సత్తుపల్లి, మే 6: ప్రజా సమస్యల పరిష్కారం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాడేందుకు బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలని సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పిలుపునిచ్చారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని ఆరోపించారు. ఆయా హామీలను అమలుచేయించేందుకే ప్రజల పక్షాన ఆయా ప్రభుత్వాలపై బీఆర్ఎస్ పోరాడుతుందని స్పష్టం చేశారు. సత్తుపల్లి మండలంలో సోమవారం పర్యటించిన ఆయన.. ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు విజయాన్ని కాంక్షిస్తూ వివిధ గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలో తల్లాడ మండలంలోని పలు గ్రామాల్లో గల ఉపాధి హామీ కూలీలను కలుసుకొని వారితో మాట్లాడారు. పార్లమెంట్లో తెలంగాణను వాణిని వినిపించేందుకు బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు గెలిపించుకోవాలని, అందుకోసం కారు గుర్తుపై ఓటు వేసి నామాకు అత్యధిక మెజార్టీ అందించాలని కోరారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను మభ్యపెడుతోందని విమర్శించారు. ఆయా హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసేంత వరకు బీఆర్ఎస్ పోరాడుతుందని స్పష్టం చేశారు.
సత్తుపల్లి, మే 6: కారు గుర్తుపై ఓటు వేసి బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కోరారు. పార్లమెంటు ఎన్నికల్లో ఖమ్మం స్థానం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావును గెలిపించాలని కోరుతూ.. సత్తుపల్లి మండలం కిష్టారం, గౌరిగూడెం, కొత్తూరు, సదాశివునిపాలెం గ్రామాల్లో సండ్ర సోమవారం విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు కూసంపుడి రామారావు, యాగంటి శంకర్రావు, శీలపురెడ్డి హరికృష్ణారెడ్డి, మందపాటి చెన్నారెడ్డి, మందపాటి ప్రసాద్రెడ్డి రమేశ్ తదితరులు పాల్గొన్నారు.