంద్ర బడ్జెట్ రైతులు, పేదల వ్యతిరేక బడ్జెట్. కేంద్రం తెలంగాణను పూర్తిగా విస్మరించింది. బడ్జెట్లో ఎక్కడా రైతుల గురించి ప్రస్తావన లేదు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రస్తావన లేదు. నీతి ఆయోగ్ సిఫారసు చేసిన మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వంటి పథకాలకూ నిధులు లేవు. పైసా కేటాయించకుండా ఉండడమంటే అది కచ్చితంగా వివక్షే. రైల్వే ప్రాజెక్టుల్లోనూ తీవ్ర అన్యాయం జరిగింది. రాష్ర్టానికి రావాల్సిన వేలాది కోట్ల బకాయిలు, నిధుల గురించిన ప్రస్తావన బడ్జెట్లో లేదు.
– నామా నాగేశ్వరరావు, పార్లమెంట్ సభ్యుడు, బీఆర్ఎస్ లోక్సభా పక్ష నేత
బడ్జెట్ కేటాయింపులో తీరని అన్యాయం..
కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు తీరని అన్యాయం జరిగింది. కార్పొరేట్ వర్గాలకు ప్రభుత్వ ఆస్తులను దోచిపెట్టే విధానాలకు బడ్జెట్ ఎర్ర తివాచీ పరిచింది. కార్పొరేట్ వర్గాలకు ట్యాక్స్లు పెంచకుండా మధ్య, చిన్న తరగతి వర్గాలు వినియోగించే వస్తువుల ధరలను పెంచడం అన్యాయం. రాష్ర్టాలకు నిధులు కేటాయించకుండా కేంద్రం గుత్తాధిపత్యం చలాయించడం దారుణం. బయ్యారం ఉక్కు కర్మాగారం గురించి బడ్జెట్లో ఎలాంటి ప్రస్తావన లేదు. కర్నాటక ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని అక్కడ కేటాయింపుల్లో కోట్లు కుమ్మరించింది. రాష్ర్టానికి ఒక్క మెడికల్ కళాశాల అయినా కేటాయించలేదు. కాళేశ్వరం ప్రాజెక్ట్కు జాతీయ హోదా ప్రకటించలేదు.
– రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
కార్మికులను పట్టించుకోలేదు..
కేంద్రప్రభుత్వ బడ్జెట్లో కార్మికులకు మరోసారి మొండిచేయే చూపింది. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రవేశపెట్టిన ఏ బడ్జెట్లోనూ కార్మికులకు ప్రాధా న్యం లేదు. ఉత్పత్తి రంగంలో చమటోడ్చి పనిచేసేది ఒక్క కార్మికులు మాత్రమే. ట్యాక్స్లు కట్టే వెసులుబాటు ఉన్న వారికేమో పన్నులు తగ్గించి శ్రామికుడికి ఏం లాభం చేకూరుస్తున్నారు. కార్మికుల జీవితాలను మార్చే ఒక్క హామీ అయిన బడ్జెట్లో లేదు. కేంద్ర ప్రభుత్వానికి కార్మికుల మీద ఎలాంటి ప్రేమ లేదని మరోసారి నిరూపితమైంది. ప్రైవేటు కంపెనీలను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టడం తప్ప కేంద్రానికి ఏమీ చేతకాదు.
– నున్నా మాధవరావు, కార్మిక సంఘం నాయకుడు, ఖమ్మం
నిత్యావసరాల ధరల తగ్గింపు ఊసే లేదు..
బీజేపీ ప్రభుత్వ పాలనలో గ్యాస్ సిలిండర్, పెట్రోల్, డీజిల్ ధరలు అమాంతం పెరిగాయి. ఏటికేడు వాటి ధరలను పెంచుకుంటూ వస్తున్నది. కనీసం ఈ బడ్జెట్లోనైనా ధరలు తగ్గించే ప్రయత్నం చేస్తుందని ఆశపడిన ప్రజలకు నిరాశే మిగిలింది. దేశంలో 85శాతం ఉన్న నిరుపేదలు, సామాన్య ప్రజలను మరోసారి కేంద్రం మోసం చేసింది. పేదోళ్లను దోచి ఉన్నోళ్లకు పెట్టే విధంగా కేంద్ర బడ్జెట్ ఉంది. అసలు బీజేపీ అంటేనే కార్పొరేట్ కంపెనీలకు ఊడిగం చేసే పార్టీ.
– బెల్లం ఉమ, ఎంపీపీ, ఖమ్మం రూరల్
రైతులకు కేంద్ర బడ్జెట్లో అన్యాయం
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో రైతులకు అన్యాయం జరిగింది. బీజేపీ ప్రభుత్వం రైతులపై వివక్షత చూపుతున్నది. రైతుల ప్రయోజనాల గురించి కేంద్రం కొంచమైనా ఆలోచించలేదు. కార్పొరేట్ శక్తులకు ఉపయోగపడే విధంగా బడ్జెట్ ఉన్నది. రైతాంగం, సామాన్య ప్రజలపై భారం మోపేలా బడ్జెట్ ఉంది. బడ్జెట్ కేవలం ఉన్నత వర్గాలకు ఉపయోగపడే విధంగా ఉంది.
– వేమూరి ప్రసాద్, రైతుబంధు సమితి మండల కన్వీనర్, బోనకల్
రైతులను కేంద్రం విస్మరించింది..
కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో రైతులకు అన్యాయం జరిగింది. వ్యవసాయ రంగాన్ని కేంద్రం పూర్తిగా విస్మరించింది. వ్యవసాయాన్ని పట్టించుకోకుండా బడ్జెట్ కేటాయింపులు జరిగాయి. అలాగే తెలంగాణకూ బడ్జెట్ కేటాయింపుల్లో చోటులేదు. ఉద్దేశ పూర్వకంగానే కేంద్రం రాష్ర్టానికి అన్యాయం చేస్తున్నది. రాష్ర్టాలకు ప్రాధాన్యత లేని బడ్జెట్ ఇది.
– ముళ్లంగి శ్రీనివాసరావు, రైతు, రఘునాథపాలెం
బడ్జెట్తో ఒరిగిందేమీ లేదు
రాష్ర్టాల్లో ఎన్నికలను టార్గెట్ చేసి కేంద్రం బడ్జెట్ ప్రవేశపట్టింది. బీజేపీ పాలిత రాష్ర్టాలకే బడ్జెట్లో ప్రాధాన్యం. బడ్జెట్లో నిరుద్యోగులు, మహిళలు, చేతి వృత్తుల వారికి, రైతులకు ఎలాంటి ఓదార్పూ లేదు. కేంద్ర బడ్జెట్ కార్పొరేట్, ఉన్నత వర్గాల బడ్జెట్. ఎన్నికలు రానున్న రాష్ర్టాలకు బడ్జెట్ కేటాయించి కేంద్రం మిగిలిన రాష్ర్టాలకు అన్యాయం చేసింది.
– మొండితోక లత, మున్సిపల్ చైర్పర్సన్, మధిర
సామాన్యులకు ఒరిగిందేమీ లేదు..
కేంద్ర బడ్జెట్తో సామాన్యులకు ఒరిగిందేమీ లేదు. నిత్యావసర సరుకులు, సిలిండర్, పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు ప్రస్తావనే బడ్జెట్లో లేదు. సంపన్న వర్గాలు, బడా పారిశ్రామిక వేత్తల కోసమే బడ్జెట్ ప్రవేశ పెట్టినట్లు ఉంది. ఎన్నికల జరిగే రాష్ర్టాలకు మాత్రమే బడ్జెట్ కేటాయింపులు. తెలంగాణకు అన్యాయం జరిగింది.
– రామిశెట్టి సరళ, గృహిణి, తిప్పనపల్లి, చండ్రుగొండ మండలం
ధరల కట్టడికి చర్యలు లేవు..
కేంద్ర బడ్జెట్లో నిత్యావసర వస్తువుల తగ్గింపుపై ఎలాంటి ప్రకటన లేదు. ధరలు పెరుగుతున్న కారణంగా ప్రజల్లో కొనుగోలు శక్తి తగ్గుతున్నది. దీంతో కిరాణ వ్యాపారం దెబ్బతినే ప్రమాదం ఉన్నది. చిరు వ్యాపారుల కోసం బడ్జెట్లో ఎలాంటి కేటాయింపులు లేవు. ఈ బడ్జెట్తో సామాన్యులకు ఉపయోగం లేదు.
– వెంకటేశ్వర్లు, కిరాణ దుకాణ యజమాని, దమ్మాయిగూడెం
తెలంగాణాకు మొండిచేయి..
బడ్జెట్ కేటాయింపుల్లో కేంద్రం తెలంగాణకు అన్యాయం జరిగింది. కేంద్రం ఈ సారి కూడా మొండిచేయే చూపింది. బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంపై వివక్ష చూపుతున్నదనడానికి బడ్జెట్ మంచి ఉదాహరణ. కాళేశ్వరం వంటి మహా ప్రాజెక్టుకు ఇప్పటివరకు జాతీయ హోదా ఇవ్వలేదు. మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీలు మంజూరుపై ప్రస్తావన లేదు. రైల్వే ప్రాజెక్టుల ఊసే లేదు. బడ్జెట్ బీజేపీ పాలిత రాష్ర్టాలకు మేలు చేసేలా ఉంది. ఇది కేవలం ఎన్నికల బడ్జెట్.
– బోడ మంగీలాల్, ఎంపీపీ, తిరుమలాయపాలెం
పద్దు నిరాశ పరిచింది..
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ తెలంగాణకు మొండిచేయి చూపింది. భద్రాచలం- కొవ్వూరు రైల్వేలైన్ కొన్ని సంవత్సరాలుగా ఊరిస్తున్నది. ఈ బడ్జెట్లోనూ రైల్వేలైన్ ఊసు లేవు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న గిరిజన యూనివర్సిటీపై ఆశలూ నీరుగారిపోయాయి. రాష్ట్ర విభజన చట్టంలో ప్రస్తావించిన హామీలకు దిక్కే లేదు. కేంద్ర బడ్జెట్ తూతు మంత్రంగా ఉంది.
– ఎర్రా కామేశ్, బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కొత్తగూడెం
కార్పొరేట్ శక్తులకు అనుకూలమైన బడ్జెట్
బడ్జెట్తో తెలంగాణకు ఎలాంటి మేలూ లేదు. రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీల ప్రస్తావనే లేదు. విభజన హామీల్లో బీజేపీ ప్రభుత్వం ఒక్కటైనా నెరవేర్చలేదు. తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నలుగురు బీజేపీ ఎంపీలు తెలంగాణ కోసం ఏమీ చేయలేకపోయారు. వారంతా రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. బీజేపీది ఎన్నికల రాకీయం. బడ్జెట్ కూడా అంతే. కర్నాటకలో ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని భారీగా కేంద్రం నిధులు విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 150 మెడికల్ కళాశాలలు ఇచ్చామని చెప్తున్న కేంద్రం రాష్ర్టానికి ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వలేదు. కాళేశ్వరం ప్రాజెక్ట్కూ జాతీయ హోదా ఇవ్వలేదు.
– తాతా మధుసూదన్, ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు,