బూర్గంపహాడ్, మార్చి 1: రైతులకు అండగా బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తోందని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు పేర్కొన్నారు. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం మాత్రం ప్రజల ఆస్తులను అమ్మేస్తోందని విమర్శించారు. మండలంలోని మోరంపల్లి బంజర, బూర్గంపహాడ్, ఇరవెండి గ్రామాల్లో బుధవారం పర్యటించిన ఆయన.. రూ.77.14 లక్షలతో నిర్మించిన వ్యవసాయ గిడ్డంగులు, రైతు శిక్షణ కేంద్రాలను ప్రారంభించారు. అనంతరం బూర్గంపహాడ్ సొసైటీ చైర్మన్ బిక్కసారి శ్రీనివాసరావు అధ్యక్షతన ఇరవెండిలో ఏర్పాటు చేసిన సభలో డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణంతో కలిసి ప్రభుత్వ విప్ మాట్లాడారు.
తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి రైతుల సంక్షేమ కోసమే బీఆర్ఎస్ ప్రభుత్వం పాటుపడుతోందని, ఈ క్రమంలో వారి కోసం అనేక పథకాలను అమలు చేస్తోందని వివరించారు. వాటిల్లో రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్, సబ్సిడీ విత్తనాలు, ఎరువులు, ధాన్యం సేకరణ వంటివి అనేకం ఉన్నాయని గుర్తుచేశారు. ఇలాంటి సమయంలో రాష్ర్టానికి సహకరించాల్సిన కేంద్రం.. తెలంగాణకు వచ్చే నిధుల్లోనూ కోత పెడుతోందని విమర్శించారు. అనంతరం ఇరవెండిలో వ్యవసాయ గిడ్డంగి నిర్మించేందుకు రూ.50 లక్షల విలువ చేసే స్థలాన్ని ఇచ్చిన దాత తాళ్లూరి పంచాక్షరయ్యను అభినందించి సన్మానించారు. తరువాత 70 మందికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.
అనంతరం మోరంపల్లిబంజర జడ్పీ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులతో ముచ్చటించారు. విద్యార్థులు పరీక్షలు మంచిగా రాయాలని ఆకాంక్షించారు. వారికి పరీక్ష ఫ్యాడ్లు అందజేశారు. అలాగే సోంపల్లి గ్రామ పంచాయతీలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకు హాజరయ్యారు. డీసీసీబీ చైర్మన్ కూరకూల నాగభూషణం, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు రావు జోగేశ్వరరావు, తానా మాజీ అధ్యక్షుడు తాళ్లూరి జయశేఖర్, డీసీఎస్వో వెంకటేశ్వరరావు, తహసీల్దార్ భగవాన్రెడ్డి, జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత, ఏఎంసీ చైర్మన్ ముత్యాలమ్మ, బీఆర్ఎస్ నాయకులు గోపిరెడ్డి రమణారెడ్డి, జలగం జగదీశ్, వంశీకృష్ణ, లక్ష్మీనారాయణరెడ్డి, శ్రీను, రామారావు, సుబ్రహ్మణ్యం, నాని, రవి, పాషా, సర్వేశ్వరరావు, లక్ష్మి, సూరమ్మ, శ్రావణి తదితరులు పాల్గొన్నారు.