ఖమ్మం, మార్చి 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రెండు దశాబ్దాల క్రితం ఉద్యమ పార్టీగా అవతరించిన టీఆర్ఎస్ (తెలంగాణ రాష్ట్ర సమితి) ఇంతింతై వటుడింతై అన్నట్లు తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించింది. ప్రజానీకాన్ని ఉద్యమంలో భాగస్వాములను చేసి స్వరాష్ర్టాన్ని సాధించింది. ఉద్యమ నేత కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి రాష్ర్టాన్ని అభివృద్ధి బాట పట్టించారు. అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలను చూసి ప్రజలు రెండోసారీ టీఆర్ఎస్కు పట్టంగట్టారు. రైతులు, ప్రజల కష్టాలు తీర్చేందుకు సీఎం కేసీఆర్ ఆసరా, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, అమ్మఒడి, కేసీఆర్ కిట్, రైతుబంధు, రైతుబీమా, రైతు రుణమాఫీ వంటి ఎన్నో పథకాలను అమలు చేస్తున్నారు. ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలను చేర్చారు. అందుకే టీఆర్ఎస్ ప్రజల పార్టీ అయింది. ఇదే ఒరవడిలో రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలను దేశవ్యాప్తంగా అమలు చేసి దేశ ప్రజల రాత మార్చాలని నిశ్చయించుకున్నారు. దీనిలో భాగంగా టీఆర్ఎస్ను బీఆర్ఎస్ (భారత రాష్ట్ర సమితి)గా మార్చాలనుకున్నారు. దేశ రాజకీయాల్లోనూ చక్రం తిప్పాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నారు. అన్నట్లుగానే బీఆర్ఎస్ను ప్రకటించారు. పార్టీ మొదటి బహిరంగ సభ ఖమ్మంలోనే జరగడం విశేషం.
బీఆర్ఎస్ ఖమ్మం సభ చరిత్రాత్మకం..
ఉద్యమ నేత కేసీఆర్కు ఖమ్మం జిల్లాతో ప్రత్యేక అనుబంధం ఉంది. ‘కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో..’ అనే నినాదంతో 29 నవంబర్ 2009లో అమరణ దీక్ష చేపట్టినప్పుడు నాటి ఉమ్మడి పాలకులు ఆయన్ను ఖమ్మం సబ్జైలుకు తీసుకొచ్చారు. కేసీఆర్ ఆరోగ్య సంరక్షణ నిమిత్తం ఖమ్మంలోని పెద్దాసుపత్రికి తరలించి వైద్యం చేయించారు. ఆ సమయంలో జిల్లాప్రజలు ఆయనకు మద్దతుగా నిలిచారు. అప్పటి నుంచి ఆయనకు ఖమ్మంపై ప్రత్యేక అభిమానం ఏర్పడింది. అందుకు నిదర్శనమే ఈ ఏడాది జనవరి 18న ఖమ్మం శివారులోని వీ వెంకటాయపాలెంలో జరిగిన బీఆర్ఎస్ బహిరంగ సభ. సభకు కేరళ, పంజాబ్, ఢిల్లీ ముఖ్యమంత్రులు పినరయి విజయన్, భగవంత్ సింగ్ మాన్, అరవింద్ కేజ్రీవాల్, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్, వామపక్ష పార్టీల జాతీయ, రాష్ట్ర నాయకులు హాజరయ్యారు. బీఆర్ఎస్ ఆవిర్భావాన్ని స్వాగతించారు. సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో రాణించాలని ఆకాంక్షించారు. దేశ ప్రజలందరూ కేసీఆర్కు మద్దతు తెలపాలని పిలుపునిచ్చారు. సభ జాతీయ మీడియాలో చర్చనీయాంశమైంది. ఖమ్మం పేరు దేశవ్యాప్తంగా మార్మోగింది.
సభతో పార్టీ శ్రేణుల్లో నూతనోత్తేజం..
బీఆర్ఎస్ సభ పార్టీ శ్రేణుల్లో నూతనోత్తేజాన్ని నింపింది. సభ ఇన్చార్జిగా మంత్రి హరీశ్రావు బాధ్యతలు తీసుకుని మంత్రి పువ్వాడ అజయ్కుమార్తో కలిసి సభా ఏర్పాట్లను పూర్తి చేశారు. రెండు జిల్లాల పార్టీ అధ్యక్షులు తాతా మధు, రేగా కాంతారావుతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, ముఖ్యనాయకులతో సమావేశాలు నిర్వహించి సభకు లక్షలాది మంది ప్రజలు వచ్చేలా చేశారు. ఇదే స్ఫూర్తితో వచ్చే సాధారణ ఎన్నికల్లో విజయం సాధించాలనే లక్ష్యంతో గులాబీ శ్రేణులు ముందుకు సాగుతున్నాయి.
టార్గెట్ 10కి 10..
