ఖమ్మం, ఏప్రిల్ 18: మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంట్రాక్టరుగా అవతారమెత్తిన రోజు నుంచి ఈ రోజు వరకు అతడు చేసిన భూదందాలు, ఆర్థిక నేరాలపై సీబీ సీఐడీ విచారణ చేయాలని సీఎం కేసీఆర్ను కలిసి విజ్ఞప్తి చేస్తానని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధు తెలిపారు. ఖమ్మంలోని తెలంగాణ భవన్లో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పొంగులేటి తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసమే సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్లపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ను కొనుగోలు చేసే స్థోమత పొంగులేటికి ఉందా? అని ప్రశ్నించారు. కేసీఆర్ను కొనే వ్యక్తి ఈ జన్మలోనే కాదు ఏ జన్మలోనూ ఉండరని స్పష్టం చేశారు. పొంగులేటి మరో సుఖేశ్ అని విమర్శించారు. ‘ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసే అభ్యర్థులను అసెంబ్లీ గేటు కూడా తాకనీయకుండా చేయడానికి నువ్వేమైనా గేటు వాచ్మెన్వా? అని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్కే కమీషన్లు ఇచ్చానంటూ చెబుతుండడం బూటకమని, ఆ మాటలన్నీ తన రాజకీయ మనుగుడ కోసం మాట్లాడినవేనని అన్నారు. ఇలాంటి పొంగులేటికి గుణపాఠం తప్పదని హెచ్చరించారు. ఏ పార్టీలోకి వెళ్లాలో తెలియక మతిభ్రమించి వ్యవహరిస్తున్న శ్రీనివాసరెడ్డికి జిల్లా ప్రజలు తప్పక బుద్ధి చెబుతారని అన్నారు.
చీమలపాడు ఘటనను రాజీకయం చేయడం తగదని ఎమ్మెల్సీ మధు అన్నారు. ఆ సంఘటనను కూడా రాజకీయం చేసి లబ్ధి పొందాలనే నీచపు ఆలోచన చేస్తున్న శ్రీనివాసరెడ్డి ప్రజాసేవకు అనర్హుడని అన్నారు. తన కూతురి వివాహానికి ముఖ్యమంత్రి కేసీఆర్ని ఆహ్వానించడానికి ప్రగతిభవన్కు వెళ్తే కనీసం వివాహ పత్రికను కూడా తీసుకోలేదని ఓ ఇంటర్వ్యూలో చెప్పడం అతడి స్థాయికి తగునా అని ప్రశ్నించారు. ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ను కలిసి ఆహ్వాన పత్రికను అందజేసిన ఫొటోను, వివాహానికి ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ హాజరైన ఫొటోను ఈ మీడియా సమావేశంలో చూపించి ఈ ఫొటోలో ఉన్నది ఎవరో చెప్పాలంటూ ప్రశ్నించారు. ఎమ్మెల్సీగా, ఖమ్మం జిల్లా ప్రజాప్రతినిధిగా ఉన్న తాను.. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిజస్వరూపాన్ని జిల్లా ప్రజలకు తెలియజేస్తానని అన్నారు. పొంగులేటి ప్రస్థానం మొదలైన నాటి నుంచి ఇప్పటి వరకూ ఆయన చేసిన అవినీతి చిట్టాలను త్వరలోనే బహిర్గతం చేస్తానని అన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ప్రాజెక్టును సైతం హేళన చేసిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి.. సీతారామ ప్రాజెక్టుకు టెండర్ ఎందుకు వేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. గతంలో పొంగులేటికి మధిర నియోజకవర్గంలో బాధ్యతలు ఇచ్చినప్పటికీ ఆ ఒక స్థానాన్నీ గెలిపించలేకపోయారని విమర్శించారు.
పొంగులేటిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్న ఇతర పార్టీ నేతలు కూడా ఆయనను వారి పార్టీల్లో చేర్చుకునేందుకు సిద్ధపడడం లేదని అన్నారు. అందుకే ఆయన ఏ పార్టీలోనూ చేరలేకపోతున్నారని అన్నారు. ఇప్పటికైనా తీరు మార్చుకోకపోతే రాజకీయ భవిష్యత్తుకు చమరగీతం తప్పదని హెచ్చరించారు. ఎస్ఆర్ గార్డెన్ పక్కన ఉన్న ప్రభుత్వ భూమిలో ఎవరి అనుమతితో బ్రిడ్జి కట్టావని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, బీఆర్ఎస్ గురించి ఇష్టానుసారంగా మాట్లాడితే కార్యకర్తలు సహింబోరని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో కేఎంసీ మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్కుమార్, బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, డీసీఎంఎస్ చైర్మన్ రాయల శేషగిరిరావు, రైతుబంధు సమన్వయ సమితి ఖమ్మం జిల్లా కన్వీనర్ నల్లమల్ల వెంకటేశ్వరరావు, కార్పొరేటర్ కమర్తపు మురళి, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు చింతనిప్పు కృష్ణచైతన్య, ఖమ్మం రూరల్ మండల అధ్యక్షుడు బెల్లం వేణు, తెలంగాణ ఉద్యమకారులు బొమ్మెర రామ్మూర్తి, ఉప్పల వెంకటరమణ, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.