కామేపల్లి, మే 12 : అన్నదాతల సంక్షేమం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోంది. ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన సమయంలో అండగా ఉంటూ ఆదుకుంటోంది. అయితే వర్షాలు, గాలిదుమారాలు వచ్చినప్పుడు పంటలు నేలవాలినా, తెగుళ్లు, చీడపీడలు ఆశించిన పంటలు దెబ్బతిన్నా అన్నదాత పడే ఆందోళన అంతా ఇంతా కాదు. ఈ సమయంలో వారి దగ్గరకు వెళ్లి ధైర్యం చెబుతున్నారు వ్యవసాయ అధికారులు. అంతేగాక నేలవాలిన పంటలకు కాపాడుకునేందుకు ఎలాంటి సస్యరక్షణ చర్యలు పాటించాలో సవివరంగా తెలియజేస్తున్నారు. తెగుళ్లు సోకిన సమయంలో పంటల రక్షణకు ఎలాంటి నివారణ మందులు పిచికారీ చేయాలో వివరిస్తున్నారు. అన్ని వేళలా క్షేత్రస్థాయిలో ఉంటూ సలహాలు సూచనలు ఇస్తుండడంతో ఎన్ని ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా, ఎన్ని చీడపీడలు ఆశించినా కర్షకులు తమ పంటలను కాపాడుకోగలుగుతున్నారు. ఫలితంగా ఆశించిన స్థాయిలో దిగుబడులు సాధిస్తున్నారు.
ఇటీవల అకాల వర్షాలు కురిసిన సమయంలోనూ, అంతముందు పంటలకు వివిధ రకాల చీడపీడలు సోకి పంటలు దెబ్బతిన్న సమయంలోనూ వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు ఎప్పటికప్పడు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పంటలను పరిశీలించారు. అందుకు అనుగుణంగా చేసిన సూచనలను రైతులు పాటించడంతో వారు ఆర్థికంగా నష్టపోకుండా ఉండగలిగారు. వరి, మొక్కజొన్న, పత్తి, కంది, కూరగాయల పంటలను పరిశీలించి వాటి ఎదుగుదల కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలను అన్నదాతలకు చెబుతున్నారు. ఎలాంటి ఎరువులు, మందులు వినియోగించాలో, వాటిని ఎంత మోతాదులో పిచికారీ చేయాలో వివరిస్తున్నారు. రైతువేదికల్లో అన్నదాతలకు నిత్యం సదస్సులు నిర్వహిస్తూ నూతన సాగు పద్ధతులపై అవగాహన కల్పిస్తున్నారు.
వర్షాలకు పంటలు దెబ్బతిన్నప్పుడు, పంటలకు చీడపీడలు సోకినప్పుడు వ్యవసాయ అధికారులు సకాలంలో వచ్చి సలహాలు, సూచనలు చేస్తున్నారు. దీంతో పంటలకు కాపాడుకుంటున్నాం. వారి సూచించిన విధంగా తగిన మోతాదులో మందులను పిచికారీ చేస్తున్నాం. అందువల్లనే పంటలు చేతికొస్తున్నాయి. మంచి దిగుబడులు కూడా సాధిస్తున్నాం. ప్రభుత్వం అందించే రైతుబంధు పథకంతో సాగు పనులు సకాలంలో మొదలుపెడుతున్నాం.
-దుద్దుకూరి నవీన్, యువ రైతు, పండితాపురం