ఉమ్మడి జిల్లాల పరిధిలో మొత్తం పది నియోజకవర్గాలు ఉండగా వీటిలో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్కు చెందిన వారే. వచ్చే సాధారణ ఎన్నికల్లో పదికి పది నియోజకవర్గాల్లో విజయబావుటా ఎగురవేసేందుకు పార్టీ శ్రేణులు సిద్ధమవుతున్నాయి. పార్టీ అధినేత కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు ఉభయ జిల్లాల్లో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నాయి. సమ్మేళనాలతో రాష్ట్రవ్యాప్తంగా పార్టీ సభ్యత్వం ఉన్న 60 లక్షల మందికి దిశానిర్దేశం చేయనున్నారు. పార్టీ జిల్లా నేతల నుంచి గ్రామ స్థాయి కార్యకర్త వరకు.. వారిలో సుహృత్ భావాన్ని నెలకొల్పేలా ఆత్మీయ సమ్మేళనాలు జరుగనున్నాయి. పార్టీలో గ్రూప్లు లేవని ఉన్నదంతా ఒక్కటే గ్రూప్ అని, అది కేసీఆర్ గ్రూప్ మాత్రమేనని చాటిచెప్పనున్నారు. పార్టీలో ఉండి పదవులు పొంది, తిరిగి పార్టీకే అన్యాయం చేయాలని చూస్తున్న స్వార్థ నాయకుల కుటిలత్వాన్ని ఎండగట్టనున్నారు. పదవిలో ఉన్నప్పుడు ప్రజలకు ఏమీ చేయకుండా ఇప్పుడు అధికార పార్టీపై దుమ్మెత్తి పోస్తున్న వారికి ఎన్నికల బరిలోనే బుద్ధి చెప్పాలని పిలుపునివ్వనున్నారు. సంక్షేమ పథకాల అమలుతో కలిగిన మంచిని ఇంటింటికీ వెళ్లి వివరించాలని నిర్దేశించనున్నారు. పార్టీ అంతర్గత సమస్యలను ఎమ్మెల్యేలు, పార్టీ బాధ్యులు, ప్రజాప్రతినిధులు సామరస్యంగా పరిష్కరించనున్నారు.
ఎమ్మెల్యేల నాయకత్వంలో సమ్మేళనాలు..
నియోజకవర్గాల పరిధిలో నిర్వహించే ఆత్మీయసమ్మేళనాల బాధ్యతలను ఎమ్మెల్యేలు తీసుకోనున్నారు. ప్రతి పది గ్రామాలను ఒక యూనిట్గా తీసుకొని పార్టీ సభ్యులతో ఆత్మీయ సమ్మేళనాలను నిర్వహించనున్నారు. పట్టణాల్లో ఒకో సమ్మేళనం లేదా పలు డివిజన్లను కలుపుకొని ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించనున్నారు. సమ్మేళనాలకు మంత్రి పువ్వాడ అజయ్కుమార్తోపాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, డీసీసీబీ , డీసీఎంఎస్ చైర్మన్లు హాజరుకానున్నారు. రెండు నెలల్లోపు సమ్మేళనాలను పూర్తి చేసేందుకు మంత్రి పువ్వాడ అజయ్కుమార్ నేతృత్వంలో ఎమ్మెల్యేలు, రెండు జిల్లాల పార్టీ అధ్యక్షులు తాతా మధు, రేగా కాంతారావు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
నేడు ఖమ్మం నగరంలో..
ఖమ్మం నగరంలోని సీక్వెల్ రిసార్ట్స్లో ఆదివారం రాష్ట్ర రవాణాశాఖ పువ్వాడ అజయ్కుమార్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నగర వన్టౌన్ స్థాయి ఆత్మీయ సమ్మేళనం జరుగనున్నది. ఇది ఉమ్మడి జిల్లాలో జరిగే మొట్టమొదటి ఆత్మీయ సమ్మేళనం. పార్టీని సంస్థాగతంగా పటిష్టం చేయడం, క్యాడర్తో క్రియాశీలకంగా పనిచేయించడం, సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రి అజయ్ కార్యకర్తలు, నాయకులకు దిశానిర్దేశం చేయనున్నారు. అనంతరం వారితో కలిసి సహపంక్తి భోజనాలు చేయనున్నారు.
కార్యకర్తలకు భరోసా కల్పించేందుకే..
పార్టీ పటిష్టం కోసం నిరంతరం శ్రమించే కార్యకర్తలకు వెన్నుదన్నుగా ఉండి రాజకీయంగా వారికి భరోసానివ్వడానికే బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలను నిర్వహిస్తోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పది నియోజకవర్గాల్లో ఈ ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించి రానున్న ఎన్నికలకు కార్యకర్తలను సమాయత్తం చేయడంతోపాటు ప్రజా సంక్షేమం, అభివృద్ధి పథకాలను ఇంటింటికీ ప్రచారం చేసేలా దిశానిర్దేశం చేయనున్నాం. క్షేత్రస్థాయిలో పార్టీ మరింత బలోపేతం కోసం కార్యకర్తల అభిప్రాయాలు, మనోభావాలను పంచుకునేందుకే ఈ ఆత్మీయ సమ్మేళనాలను పార్టీ అధినేత సీఎం కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్నాం. ఉమ్మడి జిల్లాలో ఖమ్మం నగరంలోనే తొలి ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేశాం. ఈ కార్యక్రమాన్ని నియోజకవర్గంలో దశలవారీగా కొనసాగిస్తాం.
– పువ్వాడ అజయ్కుమార్, రాష్ట్ర రవాణాశాఖ మంత్రి