సత్తుపల్లి రూరల్, నవంబర్ 14: నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధిని చూసి ఈ ఎన్నికల్లోనూ తనను ఆదరించాలని సత్తుపల్లి ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నియోజకవర్గ అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్య కోరారు. గడిచిన మూడు పర్యాయాలు ఇక్కడి నుంచే గెలుపొందిన తాను సత్తుపల్లి నియోజకవర్గాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేశానని అన్నారు. మరోసారి అవకాశమిస్తే మరింతగా తీర్చిదిద్దుతానని అన్నారు. ఇప్పటికే సీఎం కేసీఆర్ సహకారంతో రూ.1,000 కోట్ల నిధులు తెచ్చి నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులు చేపట్టినట్లు వివరించారు. సత్తుపల్లి మండలంలో మంగళవారం పర్యటించిన ఆయన.. కిష్టారం, చెరుకుపల్లి, యాతాలకుంట, రేగళ్లపాడు, బాసారం తదితర గ్రామాల్లో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి గ్రామంలోనూ మట్టి రోడ్ల స్థానంలో సీసీ, బీటీ రోడ్లు నిర్మించినట్లు చెప్పారు. సత్తుపల్లిలో 100 బెడ్ల ఆసుపత్రి, ప్రతి గ్రామంలోనూ పల్లె దవాఖానాలు ఏర్పాటు చేసి పేదలకు నాణ్యమైన ఉచిత వైద్యం అందిస్తున్నామన్నారు. నియోజకవర్గంలో ప్రతి ఎస్సీ కుటుంబానికీ దళితబంధు పథకాన్ని వర్తింపజేస్తామని అన్నారు. ప్రతిపక్ష నాయకుల మాయమాటలను నమ్మవద్దని ప్రజలకు సూచించారు. వారివన్నీ మోసపూరిత వాగ్దానాలేనని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు మామిళ్లపల్లి కృష్ణయ్య, పాలకుర్తి సునీత, కూసంపూడి నర్సింహారావు, యాగంటి శ్రీనివాసరావు, కొలపనేని అశోక్, మోదుగు పుల్లారావు, లక్ష్మీనారాయణ, శీలపురెడ్డి హరికృష్ణారెడ్డి, కొడిమెల అప్పారావు తదితరులు పాల్గొన్నారు.
కిష్టారం మాజీ సర్పంచ్ భిక్షపతి, ఆయన అనుచరుడు నాగరాజుతోపాటు యాతాలకుంటలో కాంగ్రెస్కు చెందిన పలు కుటుంబాల వారు ఎమ్మెల్యే సండ్ర ఆధ్వర్యంలో బీఆర్ఎస్లో చేరారు.