రఘునాథపాలెం, ఫిబ్రవరి 28 : భూదాన్ భూముల్లోని గుడిసెలను తొలగించి కాంగ్రెస్ ప్రభుత్వం చేతులు దులుపుకున్నది.. నిరాశ్రయులను చేసి సామగ్రితో సహ బాధిత కుటుంబాలను తీసుకొచ్చి ఖమ్మం నగరంలోని టీటీడీసీ, అంబేద్కర్ భవనాల్లో పడేసింది.. కనీసం వారి మౌలిక అవసరాలను కూడా తీర్చకుండా గాలికొదిలేసింది. ఏ పట్టింపులు లేకుండా వదిలేస్తే వాళ్లే వెళ్లిపోతారని అనుకున్నారో.. ఏమో.. కనీసం తిండి పెట్టాలనే ఆలోచన కూడా చేయలేదు. దీంతో రెండ్రోజులుగా తిండి కోసం భూదాన్ బాధితులు ఆర్తనాదాలు చేస్తున్నారు.
ఇది చూసి చలించిన బీఆర్ఎస్ పార్టీ మేమున్నామనే భరోసాని కల్పించింది. శనివారం రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో టీటీడీసీ, అంబేద్కర్ భవనాల్లో ఆశ్రయం పొందుతున్న నిర్వాసితులకు అన్నదానం చేశారు. వారికి అవసరమైన నీటిని ట్యాంకర్ల ద్వారా సమకూర్చారు. ఇళ్లు కోల్పోయిన భూదాన్ బాధితులందరికీ న్యాయంచేసే వరకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. మేమున్నామనే ధైర్యాన్ని అందించారు. నిరాశ్రయులకు బీఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు ఆధ్వర్యంలో ఎంపీ పీఏ సయ్యద్ ఇస్మాయిల్, జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షుడు తాజుద్దీన్, నాయకులు ఎస్కే పాషా, షకీనా, వద్దిరాజు రవిచంద్ర అభిమానులు నాన్నబల హరీష్, జగదీశ్, షారు, రాజేశ్, ప్రశాంత్, గణ తదితరులు సపర్యలు అందించారు.
నాగభూషణం ఆధ్వర్యంలో రాత్రి భోజనాలు
భూదాన్ బాధితులకు రాత్రి భోజనాలను బీఆర్ఎస్ జిల్లా నాయకుడు, డీసీసీబీ మాజీ చైర్మన్ కూరాకుల నాగభూషణం అందించారు. ఇళ్లను కూలగొట్టిన కాంగ్రెస్ ప్రభుత్వంలోని పెద్దలు బాధితుల ఆర్తనాదాలను చూసి పైశాచిక ఆనందం పొందుతున్నారని మండిపడ్డారు. బాధితులకు సత్వర న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ నాయకులు పగడాల నాగరాజు, కూరాకుల వలరాజు, తోడేటి లింగరాజు పాల్గొన్నారు.