ఖమ్మం, (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/భద్రాద్రి కొత్తగూడెం, (నమస్తే తెలంగాణ) ఏప్రిల్ 8 : బొగ్గు గనులను ప్రైవేటీకరిస్తే ఉవ్వెత్తున ఉద్యమిస్తామని, సింగరేణి గొంతు నొక్కితే చూస్తూ ఊరుకోబోమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ స్పష్టం చేశారు. అందరమూ కలిసికట్టుగా పోరాడి సింగరేణిని కాపాడుకుంటామని తేల్చిచెప్పారు. ప్రభుత్వ రంగసంస్థలను నిర్వీర్యం చేస్తున్న కేంద్రానికి గుణపాఠం తప్పదని హెచ్చరించారు. సింగరేణిలో బొగ్గు గనుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు కొత్తగూడెం జిల్లా కేంద్రంలో పార్టీ భద్రాద్రి, ఖమ్మం జిల్లాల అధ్యక్షులు రేగా కాంతారావు, తాతా మధు సారథ్యంలో ఎమ్మె ల్యే వనమా అధ్యక్షతన మహాధర్నా చేపట్టారు. ముఖ్య అతిథిగా మంత్రి అజయ్ మాట్లాడుతూ.. బొగ్గు బ్లాకులను ప్రైవేటుకు అప్పగిస్తే ప్రధాని మోదీ గద్దె దిగడం ఖాయమని స్పష్టం చేశారు. దాదాపు 135 ఏళ్ల చరిత్ర కలిగిన సింగరేణి దేశానికి వెలుగులనిస్తోందని, ఎన్నో లక్షల మందికి ఉపాధినిస్తోందని, రోడ్లు, విద్యాలయాలు, ఆస్పత్రులను ఏర్పాటు సేవలందిస్తోందని అన్నారు. ఇప్పుడు కేంద్రం అనాలోచిత నిర్ణయం చేసి సింగరేణి మనకు దూరం చేసేందుకు త్రీవంగా ప్రయత్నిస్తోందని అన్నారు.
సింగరేణిని ప్రైవేటుపరం చేస్తే రాష్ట్రం చీకటిమయం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. సంస్థ లాభాల్లో వాటా ను పొందే కార్మికులు శ్రమ దోపిడికి గురవుతారని, వారసత్వ ఉద్యోగాలు, ఉద్యోగ భద్రత, నియామకాల్లో రిజర్వేషన్లు, బోనస్లు, అలవెన్సులు, ఇతర సంక్షేమ కార్యక్రమాలు రద్దవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణి ఉద్యోగులకు అత్యధిక బోనస్ ఇచ్చి సీఎం కేసీఆర్ చరిత్రలో నిలిచిపోయారని అన్నారు. ఇది సహించలేని కేంద్రం.. సింగరేణిని అంతమొందించేందుకు కక్షపూరితంగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. సీఎం కేసీఆర్ శ్రీరామరక్షగా ఉన్నారు కాబట్టే ఇప్పటిదాకా సింగరేణి మిగిలి ఉందని, లేకపోతే దాన్ని ప్రధాని ఇప్పటికే కార్పొరేట్లకు దారాదత్తం చేసి ఉండేవారని అన్నారు. సింగరేణిని ప్రైవేటీకరణ చేయబోమని చెప్పిన ప్రధాని మోదీ.. ఇప్పుడు మళ్లీ గనులను వేలానికి పెట్టడం సిగ్గుచేటని విమర్శించారు. సింగరేణి ఏ విధంగా ప్రైవేటుపరం చేస్తారో తామూ చూస్తామని అన్నారు. బొగ్గు బ్లాకుల వేలం విషయంపై కేంద్రం వెనక్కి తగ్గకుండే జంగ్ సైరన్ మోగిస్తామని, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ నేతృత్వంలో మరో ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తామని స్పష్టం చేశారు.
