ఖమ్మం, మార్చి 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఖమ్మం, మహబూబాబాద్ ఎంపీ స్థానాల నుంచి మరోసారి పోటీ చేసేందుకు నామా నాగేశ్వరరావు, మాలోతు కవితకు అవకాశం కల్పించారు. ఈ మేరకు హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో సోమవారం జరిగిన పార్టీ ఖమ్మం, మహబూబాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గాల సమావేశంలో ఖరారు చేశారు. రెండు స్థానాల్లోనూ బీఆర్ఎస్దే విజయమని పార్టీ అధినేత ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీపై ఇప్పటికే ప్రజల్లో అసహనం ప్రారంభమైందని, వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని, బీఆర్ఎస్కే ప్రజలు మద్దతు ఉంటుందన్నారు.
గత ఎంపీ ఎన్నికల్లో నామా నాగేశ్వరరావు 1.68 లక్షల ఓట్లు, మాలోతు కవిత 1.46 లక్షల ఓట్ల మెజార్టీతో గెలిచారని గుర్తుచేశారు. అవే ఫలితాలు మళ్లీ పునరావృతమవుతాయన్నారు. నామా లోక్సభలో తెలంగాణ ప్రజల వాణిని వినిపించారని, ఎన్నో సమస్యల పరిష్కారానికి కృషి చేశారని కొనియాడారు. రెండు ఎంపీ స్థానాల్లో విజయం సాధించేందుకు తాను రోడ్ షోలు, సమావేశాంల్లో పాల్గొంటానన్నారు. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థుల విజయం కోసం పార్టీ నాయకులు, ఇన్చార్జులు, ప్రజాప్రతినిధులు సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. పార్టీని వీడిన వారి గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదన్నారు.
ఖమ్మంలో త్వరలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని ప్రకటించారు. సమావేశంలో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు, మాజీ మంత్రి హరీశ్రావు, లోక్సభ సభ్యులు నామా నాగేశ్వరరావు, మాలోతు కవిత, రాజ్యసభ సభ్యులు కేశవరావు, బండి పార్థసారథిరెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్రాజు, పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, పార్టీ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు, మాజీ శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య, మెచ్చా నాగేశ్వరరావు, తాటి వెంకటేశ్వర్లు, హరిప్రియానాయక్, బానోత్ మదన్లాల్, వనమా వెంకటేశ్వరరావు, ఖమ్మం నగర మేయర్ కొనుకొల్లు నీరజ, పార్టీ నాయకులు కొండబాల కోటేశ్వరరావు, బొమ్మెర రామ్మూర్తి పాల్గొన్నారు.
లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల విజయం కోసం ప్రతిఒక్కరూ శక్తివంచన లేకుండా కృషిచేయాలని మాబీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులుగా ఖరారు ఖమ్మం, మానుకోట పార్లమెంటరీల స్థాయి సమావేశంలో పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటన పార్టీ గెలుపు కోసం పని చేయాలని నాయకులు, కార్యకర్తలకు పిలుపు అభ్యర్థుల ఎంపికపై గులాబీ శ్రేణుల హర్షం జీ మంత్రి తన్నీరు హరీశ్రావు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వ మోసపూరిత వైఖరిని ప్రజలకు వివరించాలన్నారు.
తెలంగాణ ప్రజల సమస్యలను ఢిల్లీ వేదికగా వినిపించే సత్తా ఒక్క బీఆర్ఎస్ అభ్యర్థులకే ఉందన్నారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు కాపాడడంలో బీఆర్ఎస్ నాయకులు ముఖ్య పాత్ర పోషించాలన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మూడు నెలలు కావొస్తున్నా ఆరు గ్యారెంటీలను అమలు చేయడంలో విఫలమైందన్నారు. మార్చి 17తో కాంగ్రెస్ పాలనకు 100 రోజులు పూర్తవుతాయని, అయినా హామీలు అమలయ్యే పరిస్థితి లేదన్నారు.
