భద్రాద్రి కొత్తగూడెం, జనవరి 9 (నమస్తే తెలంగాణ) : ధాన్యం దళారుల పాలవుతున్నది. ప్రభుత్వం మద్దతు ధరకంటే బయట సన్నబియ్యానికి రేటు పలకడంతో రైతులు ప్రైవేటు వ్యాపారులకే విక్రయాలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. దీంతో సర్కారు కొనుగోలు కేంద్రాలు 69 కే పరిమితం అయ్యాయి. భద్రాద్రి జిల్లాలో ఇప్పటి వరకు 157 కేంద్రాల్లో కొనుగోలు జరగాల్సి ఉండగా.. కేవలం 69 కేంద్రాల్లో మాత్రమే విక్రయాలు జరుగుతున్నాయి. ప్రతీ ఏడాది వానకాలం లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉండగా.. ఈ ఏడాది ఇప్పటి వరకు కేవలం 12,766 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రమే ప్రభుత్వం సేకరించగలిగింది. ఇంకా కొన్నిచోట్ల కోతలు ఆలస్యం అవడంతో మరో 25 వేల మెట్రిక్ టన్నులు వచ్చే అవకాశాలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.
ధాన్యం సేకరణ చివరి దశకు వచ్చినా సేకరణ మాత్రం ఇంకా 20 శాతంలో ఉండడం విశేషం. ఏడాది లక్ష్యం లక్ష మెట్రిక్ టన్నులు కాగా.. ఇప్పటి వరకు కేవలం 12,766 మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేశారు. కొనుగోలు కేంద్రాలు తెరుచుకున్నా రైతులు మాత్రం అటువైపు చూడడం లేదు. సన్న బియ్యానికి బయట మార్కెట్లో ధర ఉండడంతో రైతులు బయట వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. ప్రభుత్వం ఏ గ్రేడ్ రకం రూ.2,203 ప్రకటించడంతో బయట రూ.2,300 నుంచి రూ.3 వేల వరకు పలుకుతున్నది. దీంతో రైతులు దళారుల వైపే మొగ్గు చూపుతున్నారు.
ఒక వైపు వర్షాలు, మరోవైపు అకాల తుఫాను రావడంతో రైతులు పండించిన పంటలపై తీవ్ర ప్రభావం చూపింది. దీంతో సన్న బియ్యానికి అమాంతం రేటు పలికింది. బయట మార్కెట్లో బియ్యం ధరలకు రెక్కలు రావడంతో వ్యాపారులు రైతుల ఇంటికే వచ్చి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా వందల మంది వ్యాపారులు ధాన్యాన్ని విక్రయాలు చేస్తున్నారు.
మద్దతు ధర ఏ గ్రేడ్ రకం రూ.2,203 ఉంది. బయట వ్యాపారులు రూ.2,300 నుంచి రూ.3 వేల వరకు కొనుగోళ్లు చేస్తున్నారు. అందువల్ల కొనుగోలు కేంద్రాల వద్దకు రైతులు రావడం లేదు. కొన్ని ఏరియాల్లో ధాన్యం ఉన్నా చివరి సమయంలో కేంద్రాలకు వస్తున్నది. లక్ష్యానికి చేరువలో కొనుగోలు చేస్తాం. లాభం ఉన్న దగ్గరే రైతులు విక్రయాలు చేస్తారు.