కూసుమంచి, (నేలకొండపల్లి) మే 2: రాష్ట్ర హక్కుల సాధనే లక్ష్యంగా పని చేస్తానని ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఎంపీగా పనిచేసిన ఇన్నాళ్లు కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసమే పోరాడానని అన్నారు. పార్లమెంట్లో ప్రజా సమస్యల పరిష్కారమే ఎజెండా బీఆర్ఎస్ ఎంపీలం పనిచేస్తున్నామని అన్నారు.
ఇవన్నీ గమనించి ఈ ఎన్నికల్లో కూడా తనను మరోసారి గెలిపించాలని కోరారు. పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా నేలకొండపల్లి, కూసుమంచిలో గురువారం రాత్రి జరిగిన సమావేల్లో ఆయన మాట్లాడారు. ప్రత్యేక రాష్ట్రం కోసం చేసిన ఉద్యమంతోపాటు తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో ఉద్యమ నేత కేసీఆర్ ముందు వరుసలో ఉన్నారని గుర్తుచేశారు. తప్పుడు వాగ్ధానాలు, నమ్మశక్యం కానీ మాటలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్తో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.
రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ.. గత అసెంబ్లీ ఎన్నికల్లో అమలు కానీ హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ఈ ఐదు నెలల్లోనే ప్రజల నుంచి వ్యతిరేకతను చవి చూస్తోందని విమర్శించారు. ప్రతీ కార్యకర్తా కష్టపడి పని చేసి మంచి మెజార్టీతో నామాను గెలిపించాలని కోరారు. పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి మాట్లాడుతూ.. గతంలో జిల్లాలోనే అత్యధికంగా పాలేరు నియోజకవర్గంలో నామా నాగేశ్వరరావుకు మెజార్టీ వచ్చిందని, ఈ సారి కూడా అలానే మెజారిటీ అందిద్దామని అన్నారు. పార్టీ నాయకులు ఉన్నం బ్రహ్మయ్య, వేముల వీరయ్య మరికంటి ధనలక్ష్మి, రామసహాయం బాలకృష్ణా రెడ్డి, నాగుబండి శ్రీనివాసరావు, బెల్లం వేణు, అసీఫ్పాషా, రాంరెడ్డి, రాంచంద్రు పాల్గొన్నారు.
ఖమ్మం, మే 2: బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు గెలుపునకు కృషి చేస్తామని నగరంలోని నందమూరి అభిమానులు చెప్పారు. వారు గురువారం నామా నాగేశ్వరరావును ఖమ్మంలోని ఆయన నివాసంలో కలిశారు. ఎన్టీఆర్ ప్రతిమను బహూకరించి, మద్దతు తెలిపారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుకు నామా చేసిన కృషిని గుర్తు చేసుకున్నారు. తాళ్లూరి శ్రీనివాస్, నల్లమల రంజిత్, సతీష్, రంగారావు, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.