ఖమ్మం, ఏప్రిల్ 2 (నమస్తే తెలంగాణ, ప్రతినిధి) : సాగునీటి కొరత కారణంగా ఎండిపోయిన వరి, మొక్కజొన్న రైతులందరికీ పంట నష్టపరిహారం అందించాలని ఖమ్మం పార్లమెంటు సభ్యుడు నామా నాగేశ్వరరావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు జిల్లాలో ఎంపీ నామా ఆధ్వర్యంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, మండల పార్టీల అధ్యక్షులు మంగళవారం ఖమ్మం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్కు మెమోరాండం అందించారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఎంపీలు నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ మాట్లాడారు. రైతులు, ప్రజల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. ప్రజలకు అన్యాయం జరగకుండా ప్రతిపక్ష పార్టీగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామన్నారు. అబద్దాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పాలకులు గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోయాలనే ఉద్దేశంతో కాళేశ్వరం ప్రాజెక్టుపై తప్పుడు ఆరోపణలు చేశారన్నారు. పంటలకు నీళ్లు ఇవ్వకపోవడంతో ఎండిపోయే దుస్థితికి వచ్చాయన్నారు. దీనిపై ఖమ్మం జిల్లాలో పంట నష్టపోయిన రైతుల పంటలను క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించామని తెలిపారు.
నీళ్లు లేక పంటలు ఎండిపోయిన రైతులకు రూ.25 వేల నష్టపరిహారం చెల్లించేందుకు వెంటనే సర్వే చేపట్టాలని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతులకు న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ పార్టీ పెద్దఎత్తున రైతుల పక్షాన పోరాటం చేస్తుందని హెచ్చరించారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను బదనాం చేయాలనే దురుద్దేశంతో కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేసిందని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ పార్టీ ఖమ్మంజిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన్ పేర్కొన్నారు. కానీ నేడు అదే కాంగ్రెస్ ప్రభుత్వం సిగ్గులేకుండా కాళేశ్వరం ప్రాజెక్టుతో నీళ్లు ఎత్తిపోసిందని గుర్తుచేశారు. నేడు రైతులు పంటలు ఎండిపోయి ఇబ్బందులు పడుతుంటే ఎన్నికల సమయంలో గ్రామాల్లో తిరగలేమనే భయంతో కాంగ్రెస్ ప్రభుత్వం తమను రక్షించుకునేందుకు మోటర్లను ఆన్ చేసి నీళ్లు ఎత్తిపోసి తెలంగాణ రైతాంగానికి నీళ్లు అందించేందుకు ముందుకు వచ్చిందన్నారు. నాడు లేని నీళ్లు.. ఇప్పుడు ఎక్కడినుంచి వచ్చాయో సమాధానం చెప్పాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాల హామీలతో అధికారంలోకి వచ్చిదని.. ఈ విషయాన్ని ప్రజలు గుర్తించారన్నారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఘోరంగా ఓడించేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధమయ్యారన్నారు. కర్రుకాల్చి వాతపెట్టేందుకు రెఢీగా ఉన్నట్లు పేర్కొన్నారు. పెద్దపల్లిలో కాంగ్రెస్ పార్టీ మూడోస్థానంలో ఉన్నట్లు తాజాగా ఓ సర్వే నివేదికలో తేల్చిందన్నారు. సమావేశంలో మాజీ శాసనసభ్యుడు బానోతు మదన్లాల్, జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజ్ బీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు చింతనిప్పు కృష్ణచైతన్య, ఖమ్మం రూరల్ పార్టీ అధ్యక్షుడు బెల్లం వేణుగోపాల్, రఘునాథపాలెం మండల పార్టీ అధ్యక్షుడు అజ్మీర వీరూనాయక్, తొలుపునూరి దానయ్య తదితరులు పాల్గొన్నారు.
భద్రాద్రి కొత్తగూడెం, ఏప్రిల్ 2 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో పంటలు ఎండిపోతున్నా అధికార పార్టీ చోద్యం చూస్తున్నదని, ఎండిపోతున్న పంటలకు పరిహారం ఎప్పుడు ఇస్తారని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు ప్రశ్నించారు. మంగళవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పార్టీ కార్యాలయం వద్ద నుంచి మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవిత, మాజీ ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వరరావు, మెచ్చా నాగేశ్వరరావు, బానోతు హరిప్రియానాయక్, తాటి వెంకటేశ్వర్లు, దిండిగల రాజేందర్, నాయకులు కలిసి కలెక్టరేట్కు చేరుకొని కలెక్టర్ ప్రియాంక ఆలకు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ వద్ద రేగా కాంతారావు విలేకరులతో మాట్లాడారు. రైతులు పుట్టెడు కష్టాల్లో ఉన్నా కాంగ్రెస్ పార్టీ పట్టించుకోవడం లేదన్నారు. చెప్పుకోవడానికి జిల్లాకు ముగ్గురు మంత్రులు ఉన్నా పంట పొలాలను చూసే నాధుడే లేడన్నారు. పంటలు ఎండిపోయి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే కనీసం ఆ కుటుంబాలను పరామర్శించి ఓదార్చిన వారే లేరన్నారు.
ఇల్లెందు, పాల్వంచ మండలాల్లో రైతు కుటుంబాలు అప్పులు చేసి ఆత్మహత్య చేసుకున్నారని, వారికి ఇంతవరకు పరిహారం ఇవ్వలేకపోయారన్నారు. చేతకాని కాంగ్రెస్ ప్రభుత్వం వంద రోజులైనా ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. వరి పంటకు మద్దతు ధరపై బోనస్ ప్రకటించినా నేటికి ఇవ్వలేక పోతున్నారన్నారు. ఏజెన్సీ గ్రామాల్లో జనం తాగునీటి కోసం అల్లాడుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. రైతులను చిన్నచూపు చూస్తే ఊర్కునేది లేదన్నారు. మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవిత మాట్లాడుతూ బీఆర్ఎస్ సర్కారు హయాంలోనే కేసీఆర్ పంటలకు గిట్టుబాటు ధర కల్పించి రైతులకు లాభం కలిగేలా చేశారన్నారు. ప్రస్తుత ప్రభుత్వం రైతులు పండించిన పంటలను కొనుగోలు చేయలేక పోతుందన్నారు. కాంగ్రెస్ నాయకులు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చారన్నారు. ఆరుగాలం రైతులు శ్రమించి పండించిన పంటలు ఎండిపోతుంటే కాంగ్రెస్ నాయకులకు నిద్ర ఎలా పడుతుందని ఆమె ప్రశ్నించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ దిండిగల రాజేందర్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు మోరే భాస్కర్, అనుదీప్, ఎంపీపీ శాంతి, మానె రామకృష్ణ పాల్గొన్నారు.