ముగ్గురు యువకులు తమ స్నేహితుడి సోదరి రిసెప్షన్కు వెళ్లారు. సంతోషంగా గడిపారు. తిరిగి కారులో స్వస్థలానికి పయనమయ్యారు. తెల్లవారుతున్న సమయంలో వేగంగా వెళ్తున్న కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది. ఘటనలో ఇద్దరు యువకులతో పాటు ఓ బాలుడు మృతిచెందాడు. మృతులందరూ ఖమ్మం నగరానికి చెందిన వారే.. నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలం ఎరసానిగూడెం స్టేజీ వద్ద ఈ ప్రమాదం సంభవించింది. చేతికొచ్చిన కుమారులు మృతిచెందడంతో వారి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు.. కన్నవారు రోదనలు చూపరులను కంటతడి పెట్టించాయి..
– మామిళ్లగూడెం, జనవరి 8
మామిళ్లగూడెం/ కట్టంగూర్, జనవరి 8: నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలం ఎరసానిగూడెంలోని 65వ జాతీయ రహదారి రక్తసిక్తమైంది. అతి వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు యువకులు, ఓ బాలుడు మృతిచెందగా మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. మృతులు, క్షతగాత్రులందరూ ఖమ్మం నగరవాసులే. నకిరేకల్ సీఐ వెంకటయ్య తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం నగరంలోని ఖిల్లా బజార్కు చెందిన తొమ్మిది మంది యువకులు ఎండీ ఇమిదాద్, ఎస్కే సమ్మిర్, ఎస్కే యాసిన్, ఎండీ అత్తార్, ఎస్కేవ ఆరీఫ్, ఎస్కే కరీం, ఎస్కే సల్మాన్, అర్షద్ అలీ శనివారం సాయంత్రం హైదరాబాద్లో జరుగుతున్న తమ స్నేహితుడు సోహెల్ సోదరి రిసెప్షన్కు కారులో బయల్దేరారు. రిసెప్షన్ అనంతరం తిరిగి సోహెల్తో సహా తొమ్మిది మంది కారులో తిరిగి ఖమ్మం బయల్దేరారు. కారు మార్గమధ్యంలో ఎరసానిగూడెం సేజీ వద్దకు రాగానే అదుపు తప్పి జాతీయ రహదారి డివైడర్ను ఢీకొట్టింది. అనంతరం రోడ్డుపై పల్టీలు కొడుతూ రోడ్డు పక్కనే చెట్టును ఢీకొట్టింది. ప్రమాదంలో ఎండీ ఇమిదాద్ (21) ఎస్కే సమీర్ (21), ఎస్కే యాసిన్(18) తీవ్రగాయాల పాలై అక్కడికక్కడే మృతిచెందారు. డ్రైవర్ అర్షద్అలీ, ఎస్కే కరీం, ఎస్కేవ సల్మాన్కు తీవ్ర గాయాలు, ఎండీ సోహెల్, ఎండీ అత్తార్, ఎస్ఏ ఆరీఫ్కు స్వల్పగాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను నార్కట్పల్లిలోని కామినేని దవాఖానకు తరలించారు. ఎండీ సోహెల్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రోడ్డుప్రమాదంలో మృతిచెందిన ఎండీ ఇమిదాద్, ఎస్కే సమీర్, ఎస్కే యాసిన్ మిత్రులు. వీరంతా నిరుపేద కుటుంబాలకు చెందిన వారు. రోజుగారీగా టైల్స్ వేసే పని చేస్తూ కుటుంబాలను పోషిస్తున్నారు. ఇమిదాద్ పదోతరగతి వరకు చదివాడు. తండ్రి చనిపోవడంతో కుటుంబ బాధ్యతలు తీసుకున్నాడు. ఇటీవల సోదరి వివాహం చేశాడు. సమీర్ తండ్రి కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఇటీవల అన్న వివాహం చేసుకుని వేరు కాపురం పెట్టడంతో కుటుంబాన్ని పోషించాల్సిన బాధ్యత సమీర్పై పడింది. యాసిన్ది అత్యంత పేద కుటుంబం. నిత్యం తమ మధ్య సరదాగా తిరుగుతూ ఉండే కుమారులు విగతజీవులుగా కనిపించడంతో వారి తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.