చర్ల, డిసెంబర్ 8 : పార్టీ మారే ప్రసక్తే లేదని, నాపై నమ్మకంతో గెలిపించిన ప్రజల పక్షాన నిలిచి.. నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతానని భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు అన్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మొదటిసారిగా శుక్రవారం మండలంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెల్లం మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి క్రమశిక్షణ కలిగిన నాయకుడిగా కృషి చేస్తానని అన్నారు. ఇటీవల తుపాను ప్రభావంతో పంటలు దెబ్బతిన్న రైతులకు ప్రభుత్వం పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ సమస్యల పరిష్కారానికి ఎటువంటి ఆటంకం ఉండదని, ప్రతి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు. తన గెలుపు కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో పార్టీ మండల కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు సోయం రాజారావు, పోలిన లంకరాజు, చర్ల సర్పంచ్ కాపుల కృష్ణార్జునరావు, ఎస్టీ సెల్ నాయకుడు కాపుల నాగరాజు, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
తుపాను ప్రభావంతో మండలంలో దెబ్బతిన్న పంటలను ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు పరిశీలించారు. గొంపల్లి, కొత్తపల్లి ఆర్ కొత్తగూడెం, చింతకుంట, జీపీ పల్లి, వీరాపురం, లింగాపురం ప్రాంతాల్లో మిర్చి, పత్తి, వరి పంటలను పరిశీలించిన ఆయన రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పలువురు రైతులు తమ గోడు వినిపించారు. చేతికొచ్చిన వరి పంట నీట మునిగిందని, మిర్చి చేల్లోకి నీరుచేరి తీవ్రంగా నష్టపోయామని వివరించారు. మీకు జరిగిన నష్టాన్ని ప్రభుత్వానికి వివరించి.. న్యాయం జరిగేలా చూస్తానన్నారు. పంట నష్టం నివేదికను సాధ్యమైనంత త్వరగా తనకు అందజేయాలని వ్యవసాయాధికారి శివరామప్రసాద్కి సూచించారు. రైతులు అధైర్యపడొద్దని తెల్లం వారిని ఓదార్చారు. ఆయన వెంట పార్టీ మండల, అధ్యక్ష కార్యదర్శులు సోయం రాజారావు, పోలిన లంకరాజు, ఎంపీపీ గీద కోదండరామయ్య, చర్ల సర్పంచ్ కాపుల కృష్ణార్జునరావు, కాపుల నాగరాజు, కొటేరు శ్రీనివాసరెడ్డి, కొసరాజు కుమార్రాజ, ఇర్పా వసంత్, సీతాపతిరాజు, గొర్ల రాజబాబు, ముప్పిడి సోమరాజు, పోలూరి సుజాత, నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.