పెనుబల్లి, నవంబర్ 26 : ప్రజలను మభ్యపెట్టేందుకే కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ స్కీములంటూ ఊదరగొడుతోందని సత్తుపల్లి ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నియోజకవర్గ అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్య విమర్శించారు. ఆ పార్టీ ఎన్ని హామీలిచ్చినా ప్రజలు నమ్మే స్థితిలో లేరని స్పష్టం చేశారు. నిత్యం ప్రజల కోసం పనిచేస్తూ వారిలో ఒకరిగా ఉంటున్న తనకు వారే బలమూ, బలగమని స్పష్టం చేశారు. పెనుబల్లి మండలంలో ఆదివారం పర్యటించిన ఆయన.. బయ్యన్నగూడెం, తుమ్మలపల్లి, పాతకుప్పెనగుంట్ల, కొత్తకుప్పెనకుంట్ల గ్రామాల్లో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇలాంటి గ్యారెంటీ స్కీములన్నీ గడిచిన 50 ఏళ్లుగా ఏమయ్యాయని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలించిన ఇన్నేళ్లలో గ్రామాల్లో కనీసం మౌలిక వసతులు కల్పించలేదని విమర్శించారు. ఇక సంక్షేమ పథకాల ఊసేలేదని అన్నారు. కానీ సీఎం కేసీఆర్ పాలనలో ప్రజలకు అద్భుతమైన సంక్షేమ పథకాలు అందుతున్నాయని గుర్తుచేశారు.
బీఆర్ఎస్ మరోసారి అధికారంలోకి వస్తే నియోజకవర్గంలోని ప్రతి ఎస్సీ కుటుంబానికీ దళితబంధు పథకం అమలవుతుందని స్పష్టం చేశారు. నూతన మ్యానిఫెస్టో ప్రకారం మరిన్ని సంక్షేమ పథకాలు అమలుచేస్తామని వివరించారు. అందుకని ప్రజలందరూ కేసీఆర్ వెంటే ఉండాలని పిలుపునిచ్చారు. పొరపాటున కాంగ్రెస్ను కనికరిస్తే కరెంట్ మోటర్ల వద్ద కాపలా పడుకునే రోజులు వస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. అయినా కాంగ్రెస్ నాయకులు ఇక్కడ ఇస్తున్న హామీలను వాళ్లు అధికారంలో ఉన్న చోట ఎందుకు అమలుచేయడం లేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు కనగాల వెంకట్రావు, లక్కినేని అలేఖ్య, చెక్కిలాల మోహన్రావు, చింతనిప్పు కృష్ణచైతన్య, కోమటి శ్రీలత, మందడపు అశోక్కుమార్, ఆళ్ల అప్పారావు, కోమటి ప్రసాద్, మామిడి మైసయ్య, ఆవిటి మారేశ్వరరావు, పసుమర్తి వెంకటేశ్వరరావు, కొత్తగుంట్ల అప్పారావు, తాళ్లూరి శేఖర్రావు, లగడపాటి శ్రీను, సూరపురెడ్డి కిరణ్రెడ్డి, నర్వోత్తమరెడ్డి, నాగండ్ల నరసింహారావు, దొడ్డపునేని రవి, కొప్పుల రంగారావు, చెక్కిలాల లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.