బీజేపీ హఠావో.. సింగరేణి బచావో
కేంద్ర సర్కార్ సింగరేణిని ప్రైవేటీకరించేందుకు కుట్ర చేస్తున్నది. సత్తుపల్లి బ్లాక్ 3, శ్రావణ్పల్లి, పెనగడప గనులకు వేలం నిర్వహించేందుకు మరోసారి నోటిఫికేషన్ వేసింది. దీన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి. ‘సింగరేణి’ తెలంగాణ ప్రజల హక్కు.. ప్రైవేటీకరణను అడ్డుకోవడం ఉద్యమాల పురిటిగడ్డ తెలంగాణకు బాగా తెలుసు.. వేలంతో సంబంధం లేకుండా నేరుగా సింగరేణికే బొగ్గు గనులు కేటాయించాలి. సింగరేణి గొంతు నొక్కితే మరో మహోద్యమం చేపడుతాం. ప్రభుత్వరంగ సంస్థలను నిర్వీర్యం చేస్తున్న బీజేపీ ప్రభుత్వానికి గుణపాఠం తప్పదు. కార్మికులారా.. కలిసికట్టుగా సింగరేణి కాపాడుకుందాం.. సీఎం కేసీఆరే దేశానికి, తెలంగాణకు శ్రీరామరక్ష.
– రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్
సింగరేణిని కారుచీకట్లో ఉంచాలని చూస్తున్నారు.. ఎమ్మెల్యే హరిప్రియ
బొగ్గు ద్వారా విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంటే సింగరేణిని కారు చీకట్లలో ఉంచాలని కేంద్రం కుట్ర పన్నుతోందని దుయ్యబట్టారు. బయ్యారం ఉక్కు ప్యాక్టరీ విషయంలోనూ తెలంగాణకు కేంద్రం అన్యాయం చేసిందని విమర్శించారు. మోదీ మోసపూరిత విధానాలను ఎండగట్టాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా త్వరలోనే ప్రజలు కేంద్రానికి తగిన గుణపాఠం చెబుతారని అన్నారు.
ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తున్న మోదీ : ఎమ్మెల్యే సండ్ర
ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేయాలని చేస్తున్న కేంద్రానికి బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయని స్పష్టం చేశారు. భవిష్యత్ అంతా బీఆర్ఎస్దేనని అన్నారు. అన్ని రాష్ర్టాల్లో ప్రజలు బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతుంటే బీజేపీ తెలంగాణ ప్రజలను మోసం చేయాలని రాజకీయం చేస్తున్నారని అన్నారు. సింగరేణి కార్మికులను మోసం చేస్తే ఊరుకోబోమని స్పష్టం చేశారు.
రామగుండంలో ఇచ్చిన మాట ఏమైంది?: వనమా వెంకటేశ్వరరావు
బొగ్గు బావులను ప్రైవేటీకరణ చేస్తే ప్రధాని మోదీని కార్మికులు ఇంటికి పంపుతారని స్పష్టం చేశారు. ప్రైవేటుకు అప్పజెప్పబోమంటూ ఇటీవల రామగుండం సభలో ప్రధాని ఇచ్చిన మాట ఏమైందని ప్రశ్నించారు. కేంద్రంలోని పాలకులు నీతిగా పాలన చేయాలి కానీ కార్మికులు పొట్ట కొట్టే పాలన చేయకూడదన్నారు. మోదీ.. కాషాయం ముసుగులో ప్రజలను మోసం చేస్తున్నావని.. ఇక నీ ఆటలు సాగవన్నారు.
రాబందులా కేంద్రం వ్యవహారం: రాములునాయక్
బీజేపీ ప్రభుత్వంగా రాబందులా వ్యవహరిస్తోందని, సింగరేణిని ఎత్తుకపోయేందుకు చూస్తోందని విమర్శించారు. తెలంగాణ వచ్చాక సీఎం కేసీఆర్ ఇక్కడి ప్రజలకు 24 గంటలు కరెంటు ఇస్తున్నారని అన్నారు. అయితే బొగ్గు బావులను ప్రైవేటుపరం చేసి రాష్ట్రంలో కరెంటు లేకుండా చేయాలని కేంద్రం చూస్తోందని దుయ్యబట్టారు.
