ఖమ్మం, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఖమ్మం జిల్లా రైతుబిడ్డను నేను.. ఇకడే పుట్టి ఇక్కడే పెరిగాను.. జిల్లా ప్రజలతోనే నిత్యం కలిసిమెలిసి ఉన్నాను.. నా గొంతులో ప్రాణం ఉన్నంతకాలం ప్రజల మధ్యలోనే ఉంటా.. ఈ ఎన్నికల్లో మీ ఆశీర్వాదంతో మళ్లీ పార్లమెంట్కు వెళ్లి ప్రజాసమస్యలపై కోట్లాడి మరింత అభివృద్ధికి కృషి చేస్తానని బీఆర్ఎస్ ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు అన్నారు. శనివారం ఖమ్మం జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో నామా మాట్లాడారు. గత రెండు ఎన్నికల్లో మంచి మెజార్టీతో గెలిపించి పార్లమెంటుకు పంపితే పార్లమెంట్లో తెలంగాణ గొంతుకనై విభజన హామీలు, ప్రాజెక్టులు, నిధులు, అనేక సమస్యలపైన గళాన్ని వినిపించి సాధించానని చెప్పారు. తన జీవితం తెరిచిన పుస్తకం అని, ఎప్పుడూ 24 గంటలు తమ ఇంటి తలుపులు ప్రజల కోసం తెరిచే ఉంటాయన్నారు. పార్టీలకతీతంగా ప్రజాసేవ చేస్తున్నానని తెలిపారు. ఎవరు ఏ పని మీద ఆఫీసుకు వచ్చినా, ఢిల్లీ వచ్చినా అందర్నీ కలుపుకొని వారికి అండగా ఉండి వారి సమస్యల పరిషారానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఎకడికి వెళ్లినా జిల్లా ప్రజల గురించే ఆలోచన చేసుకుంటానని అన్నారు. ఆ రెండు పార్టీల ఎంపీలు ఏనాడూ తెలంగాణ గురించి, జిల్లా ప్రజల సమస్యల గురించి పార్లమెంట్లో మాట్లాడలేదని అన్నారు.
తన తల్లిది తిరుమలాయపాలెం మండలం కొకిరేణి గ్రామమని, 10వ తరగతి వరకు పాల్వంచ, ఇంటర్ కొత్తగూడెంలో చదివానని నామా గుర్తుచేశారు. ఇకడి ప్రజలతో రాజకీయాల్లోకి రాకముందు నుంచే అనుబంధం ఉందని, సంపాదించిన దానిలో తన కన్నబిడ్డలకు పెట్టుకున్నట్లే జిల్లా ప్రజలకు కూడా పెట్టుకున్నానని చెప్పారు. ప్రజాసేవలోనే ముందుకు సాగుతున్నానని, మళ్లీ ఆశీర్వదించి పార్లమెంట్కు పంపాలని కోరారు. తండ్రి నామా ముత్తయ్య ట్రస్టు ద్వారా పెద్దఎత్తున సేవా కార్యక్రమాలు చేసిన సంగతి తెలిసిందేనని అన్నారు. తెలంగాణ గొంతుక పార్లమెంట్లో వినిపించాలంటే బీఆర్ఎస్ ఎంపీలు చేయవలసిన బాధ్యత అందరిపైనా ఉందని నామా చెప్పారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు మాట్లాడుతూ జిల్లా ఎల్లలు, జిల్లా నైసర్గిక స్వరూపం, జిల్లా సమస్యలు తెలియనటువంటి వ్యక్తులు పోటీలో ఉన్నారని అన్నారు. నామాను గెలిపిస్తే జిల్లా మరింత అభివృద్ధి సాధిస్తుందన్నారు. మాజీమంత్రి పువ్వాడ అజయ్కుమార్ మాట్లాడుతూ రెండు దశాబ్ధాలుగా ఖమ్మంజిల్లా ప్రజలతో అవినాభావ సంబంధం కలిగి ఉన్న నామాను గెలిపించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. ఆయన గెలుపు ద్వారా మరింత అభివృద్ధి జరుగుతుందని చెప్పారు. ఈ నెల 29, 30 తేదీల్లో జరిగే కేసీఆర్ బస్సుయాత్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ 60ఏళ్లపాటు ప్రజల్ని గోసపెట్టిన కాంగ్రెస్ను తరమాలని అన్నారు. అలవికాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వందరోజుల్లోనే ప్రజల విశ్వాసం కోల్పోయిందన్నారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావు, నాయకులు ఉప్పల వెంకటరమణ, బెల్లం వేణుగోపాల్, పగడాల నరేందర్, బొమ్మెర రామ్మూర్తి, డోకుపర్తి సుబ్బారావు పాల్గొన్నారు.