వైరా టౌన్, ఫిబ్రవరి 4 : నిజాం నవాబు నూర్ఉస్మాన్అలిఖాన్ 90 సంవత్సరాల క్రితం నిర్మించిన వైరా రిజర్వాయర్ అత్యంత సుందరంగా మారుతున్నది. వైరా ప్రాంత రైతుల కలలను సీఎం కేసీఆర్ నిజం చేశారు. రిజర్వాయర్ కింద ఒకప్పుడు ఒక్క పంట మాత్రమే వేసుకునేందుకు అవకాశం ఉండేది. రానురాను వర్షాభావ పరిస్థితుల్లో ఆ ఒక్క పంట కూడా వేసుకోలేని దుస్థితి ఏర్పడింది.. కానీ ప్రస్తుతం రైతులు రెండు పంటలు పండిస్తూ ధాన్యాగారాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇంతటి బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన కేసీఆర్ను వైరా రైతులు వేనోళ్ల పొగుడుతున్నారు. మిషన్ కాకతీయ ఫేస్-3లో 2019 జనవరిలో వైరా మినీ ట్యాంక్బండ్ నిధులు మంజూరయ్యాయి. 2.50 మీటర్లు ఉన్న కట్టడం 8 మీటర్లుగా తయారు చేశారు. నూతనంగా బతుకమ్మ ఘాట్, టైల్స్, ఫుట్పాత్ను 2 కిలోమీటర్లు మేర నిర్మించారు. 1200 మీటర్ల పొడవు పనులు నిర్వహించారు. ట్యాంక్బండ్కు సూట్డ్రైన్స్ సైతం ఏర్పాటు చేశారు. నూతనంగా ఏర్పాటు చేసిన మట్టి కొట్టుకుపోకుండా గడ్డి ఏర్పాటు చేశారు. వెయ్యి మీటర్ల పొడవునా రైలింగ్, మెయిన్ గేట్ను ఏర్పాటు చేశారు. మరో రూ.34 లక్షలతో సోలార్ లైటింగ్, బల్లలు ఏర్పాటు చేశారు.
వైరా రిజర్వాయర్ ఆయకట్టు పరిధిలో 17,390 ఎకరాల్లో సాగు జరుగుతున్నది. వైరా రిజర్వాయర్ నీటి సామర్థ్యం 2.52 టీఎంసీలు, మిషన్ భగీరధ పథకం కింద 1.268 టీఎంసీల తాగునీటిని ప్రతిరోజు విడుదల చేస్తున్నారు. వైరా కుడికాల్వ కింద 11,514 ఎకరాలు, ఎడమకాల్వ కింద 5,876 ఎకరాలు సాగు చేస్తున్నారు. 2009లో ఆధునీకరణ పనులు ఫేస్1లో కుడికాల్వల నిర్మాణానికి గైడ్వాల్ను 7.8 కిలోమీటర్లు నిర్మించారు. కుడికాల్వ పరిధిలో 23.95 కిలోమీటర్లకు గాను 7.8 గైడ్వాల్ను నిర్మించారు. ఎడమకాల్వ పరిధిలో 15.15 కిలోమీటర్లకు గాను 9.55 గైడ్వాల్ను నిర్మించారు. ఎడమకాల్వ పరిధిలో 22 డిస్ట్రిబ్యూటర్స్ కాల్వలు ఉన్నాయి. సుమారు కుడి, ఎడమ కాల్వల ఆధునీకరణ పనులకు వెయ్యి కోట్ల నిధులకు వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ ప్రతిపాదనలు పంపారు. ఇటీవల కుడి, ఎడమ కాల్వల హెడ్స్లూయిస్ వద్ద గేట్ల మరమ్మతులకు రూ.50 లక్షలు, ఆపరేషన్ మెయింటినెన్స్ కింద నిధులను విడుదల చేశారు.
వైరా రిజర్వాయర్ పరిధిలో సుమారు 1,200 మంది మత్స్యకారులు ప్రతినిత్యం చేపల వేట నిర్వహిస్తూ జీవనోపాధిని పొందుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా చేపపిల్లలు, రొ య్య పిల్లల పంపిణీలో భాగంగా వైరా రిజర్వాయర్కు సుమా రు 14.76 లక్షల చేప పిల్లల పంపిణీ ఇటీవల నిర్వహించారు. వైరా రిజర్వాయర్ పరిధిలో చేపల వేటలో రొయ్యలు, బొచ్చ లు, కొర్రమేనులు, రాహు చేపలు విరివిగా దొరుకుతాయి. వైరా రిజర్వాయర్ చేపలకు జిల్లాలోనే ప్రసిద్ధిగాంచింది.
మిషన్ భగీరథ పథకం కింద ప్రతిరోజు 12మండలాలకు 142 ఆవాస గ్రామాలకు తాగునీటిని అందిస్తున్నారు. వైరా, మధిర మున్సిపాలిటీలతోపాటు అనేక గ్రామాలకు మిషన్ భగీరథ తాగునీటిని అందజేస్తున్నారు. వైరాను బ్యాలెన్సింగ్ రిజర్వాయర్గా ఏర్పాటు చేసి ప్రతిరోజు తాగునీటిని అందించేందుకు 12అడుగుల నీటి సామర్థ్యం ఉండేటట్లు అధికారులు చర్యలు చేపడుతున్నారు. వైరా రిజర్వాయర్ ప్రధానంగా వర్షాధార రిజర్వాయర్ అయినప్పటికీ సాగర్ జలాల ద్వారా నీటిని నింపుతూ ఇటు తాగునీటికి, అటు సాగునీటికి ఇబ్బంది రాకుండా స్థానిక ఎమ్మెల్యే రాములునాయక్, అధికారులు చర్యలు చేపడుతున్నారు.
వైరా రిజర్వాయర్లో కొంతకాలంగా టూరిజం కొనసాగడం లేదు. అతిత్వరలో టూరిజం పాయింట్ను ఏర్పాటు చేసేందుకు అధికారులు త్వరితగతిన పనులను పూర్తి చేస్తున్నారు. రిజర్వాయర్లో స్పీడ్ బోటింగ్, పెడల్ బోటింగ్, చిన్నపిల్లలకు ఆట స్థలం, రిజర్వాయర్ గెస్ట్హౌస్ను ఏర్పాటు చేసేందుకు అధికారులు సన్నద్ధమయ్యారు. రిజర్వాయర్ వద్ద టూరిజం పాయింట్ను ఏర్పాటు చేస్తామని ఉన్నతాధికారులు తెలిపారు.
వైరా రిజర్వాయర్ కుడి, ఎడమ కాల్వల ఆధునీకరణ పనుల నిమిత్తం రూ.100 కోట్ల నిధుల కోసం ప్రతిపాదనలు పంపాం. వైరా రిజర్వాయర్ను రాష్ట్రంలో అత్యంత సుందరంగా ఏర్పాటు చేసేందుకు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ నుంచి ప్రత్యేక నిధులు తీసుకొచ్చేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తా. వైరా రిజర్వాయర్లో మినీ ట్యాంక్బండ్, టూరిజం ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. రైతులందరూ ఆనందంగా ఉండేందుకు రెండు పంటలకు సాగునీరు అందిస్తున్నది. రానున్న కాలంలో వైరా రిజర్వాయర్ను అద్భుతంగా తయారు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం.
– లావుడ్యా రాములునాయక్,
వైరా ఎమ్మెల్యే