నామా నాగేశ్వరరావు 2004లో టీడీపీలో చేరడం ద్వారా ఆయన రాజకీయ ప్రస్థానం మొదలైంది. 2004లో ఖమ్మం ఎంపీ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రేణుకాచౌదరిపై ఓటమి చెందారు. తిరిగి నామా 2009లో ఇదే ఎంపీ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా రేణుకాచౌదరిపై పోటీ చేసి ఘన విజయం సాధించారు. తొలిసారిగా లోక్సభ సభలో అడుగుపెట్టారు. 2014 ఎంపీ ఎన్నికల్లో ఖమ్మం ఎంపీ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. 2019లో ఇదే ఎంపీ స్థానం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రేణుకాచౌదరిపై 1.66 లక్షల పైచిలుకు ఓట్లతో ఘనవిజయం సాధించారు.
నామా కేంద్ర స్థాయిలో పలు స్టాండింగ్ కమిటీల్లో సభ్యుడిగా, బీఆర్ఎస్ లోక్సభా పక్ష నేతగా కీలకంగా పనిచేశారు. తెలంగాణ ప్రజల గొంతుకై లోక్సభలో గళం వినిపించారు. ప్రజానేతగా నామా పేరు తెచ్చుకున్నారు. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా నామాను ఎంపిక చేయడంపై పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. కదన రంగంలోకి దూకేందుకు సిద్ధమవుతున్నాయి. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఈనెల 7న బీఆర్ఎస్ కీలక నేతలు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల స్థాయిలో సమావేశం నిర్వహించనున్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన్ ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఖమ్మం, మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గాల పరిధి ముఖ్య నేతలతో పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్రావు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా లంబాడాల నుంచి దేశంలోనే తొలి మహిళా ఎంపీగా గుర్తింపు పొంది.. మహబూబాబాద్ పార్లమెంట్ పరిధి నాయకులతో కలుపుగోలుగా ఉంటూ పాలనలో సమర్థవంతంగా ముందుకెళ్తున్న ఆమె నాయకత్వ పటిమను చూసి కేసీఆర్ మరోమారు అవకాశం ఇచ్చారు.
మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండలం ఉగ్గంపల్లిలో 1980, జనవరి 1న కవిత జన్మించారు. బీఎస్సీ కంప్యూటర్స్ పూర్తి చేశారు. తన తండ్రి డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే రెడ్యానాయక్ నుంచి రాజకీయ పాఠాలు నేర్చుకున్నారు.
2009లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా జనరల్ స్థానంగా ఉన్న మహబూబాబాద్ అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలు ఎస్టీలకు రిజర్వ్ అయ్యాయి. అవకాశం కలిసిరావడంతో 2009లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీచేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో తిరిగి ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి బీఆర్ఎస్ అభ్యర్థి శంకర్నాయక్ చేతిలో ఓటమిపాలయ్యారు. అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల్లో భాగంగా కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో చేరారు. 2019లో మహబూబాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి బలరాంనాయక్పై 1.46 లక్షల మెజార్టీతో గెలుపొందారు. కాగా, రానున్న పార్లమెంట్ ఎన్నికల కోసం మహబూబాబాద్ స్థానం నుంచి మరోమారు ఆమె అభ్యర్థిత్వాన్ని బీఆర్ఎస్ అధిష్టానం ఖరారు చేసింది.
తండ్రి పేరు : ముత్తయ్య
తల్లి పేరు: వరలక్ష్మి
పుట్టిన ప్రదేశం: మహబూబాబాద్ జిల్లా బలపాల గ్రామం
పుట్టిన తేదీ: 15 మార్చి 1957
భార్య: చిన్నమ్మ
సంతానం: ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె
విద్యార్హతలు: ఇంటర్మీడియట్
వృత్తి : వ్యాపారవేత్త
నివాసం: ఖమ్మం
-2009లో తెలుగుదేశం పార్టీ నుంచి 15వ లోక్సభ సభ్యుడిగా ఖమ్మం పార్లమెంటరీ నియోజ కవర్గం నుంచి ఎన్నికయ్యారు. 2019 లోక్సభ ఎన్నికల్లో ఎంపీగా గెలుపొందారు. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ పక్ష నేతగా కొనసాగుతున్నారు.
తల్లిదండ్రులు : ధరంసోత్ రెడ్యానాయక్, లక్ష్మి
భర్త : భద్రూనాయక్
సంతానం : కూతురు మహతి, కుమారుడు నయన్
రాజకీయ ప్రవేశం: 2008 కాంగ్రెస్లో చేరిక, 2009లో మహబూబాబాద్ ఎమ్మెల్యేగా గెలుపు, 2014లో అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, 2019లో మహబూబాబాద్ ఎంపీగా గెలుపు.