సత్తుపల్లి టౌన్, నవంబర్ 24: ప్రైవేటు విద్యాసంస్థల్లో పనిచేసే టీచర్ల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించానని సత్తుపల్లి ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నియోజకవర్గ అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. ప్రైవేటు టీచర్ల సమస్యలను అసెంబ్లీ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన ఏకైక ఎమ్మెల్యేను తాను మాత్రమేనని గుర్తుచేశారు. కరోనా సమయంలో కేసీఆర్ ప్రభుత్వం ప్రైవేటు టీచర్లకు ఆర్థిక సాయం అందించిందని అన్నారు. సత్తుపల్లి పట్టణంలో శుక్రవారం పర్యటించిన ఆయన.. ప్రైవేటు విద్యాసంస్థల్లో ఆత్మీయ సమావేశాలు నిర్వహించి ప్రైవేటు టీచర్లతో మాట్లాడారు. కరోనా సమయంలో ప్రైవేట్ టీచర్లు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని తాను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లానని అన్నారు.
దీంతో ఆయన వారి సంక్షేమం కోసం రూ.180 కోట్ల నిధులు మంజూరు చేశారని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటు టీచర్లకు రూ.2 వేల చొప్పున ఆర్థిక తోడ్పాటును అందించారని గుర్తుచేశారు. అదేవిధంగా సత్తుపల్లి ప్రాంతం గత పదేళ్లుగా ఎలా అభివృద్ధి చెందిందో విద్యావంతులైన ఉపాధ్యాయులు గమనించాలని కోరారు. సత్తుపల్లి పట్టణంలో అత్యాధునికమైన లైబ్రరీ నిర్మాణంతోపాటు 100 బెడ్ల ఆసుపత్రి, సత్తుపల్లి పట్టణంలో వేంసూరు రోడ్డులో నాలుగులైన్ల రహదారిగా విస్తరించడంతోపాటు సుందరమైన మున్సిపల్ భవనాన్ని ఏర్పాటు చేసినట్లు వివరించారు. బీఎస్సీ నర్సింగ్ కళాశాల ఏర్పాటు చేయించామన్నారు. ఈ నెల 30న జరిగే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి తనకు అత్యధిక మెజార్టీ అందించాలని కోరారు. ప్రైవేటు విద్యాసంస్థల బాధ్యులు, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు కూసంపూడి మధు, లింగారెడ్డి, వంశీ, కూసంపూడి మహేశ్, వనమా వాసు, మట్టా ప్రసాద్, రఫీ, మల్లూరు అంకమరాజు పాల్గొన్నారు.