గనులను ప్రైవేటీకరిస్తే ఊరుకోం :
పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి
సింగరేణిని ప్రైవేటీకరించే ఉద్దేశమే కేంద్రానికి లేకపోతే వేలానికి ప్రతిపాదించిన బొగ్గు గనులను తిరిగి సంస్థకు ఎందుకు అప్పగించడం లేదు..? కేంద్రం ప్రభుత్వం కుట్రలు పన్ని సంస్థను నిర్వీర్యం చేయాలని ప్రయత్నిస్తున్నది. బొగ్గు గునులపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేస్తున్న వ్యాఖ్యలు పచ్చి అబద్ధాలు. కేంద్రం నాలుగోసారి గనుల కేటాయింపునకు వేలం నిర్వహించనున్నది. ప్రైవేటీకరణ జరిగితే సింగరేణీయులు చూస్తూ ఊరుకోరు. ఉద్యమాలు మరింత ఉధృతమవుతాయి.
సింగరేణిపై కేంద్రం అక్కసు :
ఖమ్మం జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు
బొగ్గు బావులపై కేంద్రం అక్కసు వెళ్లగక్కుతున్నది. అందుకే సింగరేణి పరిధిలోని నాలుగు బొగ్గు బావులను వేలం వేసేందుకు సిద్ధమవుతున్నది. రాష్ట్ర ప్రభుత్వాన్ని అన్ని విధాలుగా ఇబ్బంది పెడుతున్నది. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్పరం చేసి నిరుద్యోగులు, కార్మికులకు అన్యాయం చేస్తున్నది. కార్మికులను పొట్టగొట్టాలని ప్రధాని మోదీ చూస్తున్నారు. ఈ దుర్మార్గపు ఆలోచనలను అందరూ గ్రహిస్తున్నారు. ప్రజలే మున్ముందు బీజేపీకి బుద్ధి చెప్తారు.
గనులన్నీ కార్మికుల కష్టార్జితం: తాతా మధు
ఎమ్మెల్సీ తాతా మధు మాట్లాడుతూ.. సింగరేణి గనులు ప్రధాని మోదీ సొత్తు కాదని, అవి కార్మికుల కష్టార్జితమని స్పష్టం చేశారు. సింగరేణి పుట్టినప్పుడు అడ్రస్లో కూడా లేని బీజేపీ.. ఇప్పుడు తనకు అధికారం ఉందని ప్రైవేటీకరిస్తే చూస్తూ ఊరుకోబోమని స్పష్టం చేశారు. దేశంలో బీఆర్ఎస్కు వస్తున్న ఆదరణను ఓర్వలేకనే కేంద్రం ప్రభుత్వం ఇలాంటి నీచమైన చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు.
బీజేపీకి రోజులు దగ్గర పడ్డాయి: వద్దిరాజు
రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ తీరును దేశ ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. బీజేపీ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని, దాని ఆటలు ఎన్నో రోజులు సాగవని, తగిన బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. ప్రధాని మోదీ గుజరాత్కు ఒక న్యాయం, తెలంగాణకు మరో న్యాయం చెబుతున్నారని విమర్శించారు. పార్లమెంటు సమావేశాలను కనీసం గంటలపాటు కూడా సాగనివ్వని మోదీ పాలన దేనికోసమని ప్రశ్నించారు.
తెలంగాణలో బీజేపీ ఆటలు సాగవు: రేగా
ప్రభుత్వ విప్ రేగా కాంతారావు మాట్లాడుతూ తెలంగాణ గడ్డపై ప్రధాని మోదీ ఆటలు సాగవని స్పష్టం చేశారు. శరణమో, రణమో తేల్చుకోవాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ తన మిత్రుడి కోసం సింగరేణిని ధారదత్తం చేయడం సమంజసం కాదని అన్నారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని ప్రధాని ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో బీజేపీ బండారం బయటపడిందని అన్నారు.
చిందేసిన రేగా..
