దుమ్ముగూడెం, మే 6: హామీల అమలు చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వం.. గత కేసీఆర్ ప్రభుత్వంపై బురద జల్లుతోందని బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు విమర్శించారు. మండలంలోని మారాయిగూడెంలో సోమవారం నిర్వహించిన తూరుబాక, కొత్తూరు బీఆర్ఎస్ బూత్ కమిటీ సమావేశంలో ముఖ్య కార్యకర్తలతో ఆయన మాట్లాడారు. మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి మాలోత్ కవితను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. అబద్ధపు గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఆ హామీలను అమలు చేయలేక చేతులెత్తేసిందని విమర్శించారు. గత కేసీఆర్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమిటో తెలంగాణలో ఏ గ్రామానికి వెళ్లినా కనిపిస్తుందని స్పష్టం చేశారు.
పోరాడి సాధించుకున్న తెలంగాణను కాంగ్రెస్ మళ్లీ ఢిల్లీ గులాములకు తాకట్టు పెట్టిందని ఆరోపించారు. అప్పటి మహబూబాబాద్ ఎంపీ, ఇప్పటి కాంగ్రెస్ అభ్యర్థి అయిన బలరాంనాయక్.. అప్పుడు కేంద్రమంత్రిగా ఉండి కూడా తన నియోజకవర్గంలోని భద్రాచలం, పినపాక అసెంబ్లీ సెగ్మెంట్లలో ఉన్న ఏడు మండలాలను ఆంధ్రాలో కలిపిన పాపాన్ని మూటగట్టుకున్నారని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు పేరుతో అప్పటి కేంద్ర మంత్రి జైరామ్ రమేశ్ అధ్యక్షతన ఏర్పడిన ఆర్డినెన్స్ కమిటీ.. ఇక్కడి ఏడు మండలాలను అన్యాయంగా ఆంధ్రాలో కలిపిందని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు మానె రామకృష్ణ, సాగి శ్రీనివాస్, రాజు, అన్నె సత్యనారాయణమూర్తి, కణితి రాముడు, రేసు లక్ష్మి, తునికి కామేశ్, అపక వీర్రాజు, సోడి కొండయ్య, కటిబోయిన వెంకటేశ్వర్లు, బొల్లి వెంకట్రావ్, కొత్త మల్లేశ్, అపక శ్రీను, వెంకటేశ్, కుంజా నాగేశ్వరరావు, పోడియం సుబ్బారావు, పాయం వెంకటేశ్వర్లు, కుర్సం రాజు, కారం వెంకటేశ్, సాగి వర్మ, కల్లూరి కామేశ్, మర్మం గంగరాజు, జీలకర గంగరాజు, కట్టం నాగరాజు తదితరులు పాల్గొన్నారు.