కల్లూరు, అక్టోబర్ 30: కల్లూరులో వచ్చే నెల 1న జరిగే సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్య పిలుపునిచ్చారు. కల్లూరులో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మధ్యాహ్నం సభ ప్రారంభమవుతుందన్నారు. జానపద గాయని మధుప్రియ బృందం గీతాలపన సభకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందన్నారు. సభలో సుమారు 70 వేల మంది కూర్చునేందుకు వీలుగా ఏర్పాట్లు చేశామన్నారు. సభకు విచ్చేసిన ప్రజలు, నాయకులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు చేశామన్నారు. 9వ తేదీన తాను నామినేషన్ దాఖలు చేస్తున్నానని ప్రకటించారు. తన వెంట భారీగా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలిరావాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే తన మొదటి విడత ఎన్నికల ప్రచారం పూర్తికావొచ్చిందన్నారు. 2వ తేదీ నుంచి తిరిగి రెండో విడత ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తానన్నారు. సమావేశంలో జడ్పీటీసీ కట్టా అజయ్బాబు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పాలెపు రామారావు, నాయకులు లక్కినేని రఘు, కీసర వెంకటేశ్వరరెడ్డి, కాటంనేని వెంకటేశ్వరరావు, పెడకంటి రామకృష్ణ, బోబోలు లక్ష్మణరావు, ఇస్మాయిల్ పాల్గొన్నారు.
కల్లూరు పట్టణంలో ఎన్ఎస్పీ క్రాస్రోడ్డు సమీపంలోని 50 ఎకరాల్లో 1వ తేదీన సీఎం కేసీఆర్ ప్రజాఆశీర్వాద సభ జరుగనున్న విషయం తెలిసిందే. సభ ఏర్పాట్లను సోమవారం ఎమ్మెల్యే సండ్ర వెంటకవీరయ్య పరిశీలించారు. అధికారులు, నాయకులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఎమ్మెల్యే వెంట ఏసీపీ రామానుజం, సీఐ హనూక్, ఎస్సై రఘు, ఆర్అండ్బీ ఈఈ హేమలత తదితరులున్నారు.