కొత్తగూడెం సింగరేణి, ఏప్రిల్ 8 : బొగ్గు బ్లాక్లను ప్రైవేట్పరం చేయవద్దని కొత్తగూడెంలో బీఆర్ఎస్, టీబీజీకేఎస్ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం చేపట్టిన మహాధర్నాలో కళాకారుల పాటలకు ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు స్టెప్పులేశారు. కళాకారులు ఆలపించిన సింగరేణి తల్లి పాటకు విప్ మైమర్చిపోయి చిందేసి కార్మికులు, నాయకుల్లో జోష్ నింపారు.
ఆ బొగ్గు బ్లాకులు సింగరేణికే అప్పగించాలి: వెంకట్రావ్
టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్రావ్ మాట్లాడుతూ.. కేంద్రం వేలానికి పెట్టిన బొగ్గు బ్లాకులన్నింటినీ సింగరేణికే అప్పగించాలని డిమాండ్ చేశారు. తెలంగాణకు మణిహారమైన సింగరేణిని పూర్తిగా ప్రైవేటీకరించే కుట్రలకు కేంద్రం పాల్పడుతోందని దుయ్యబట్టారు.. ఆ కుట్రలను తిప్పికొట్టేందుకు సింగరేణీయులు, తెలంగాణ ప్రజలు మరో ఉద్యమానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.
భారీగా తరలివచ్చిన శ్రేణులు..
కొత్తగూడెం మహాధర్నాకు బీఆర్ఎస్, టీబీజీకేఎస్ శ్రేణులు భారీగా తరలివచ్చాయి. ఎండను లెక్కచేయకుండా ధర్నాలో పాల్గొన్నాయి. ‘మోదీ డౌన్ డౌన్’ అంటూ నినదించారు. ఈ మహాధర్నాలో ఎమ్మెల్యేలు మెచ్చా నాగేశ్వరరావు, కందాళ ఉపేందర్రెడ్డి, డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్లు కూరాకుల నాగభూషణం, శేషగిరిరావు, ఖమ్మం జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు, ఖమ్మం, కొత్తగూడెం మున్సిపల్ చైర్పర్సన్లు పునుకొల్లు నీరజ, కాపు సీతాలక్ష్మి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగల రాజేందర్, భద్రాద్రి జడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖరరావు, సింగరేణి కార్మిక సంఘాల నాయకులు, ఇతర ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నేతలు జేవీఎస్ చౌదీరి, భీమా శ్రీదర్, రజాక్, దమ్మాలపాటి వెంకటేశ్వరరావు, బచ్చు విజయ్కుమార్, ఎంఏ రజాక్, సోమిరెడ్డి, రంగనాథ్, కాపు కృష్ణ, ఊకంటి ప్రభాకర్రావు, కూసన వీరభద్రం, మోహన్రెడ్డి, జేబీ మోహన్, సుధాకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మహాధర్నాకు తరలిన బీఆర్ఎస్ నాయకులు
అశ్వారావుపేట, ఏప్రిల్ 8: సింగరేణి ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకోకుంటే కార్మికులతో కలిసి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బండి పుల్లారావు, ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామ్మూర్తి హెచ్చరించారు. ఇప్పటికే జారీ చేసిన బొగ్గు గనుల వేలం నోటిఫికేషన్ను ఉపసంహరించుకోవాలని, లేకుంటే కార్మికుల నుంచి ప్రతిఘటన తప్పదని స్పష్టం చేశారు. సింగరేణి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ పిలుపు మేరకు శనివారం కొత్తగూడెంలో నిర్వహించిన మహా ధర్నాకు మండల నుంచి బీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలివెళ్లారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కార్మికుల సంక్షేమం కోసం ఉద్యమిస్తామని అన్నారు. కార్యక్రమంలో అశ్వారావుపేట సొసైటీ అధ్యక్షుడు చిన్నంశెట్టి సత్యనారాయణ, నాయకులు యూఎస్ ప్రకాశ్రావు, తాడేపల్లి రవి, నార్లపాటి రాములు, డేరంగుల చంటి పాల్గొన్నారు.